మల్లెల తీర్థం.. అద్భుత జలపాతం..
జలపాతాలు అంటేనే ప్రకృతి ప్రసాదించిన సహజ దృశ్యాలు..ఎత్తయిన కొండలు.. ఆ కొండలపై నుంచి పడే సన్నని నీటి తుంపరులు చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అందరి కళ్లు జలపాతాల వైపే ఉంటాయి. ఎందుకంటే, వర్షాకాలంలో జలపాతాలు జలకళ సంతరించుకుంటాయి. ఈ సీజన్లో జలపాతాలను చూడాలని మీరు అనుకుంటున్నారా? అయితే, ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదండి. తెలంగాణలోని మహాబూబ్నగర్ జిల్లాలోని ఈ జలపాతాన్ని చూసేయండి. రండి ఈ జలపాతపు విశేషాలు తెలుసుకుందాం.
మల్లెలతీర్థం మహబూబ్ నగర్ జిల్లాలో విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కనిపించే ఒక సుందర సహజ జలపాతం. 150 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకే ఈ జలపాతం చూపరులకు కనువిందు చేస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో కూడి అత్యంత రమణీయంగా కనిపిస్తుంది ఈ జలపాతం. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి మార్గంలో వచ్చే అమ్రాబాద్ మండలంలోని వట్వర్లపల్లి గ్రామం నుండి తొమ్మిది కిలోమీటర్లు అడవి మార్గంలో ప్రయాణిస్తే ఈ జలపాతాన్నిచేరుకోవచ్చు.

ఈ ప్రయాణం కాస్త సవాలే..
ఈ జలపాతం కృష్ణా నది ద్వారా ఏర్పడింది. ఇది సుమారు 150 అడుగుల ఎత్తు నుండి ఒక చిన్న కొలనులోకి ప్రవహిస్తుంది. ఈ జలపాతం చేరుకోవడానికి సందర్శకులు సుమారు 1.5 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ కొంచెం సవాలుతో కూడుకున్నది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ మార్గం జారుతుంటుంది. కాబట్టి పర్యాటకులు కాస్త జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది.
వివిధ రకాల పక్షులు..
మల్లెల తీర్థం ముఖ్యంగా పక్షులను వీక్షించడానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడికి వచ్చే సందర్శకులు గ్రే జంగిల్ఫౌల్, స్పాటెడ్ డోవ్, ఇండియన్ పీఫౌల్ వంటి వివిధ రకాల పక్షి జాతులను చూడొచ్చు. ఫోటొగ్రఫి ప్రేమికులకు ఈ ప్రాంతం ఎంతో అనువైనది. ఎందుకంటే, ఇక్కడి ప్రకృతి అందాలను వారి కెమెరాలలో బంధించేయొచ్చు. మల్లెల తీర్థం చుట్టూ ఉన్న ప్రాంతాలు అనేక గిరిజన గ్రామాలకు నిలయాలుగా ఉన్నాయి. సందర్శకులు ఇక్కడి వారి జీవన విధానాలు,ఆచారాల గురించి తెలుసుకోవచ్చు. గిరిజనుల వేషధారణ, వారి అలవాట్లను తెలుసుకోవచ్చు.

ప్రవేశ రుసుము
మల్లెల తీర్థాన్ని సందర్శించడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. నామమాత్రపు పార్కింగ్ రుసుము చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మల్లెల తీర్థంలో ఎటువంటి వసతి సౌకర్యాలు లేవు. ముప్పయి కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం వంటి సమీప పట్టణాలలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు పర్యాటకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రెక్కింగ్ చేసేవారు మాత్రం సౌకర్యవంతమైన బూట్లు ధరించాలి. తగినంత నీరు, స్నాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఎలా చేరుకోవాలి
రోడ్డు మార్గం ద్వారా అయితే హైదరాబాద్ నుండి బస్సు లేదా టాక్సీని తీసుకోవచ్చు. హైదరాబాద్ నుండి మల్లెల తీర్థం చేరుకోవడానికి సుమారు నాలుగైదు గంటల సమయం పడుతుంది. రైలు మార్గం ద్వారా అయితే, మల్లెల తీర్థానికి సమీప రైల్వే స్టేషన్ మార్కాపూర్ రోడ్డులో ఉంది. ఇది సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్యాటకులు హైదరాబాదు నుండి మార్కాపూర్ రోడ్డుకు రైలులో ప్రయాణించి, మల్లెల తీర్థం చేరుకోవడానికి టాక్సీలో బయలుదేరొచ్చు.
విమాన మార్గం ద్వారా అయితే మల్లెల తీర్థానికి సమీప విమానాశ్రయం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది సుమారు 170 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. హైదరాబాద్ వరకు విమానంలో ప్రయాణించి, అక్కడి నుండి టాక్సీ లేదా బస్సులో మల్లెల తీర్థం చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications













