మధురైలోని ఈ వంటకాలను టేస్ట్ చేసేద్దామా..!
దక్షిణ భారతదేశపు వంటకాలకు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రసిద్ధ ప్రదేశాలతో పాటు టూరిస్టులు ఇక్కడి వంటకాలను కూడా ఎంతో ఇష్టపడతారు. మధురైలోని ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించేందుకు దేశ విదేశాలనుంచి పర్యాటకులు ప్రతి ఏటా తరలి వస్తుంటారు. కేవలం ఇక్కడి వంటకాలను రుచి చూసేందుకే చాలామంది పర్యాటకులు వస్తుంటారు కూడా. దక్షిణాది రాష్ర్టాలైనా కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడు, మధురైలోని వంటకాలు కొంచెం వేరుగా ఉంటాయి. అందుకే మధురై పర్యటనకు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం అక్కడి ప్రసిద్ధ వంటకాల జాబితాను అందిస్తున్నాం. మరెందుకాలస్యం మధురైను సందర్శిస్తున్నట్లయితే తప్పకుండా వీటి రుచిని ఆస్వాదించండి.

పరుప్పు పాయసం
మధురైలోని తియ్యని వంటకాల్లో ఉత్తమమైనది పరుప్పు పాయసం. వేయించిన పెసరపప్పు ను కుక్కర్లో వండుతారు. వంటకం పూర్తయిన తరువాత కొంచెం బెల్లం పాకంను చివరిలో జోడిస్తారు. వేయించిన జీడిపప్పు లేదా బాదంను దీనిపై వేసి వేడివేడి రుచికరమైన ఈ పాయసాన్ని అందిస్తారు. ఈ పాయసం చాలా టేస్టిగా ఉంటుంది కూడా. మధురై సందర్శనకు వెళ్లాలనుకునేవారు తప్పకుండా ఈ పాయసాన్నిటేస్ట్ చేయాల్సిందే..
పొంగల్
మధురైలో జరిగే ఉత్సవాల్లో, పండుగల్లో ఈ స్వీట్ తప్పని సరిగా ఉంటుంది. బియ్యం, తియ్యని పాలతో పాటు యాలకులు, ఎండుద్రాక్ష, జీడిపప్పు వంటి వివిధ పదార్ధాలను జోడించి ఆరుబయట సాంప్రదాయబద్ధంగా తయారు చేసే వంటకం ఇది. దీనిని ఇక్కడివారు మొదట సూర్యుడికి నైవేద్యంగా పెడతారు. పొంగల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అరటి ఆకులపై రుచికరంగా వడ్డించేది. మరొకటి బంకమట్టి కుండలో వండి వడ్డించేది. దీనిని కోలం అని అంటారు. ఈ పొంగల్ కూడా ఎంతో టేస్టిగా ఉంటుందండి.

పనియరం
దక్షిణ భారతదేశపు ప్రత్యేక వంటకం పనియరం. వీటినే గుంట పొంగనాలు అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వంటకాన్ని ఎక్కువగా వండుతారు. ఇడ్లీ పాత్ర వంటి దానిపై పిండిని వేసి ఆవిరిలో ఉంచి వేడివేడిగా దీనిని అందిస్తారు. కన్నడలో ఈ వంటకాన్ని పడ్డు, తెలుగులో గుంట పొంగనాలు అని అంటారు. దీనిని విభిన్న రకాల రుచులలో కారంగా, పులుపుగా, తియ్యగా ఎవరి ఇష్టానికి తగినట్లు వారికి అందిస్తారు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిని ఆంధ్రప్రదేశ్లో ఈవెనింగ్ స్నాక్స్గా కూడా వాడుతుంటారు. ఎపిలో ప్రసిద్ధమైన వంటకాలలో ఇది కూడా ఒకటి. ఉదయం పూట అల్పాహారంగా, ఈవెనింగ్ స్నాక్స్గా కూడా ఈ వంటకం ఎంతగానో ప్రసిద్ధి చెందింది. దోస పిండితో కూడా వీటిని చేసుకోవచ్చు.

అరటిపండు బొండా
బొండాలను ఇది వరకే చాలా ప్రదేశాల్లో రుచి చూసి ఉంటారు. మైసూరు బొండాలను కూడా తిని ఉంటారు. కానీ అరటిపండు బొండాను ఎప్పుడైనా తిన్నారా? సాధారణంగా బొండాలలో బంగాళదుంప కుర్మాను లేదా ఇతర కూరగాయలను పెట్టి తయారు చేస్తుంటారు. అయితే మధురైలో మాత్రం వీటికి బదులుగా అరటి పండును నూనెలో వేయించి మరీ ఈ బొండాలను తయారు చేస్తారు. అందుకే సాధారణ మసాలా బొండాకు భిన్నంగా దీని రుచి ఉంటుంది. దీనిని టీ తో అల్పాహారంగాను, స్నాక్స్గాను తీసుకుంటారు. సాధారణంగా బొండాలనేవి మైదాతో తయారుచేస్తుంటారు.



Click it and Unblock the Notifications













