నేడు ఆగస్టు 26 దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు. హిందువులు మాత్రమే కాదు విదేశీయులు కూడా ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కృష్ణుడి పుట్టిన రోజుని కృష్ణాష్టమి, గోకులాష్టమి వంటి పేర్లతో పిలుస్తుంటారు. విష్ణుమూర్తిలోని దశావతారాల్లో 8వ అవతారం శ్రీ కృష్ణుడు అని భక్తుల నమ్మకం. ఈ రోజున దేశంలోని చాలామంది తప్పకుండా శ్రీకృష్ణుని ఆలయాలను సందర్శిస్తుంటారు. ఆ చిన్ని కృష్ణునికి ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. కృష్ణుని ఆలయాలు దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా హైదాబాద్లోని ప్రసిద్ధిచెందిన కృష్ణాలయాలను చూసొద్దాం రండి.

ఇస్కాన్ టెంపుల్
ఇస్కాన్ దేవాలయాలు దేశంలోని అత్యంత అందమైన ఆధ్యాత్మిక, మతపరమైన కేంద్రాలుగా పేరుగాంచాయి. ఇక, హైదరాబాద్లోని ఇస్కాన్ దేవాలయం కూడా అందులో ఒకటే. భాగ్యనగరంలో వెలసిన ఇస్కాన్ టెంపుల్ ను శ్రీ రాధా మదన మోహన ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయం శ్రీకృష్ణునికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో శ్రీ గౌర-నితై, శ్రీ జగన్నాథ బలదేవ-సుభద్ర, శ్రీ రాధా మదన-మోహన వంటి ఇతర దేవతా విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. నగరంలో అత్యంత ప్రసిద్ధ చెందిన ఆలయాలలో ఇస్కాన్ టెంపుల్ ఒకటి. ఈ టెంపుల్ దక్షిణ భారత దేవాలయాల సంప్రదాయ శైలితో నిర్మించబడింది. ఈ ఆలయ భవనం చుట్టూ పచ్చని తోటలు, కాంప్లెక్స్లతో పాటు అనేక నీటి ఫౌంటెన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో నిరంతరం కృష్ణారాధన జరుగుతుంది. కృష్ణాష్టమి సందర్భంగా ఆగస్టు 26 వ తేదీన మహాభిషేకాలు, మహా ప్రసాద వితరణ, హారతులు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. కృష్ణాష్టమి రోజున తప్పకుండా ఇస్కాన్ టెంపుల్ను దర్శించుకోవాల్సిందే..

శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం
హైదారబాద్లో ప్రసిద్ధిచెందిన శ్రీకృష్ణుని ఆలయాల్లో మరొకటి కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని గోవర్దన గిరి మీద కొలువై ఉన్నశ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయం ప్రకృతి మధ్యలో వెలసింది. ఇక్కడ శ్రీ కృష్ణుడు సతీసమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. ఇందులో రుక్మిణీ దేవి, సత్యభామ దేవీ, గోదా దేవి వంటి దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ప్రధాన ఆలయం అంత పెద్దది కాకపోయినా, విశాలమైనది. ఆ ప్రదేశం ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. సూర్యాస్తమయ దృశ్యాలు ఇక్కడ ఎంతో అందంగా ఉంటాయి. ఆలయం పక్కన ఓ గోశాల కూడా ఉంది.

శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్
హైదరాబాద్లోని ప్రసిద్ధిచెందిన కృష్ణుని ఆలయాలలో మరొకటి శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్. ఈ ఆలయం బంజారా హిల్స్లో కొలువై ఉంది. ఈ ఆలయం ఒరిస్సాలో ఉన్న అసలు పూరీ జగన్నాథ ఆలయానికి ప్రతిరూపంగా ఉంటుంది. ఈ ఆలయం పూరీ ఆలయ శైలిలో ఉంటుంది. అయితే, రెండు ఆలయాల పరిమాణం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయంలో జగన్నాథుని విగ్రహంతో పాటు అతని సోదరులు - బలభద్ర (బలరామ) సుభద్ర విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంగణంలో ఐదు చిన్న దేవాలయాలు కూడా కొలువై ఉన్నాయి. 70 అడుగుల ఎత్తుతో ఆలయ పైభాగం ఇక్కడికి వచ్చే భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇంకా ఇక్కడ చెప్పుకోవాలంటే ఆలయం లోపలి ద్వారం మీద విష్ణుమూర్తి తొమ్మిది అవతారాల శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం మొత్తం 3000 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఒరిస్సా నుండి సుమారు 600 టన్నుల ఇసుకరాయిని ప్రత్యకంగా తెప్పించారట. దీనిని దాదాపు 60 మంది కళాకారులు కలిసి నిర్మించారు.
హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్
భాగ్యనగరంలోని మరో ప్రసిద్ధిచెందిన కృష్ణుని ఆలయం హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్. ఇది బంజారా హిల్స్ రోడ్ నం. 12 లో ఉంది. ఈ ఆలయ నిర్మాణం 2018లో జరిగింది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా గోల్డ్ కలర్లో మెరిసిపోతుంటుంది. ఈ ఆలయం అందాలను రాత్రిపూటే వీక్షించాలి. శ్రీ శ్రీ రాధ గోవింద, లక్ష్మీ నరంసింహ స్వామి విగ్రహాలు ఈ ఆలయంలో కొలువై ఉన్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది.



Click it and Unblock the Notifications













