రాజస్థాన్ శీతాకాలం సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశం. జైపూర్, జైసల్మేర్, జోధ్పూర్, బికనీర్, ఉదయపూర్ వంటి ప్రధాన ప్రదేశాలను ముందుగానే చూసినట్లయితే ఈసారి కిషన్గఢ్ సందర్శించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. కిషన్గఢ్, రాజస్థాన్లోని అందమైన ప్రదేశం జైపూర్, అజ్మీర్ మధ్య ఈ ప్రదేశం ఉంది. ఇది తెల్లని పాలరాయికి ప్రసిద్ధి చెందింది. దీనిని రాజస్థాన్ యొక్క మాల్దీవులు, రాజస్థాన్ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. రాజస్థాన్లోని కిషన్గఢ్ ఇటీవల పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రదేశంగా మారింది.
శీతాకాలం ఈప్రదేశం సందర్శించేందుకు ఉత్తమ సమయం. బాలీవుడ్ సినిమాలు ఎన్నో ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ఇప్పుడు ఈ ప్రదేశం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లకు కూడా ప్రసిద్ధిచెందింది. పెళ్లికి ముందు జరిగే ఈ తంతును నిర్వహించుకునేందు చాలా జంటలు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటున్నాయి. రండి.. కిషన్గఢ్ ప్రాంత ప్రత్యేకతలు తెలుసుకుందాం.

కిషన్గఢ్ ఎందుకు ప్రత్యేకం?
కిషన్గఢ్ ఒక పాలరాతి డంపింగ్ యార్డ్. ఇది 300 బిఘాలలో విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించినవారు మంచు లోయలలో ఉన్న అనుభూతిని పొందుతారు. ఆసియాలోనే అతిపెద్ద మార్బుల్ మార్కెట్ ఇదే. ఇక్కడ మార్బుల్ కటింగ్, పాలిషింగ్ పనులు జరుగుతాయి. దీని కారణంగా పెద్ద మొత్తంలో పాలరాయి వ్యర్థాలు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. రాజస్థాన్ ప్రభుత్వం ఈ వ్యర్థాల కోసం ఒక స్థలాన్ని కూడా ఏర్పాటు చేసింది. క్రమంగా, ఇక్కడ, పాలరాయి పొడి, పాలరాయి ముక్కలు మొదలైనవి జోడించడం ప్రారంభమైంది. ఇప్పుడు ఇక్కడ తెల్లని పాలరాయి పర్వతాలు కూడా ఏర్పడ్డాయి, దీని కారణంగా ఈ ప్రదేశం మొత్తం పూర్తిగా తెల్లగా మారిపోయింది.
బాలీవుడ్ సినిమాలెన్నో ఈ ప్రాంతంలో షూటింగ్ జరిగింది..
బాఘీ 3లోని ఒక పాట, జోధా అక్బర్, ద్రోణ, వీర్ వంటి అనేక చిత్రాలను కిషన్గఢ్లో చిత్రీకరించడం జరిగింది. అంతే కాకుండా, ఈ లొకేషన్ డిజె వాలే బాబు పాటలో కూడా ఉపయోగించబడింది. ఇప్పుడు ఈ ప్రదేశం ప్రీ వెడ్డింగ్ షూట్లకు కూడా ప్రసిద్ధి చెందింది.
ఈ ప్రదేశం ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఎన్నో షూటింగ్లు కూడా జరిగాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశంలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధిచెందిన తొమ్మిది గ్రహాల ప్రత్యేక ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఈ ఆలయాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. ఇంకా ఈ ప్రదేశం అందమైన కోటలు, పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, కాలువలు, సరస్సులకు కూడా ప్రసిద్ధిచెందింది.
సందర్శించడానికి ఉత్తమ సమయం
కిషన్గఢ్ డంపింగ్ యార్డ్ని సందర్శించడానికి ఉత్తమ సీజన్ శీతాకాలం. ఈ సీజన్లో ప్రదేశపు అందం మరింత రెట్టింపవుతుంది. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుంది. వేసవిలో కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. వేసవిలో వెళ్లినట్లయితే మాత్రం ఉదయాన్నే లేదా సాయంత్రం వెళ్లే చూసేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రవేశ సమయాలు
ఇక్కడికి వెళ్లేందుకు ఎలాంటి ప్రవేశ రుసుము అవసరం లేదు. అయితే, పర్యాటకులు మార్బుల్ అసోసియేషన్ కార్యాలయం నుండి అనుమతి మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ సందర్శించే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications













