మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ ఉగాది సందర్భంగా ఓ శుభవార్తను తీసుకొచ్చింది. ఏప్రిల్ 9వ తేది నుంచి మూడు ప్రత్యేక ఆఫర్లు మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది హైదరాబాద్ మెట్రో రైలు. ఈ మూడు ఆఫర్లు ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9వ తేది నుంచి మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం భారత్లో మెట్రో ప్రయాణం విపరీతంగా పెరిగింది.
ట్రాఫిక్ సమస్యను నిర్మూలించేందుకు చాలా నగరాల్లో ప్రయాణికుల కోసం మెట్రో ట్రైన్లను అందుబాటులోకి తెచ్చారు. ఇక, హైదరాబాద్లో కూడా దీని వినియోగం పెరిగింది. అయితే, ప్రయాణికులకు ఉగాది కానుకలు అందించింది మెట్రో. మెట్రో ప్రయాణికుల కోసం తీసుకొచ్చిన.. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లు ఏప్రిల్ 9వ తేది నుంచి ఆరు నెలల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ ఆఫర్లపై హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు కోసం ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ సరికొత్తగా కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ను పరిచయం చేస్తోందని పేర్కొన్నారు.
ఈ ఆఫర్లు నిత్యం మెట్రోలో ప్రయాణించేవారికి ఎంతో సౌకర్యవంతంగానూ, వెసులుబాటు కల్పిస్తాయని ఆయన అన్నారు. అంతేకాకుండా, ఎక్కువగా మెట్రో సేవలు వినియోగించుకుంటే ఎక్కువ రివార్డులు కూడా పొందొచ్చని వెల్లడించారు. దీంతోపాటు కొత్తగా ప్రారంభించిన కస్టమర్ లాయల్టీ ప్రోగ్రాం ద్వారా మెట్రో ప్రయాణికులు ఎంతో లబ్ధి పొందుతారని కూడా ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఆరు మాసాల పాటు వర్తించనున్న ఆఫర్లు..
ప్రయాణికుల నుంచి వస్తోన్న విభిన్నమైన స్పందన, అభ్యర్థనలతో ఉగాది రోజున మేం ఈ ఆఫర్లను ప్రయాణికుల కోసం తిరిగి పరిచయం చేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నామని ఆయన తెలిపారు. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ మరియు మెట్రో స్టూడెంట్ పాస్ల ఆఫర్లు ఏప్రిల్ 9, 2024 నుంచి మరో ఆరు మాసాల వరకు ఇవి వర్తిస్తాయని తెలిపారు. ఈ కార్డు ద్వారా మెట్రో ప్రయాణికులు ఏ సెలవుదినమైనా 59 రూపాయలకే ప్రయాణం చేయవచ్చు. వీటితోపాటు 'స్టూడెంట్ పాస్ల' చెల్లుబాటును కూడా మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.
మెట్రో స్టూడెంట్ పాస్లు కూడా పొడిగింపు..
మార్చి 31 వ తేదీతో ముగిసిన మెట్రో స్టూడెంట్ పాస్ల రాయితీలను కూడా పొడిగిస్తున్నట్లు కూడా మెట్రో ట్రైన్ స్పష్టం చేసింది.
HMRL తన 'సూపర్ ఆఫ్-పీక్ ఆఫర్' ఆఫర్ ద్వారా రద్దీ లేని సమయాల్లో ప్రయాణంపై పది శాతం తగ్గింపును ప్రకటించింది. అయితే, మార్చి 31 వ తేదీతో ఈ ఆఫర్లు ముగియగా.. వాటిని పొడిగించే ప్రసక్తి లేదని ఇటీవలె హైదరాబాద్ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే వేసవి కారణంగా నగరవాసులు మెట్రోకు ప్రాధాన్యం పెరగడంతో, ప్రయాణికుల అభ్యర్థనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన 3 కారిడార్లలో నిత్యం సగటున 5 లక్షల మంది నగరవాసులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications













