ఈ దసరాకు ఏడుపాయల దుర్గమ్మ దర్శనం చేసుకుందామా..!
చుట్టూ పచ్చని చెట్లు, గుట్టలు, వాగులు, గలగల పారే పిల్ల కాలువలతోపాటు ఇక్కడి ప్రాంతాల్లో అడుగడుగునా ఆధ్యాత్మిక నిండి ఉంటుంది. దసరా సందర్భంగా ఎక్కడెక్కడికో వెళుతుంటారు. పక్కనే ఉన్న ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకోండి.....పచ్చని ప్రకృతిలో కొలువైన ఉన్న ఈ దుర్గమ్మ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.. ఇక్కడి నదుల్లో మంజీరానది ఏడుపాయలుగా విడిపోయి కొండవాగుల నడుమ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహాల మధ్యలోని ఒక కొండ గుహలో శ్రీ కనుకదుర్గమ్మ గ్రామదేవతగా వెలసింది. రండి ఈ దసరనాడు ఏడుపాయల దుర్గమ్మ దర్శనం చేసుకుందాం.

ప్రతి ఏటా జాతర..
దసరా సందర్భంగా ఇక్కడ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ ఏడుపాయల దుర్గమ్మ ఆలయం మెదక్ జిల్లా నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరబాద్ నుంచి అయితే సుమారు 110 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. రాష్ర్టంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఆదివారం రోజు మాత్రమే ఉదయం ఐదు నుంచి రాత్రి 7వరకు దర్శించుకోవచ్చు. మిగిలిన రోజుల్లో అయితే ఉదయం 5.30 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు ఏడుపాయల దుర్గమ్మ జాతర. ఏటా ఇక్కడ ఒక జాతరను నిర్వహిస్తారు. ఆ జాతర కూడా మహాశివరాత్రి సమయంలో నిర్వహించడం విశేషం. ఈ జాతరలో ఎడ్లబండ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ. భక్తులు దుర్గమ్మకు బోనాలు సమర్పిస్తారు. మొక్కలు చెల్లించుకుంటారు.
మూడురోజుల పాటు ఉత్సవాలు..
ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలు కూడా ఎంతో ప్రత్యేకం..ఏడుపాయల దుర్గాభవానీ ఉత్సవాలు మూడురోజుల పాటు కొనసాగుతాయి. మెదటి రోజు అమ్మవారికి ప్రత్యేక పుజలను నిర్వహిస్తారు. మొదటి రోజు భక్తులు ఉపవాసాలు ఉండి సాయంత్రం 6గంటలకు అమ్మవారి దర్శనం చేసుకొని ఉపవాసాలను విరమించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. రెండోరోజు ఎడ్ల బండ్లు తిరుగుతాయి. మూడో రోజు రథోత్సవం జరుగుతుంది. మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మను దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగి తేలుతారు. విశాలమైన ఏడుపాయల ప్రాంగణమంతా జాతర జరిగినన్ని రోజులు అశేష జనవాహినితో జనసంద్రంగా దర్శనమిస్తుంది. దశాబ్దాల తరబడిగా ఇక్కడ జాతర జరుగుతుండం వల్ల, భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడుపాయల జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా ప్రకటించింది.

ఏడుపాయల చరిత్ర...
ద్వాపర యుగాంతంలో పరిక్షిత్తు మహారాజు ఒక పాముకాటు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞ గుండాలు నిర్మింపజేసి సప్త రుషులతో యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుండటంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగులతల్లి దేవుళ్లకు వేడుకొనన్నదట. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని తీసుకుని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగవతీ నది ఏడుపాయలుగా చీలి ప్రవహించిందట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతిగుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట. ఏడుగురు రుషులతో యజ్ఞం చేయడం.. గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడు పాయలు అనీ.. అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.



Click it and Unblock the Notifications













