సమ్మర్ వచ్చేసింది. మరికొద్దిరోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇక, ఈ వేసవి సెలవుల్లో చాలామంది చల్లని ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. మరికొందరైతే పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకుంటారు. రోజువారీ బిజి లైఫ్ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు, కుటుంబంతో కలసి సరాదాగా విహరించేందుకు మరికొందరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటారు.
చాలామంది వేసవిలో కూల్గా ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టం కనబరుస్తుంటారు. అందుకోసం ప్రత్యేకంగా హిల్స్టేషన్లను సందర్శిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే, అనంతగిరిహిల్స్, హార్సిలీహిల్స్, లంబసింగి, చింతపల్లి, కోనసీమ, మారేడుమిల్లి, అహోబిలం, పాడేరు వంటి ప్రాంతాలకు వెళ్లాలనుకుంటారు. ఎందుకంటే, అక్కడ ఈ సమయంలో ఎంతో కూల్గా ఉంటుంది. ఇక ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునేవారు కేరళ, ఊటీ, అరకు, సిమ్లా, చిక్మగలూర్, కశ్మీర్, డార్జిలింగ్, మౌంట్ అబు, అండమాన్ నికోబార్, లోనావాలా, షిల్లాంగ్ లాంటి వాటిని తమ జాబితాలో చేర్చుకుంటారు.
ఇలా, ఈ వేసవి సెలవుల్లో ఒక వారంరోజుల పాటు టూర్ ప్లాన్ చేసుకుని విహరిస్తూ ఉంటారు. వీటితో పాటు చాలామంది చారిత్రక ప్రదేశాలు, పురాతన కట్టడాలను వీక్షించేందుకు కూడా టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఇక, ఈ వేసవి సెలవుల్లో ఇప్పటికే ట్రైన్లు, సమ్మర్ స్పెషల్ ప్రత్యేక ట్రైన్లను వేయడం జరిగింది. మరికొద్దిరోజుల్లో బస్సులు కూడా స్పెషల్ డిస్కౌంట్తో పర్యాటకులు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తాయి. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ సైతం కూడా వేసవి యాత్రలకోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది అవేంటో చూసేద్దాం.

అరకు, ఊటీ ప్రత్యేక ప్యాకేజీ...
తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా అరకు, ఊటీ ప్యాకేజీలను తీసుకొచ్చారు. ఈ ఐదు రోజుల టూర్లోని అరకు ప్యాకేజీలో కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్మెరైన్ మ్యూజియం, వైజాగ్ బీచ్ను పర్యాటకులకు చూపించనున్నారు. తక్కువ ధరలకే వైజాగ్లోని అన్ని ప్రాంతాలను వీక్షించొచ్చు. ఇందులో ముఖ్యంగా పెద్దలకు రూ.6,999 చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలకయితే రూ.5,599 టికెట్ ధర ఉంది.
ఈ టూర్ ప్యాకేజీలో నాన్ ఏసీ, ఏసీ రవాణా, అరకులో వసతి, గైడ్ సౌకర్యం అన్నీ ఇందులోకే వస్తాయి. ఇక, భోజనం, ఆయా చోట్ల ప్రవేశ టికెట్లు, దర్శనం టికెట్లు, బోటింగ్ చార్జీలు పర్యాటకులే పెట్టుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ ప్రత్యేక ప్యాకేజీ ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది.

బెంగళూరు- ఊటీ-మైసూర్ ప్రత్యేక ప్యాకేజీ...
దీంతో పాటు తెలంగాణ టూరిజం వారు మరో ప్యాకేజీని కూడా తీసుకొచ్చారు. ఇది బెంగళూరు- ఊటీ-మైసూర్ ప్రత్యేక ప్యాకేజీ. ఈ ప్యాకేజీ ప్రతీ సోమవారం ఉంటుంది. ఇది ఆరు రోజులు ఉంటుంది. ఇక, ఈ టూర్లో పెద్దలకు రూ.11,999 టికెట్ ధర ఉండగా, పిల్లలకు రూ.9,599 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కరికి మాత్రమే హోటల్ గది అవసరం అయితే మాత్రం టికెట్ ధరకు అదనంగా రూ.
3వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఓల్వో బస్సులో ప్రయాణం, నాన్ ఏసీ హోటల్లో వసతి ఈ ప్యాకేజీలో ఉన్నాయి. పర్యాటకులు మరిన్ని వివరాల కోసం తెలంగాణ టూరిజం వెబ్సైట్ను tourism.telangana.gov.in సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ టూర్లతో పాటు మరికొన్ని రోజుల్లో గోవా టూర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. మరెందుకాలస్యం మరి మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.



Click it and Unblock the Notifications













