తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సందర్శించేందుకు ఎన్నో ప్రదేశాలున్నాయి. అక్కడ చారిత్రక కట్టడాలు, మొదలుకుని పురాతన ఆలయాలు, జలపాతాలు, పురాతన కట్టడాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టకుంటాయి. వీటితో పాటు అక్కడి వంటకాలను రుచిచూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ ఎన్నో ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తుంటారు.
అందులో ముఖ్యంగా నాంపల్లిలోని నుమాయిష్ ప్రత్యేకతల గురించి చెప్పుకోవాల్సిందే. ఇప్పడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ ప్రారంభానికి సన్నాహాకాలు మొదలయ్యాయి. జనవరి 1న 83వ నుమాయిష్ ప్రారంభానికి సిద్ధం కానుంది. ఇది ఒక అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శన. ఇందులో మొత్తం 2400 స్టాళ్లను నిర్వహిస్తారు.
దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్నారు. ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఏపీలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకూ 'నుమాయిష్' ప్రదర్శన కొనసాగుతుంది. మొత్తం 46 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్కు ఎంతో ప్రజాదరణ ఉందని చెప్పుకోవాలి.
దీంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత ప్రచారం లభించడంతో వాటి విక్రయాలకు ఈ ఎగ్జిబిషన్ కేంద్రంగా నిలిచింది. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఈ ఎగ్జిబిషన్ను సందర్శిస్తుంటారు.

మొదటగా 1938లో ప్రారంభమైంది..
ఇది మొదటగా 1938వ సంవత్సరంలో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నేతృత్వంలో ప్రారంభమైంది. అప్పట్లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నాంపల్లి పబ్లిక్ గార్డన్లో నిర్వహించేవారు. ఇక, 1946 నుంచి ఈ ఎగ్జిబిషన్ను నాంపల్లిలోనూ ఎగ్జిబిషన్ మైదానంలోని 26 ఎకరాల సువిశాల స్థలంలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న 'నుమాయిష్' కార్యక్రమానికి దేశ, విదేశాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఎగ్జిబిషన్ లో అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభ్యమవుతాయి. నగరంలో దొరకని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
దుస్తులు, మంచాలు, కిచెన్ సామాగ్రి, వివిధ రకాల దుప్పట్లు, కశ్మీరీ డ్రై ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొత్త తరహా ఫర్నీచర్స్, మల్టీ పర్పస్ ఉపకరణాలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ స్టాల్స్, ఫుడ్ కోర్టులు, సందర్శకులను అలరించేందుకు అమ్యూజ్మెంట్ పార్క్ ఇలా అన్నీ ఎగ్జిబిషన్ లో కొలువుదీరనున్నాయి. ఇప్పటికే దాదాపు స్టాళ్ల కేటాయింపులు పూర్తి కాగా, పలు స్టాళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

లోపలికి ప్రవేశించేందుకు టిక్కెట్ ధరలు..
సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహాకులు చర్యలు చేపడుతున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎగ్జిబిషన్ కు వచ్చే వారిని గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. టికెట్ ధర 40 రూపాయలు మాత్రమే.
వినోదాత్మకమైన పలు విభాగాలు కూడా ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆహ్లాదకర వాతావరణంలో అందరూ మెచ్చేలా 'నుమాయిష్' సాగుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి ఏనుగుల రాజేందర్ కుమార్ వివరించారు. ఈ ఎగ్జిబిషన్ నిర్వహణకు 33 సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సబ్ కమిటీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారని సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్ అంటున్నారు.



Click it and Unblock the Notifications













