అతి తక్కువ ధరకే ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం...
ఐఆర్సీటీసీ టూరిజం మరో అద్భుతమైన టూర్ ప్యాకేజీనీ పర్యాటకుల కోసం తీసుకొచ్చింది. అది కూడా అతి తక్కువ ధరలకే ఏడు పుణ్యక్షేత్రాలను చూసే అవకాశం పర్యాటకులకు కల్పిస్తుంది. దేశంలో ఆధ్యాత్మిక ప్రాంతాలకు కొదవే లేదు. సెలవులు దొరికితే చాలు ఎక్కువ మంది పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకుంటారు.
అలాంటివారికోసం ఐఆర్టిసి ఓ సరికొత్త ఆఫర్ను తీసుకొచ్చింది. కేవలం 14 వేల రూపాయలకు ఏడు పుణ్యక్షేత్రాలను వీక్షించొచ్చు. అది కూడా మొత్తం తొమ్మిది రోజుల ప్రయాణం.. ఆ వివరాలేంటో చూద్దాం...

దివ్య దక్షిణ యాత్ర...రూ.14 వేలకే..
ఐఆర్సీటీసీ టూరిజం దివ్య దక్షిణ యాత్ర అనే టూర్ ప్యాకేజీని మరోసారి తీసుకొచ్చింది. ఇప్పటికే ఓసారి ఈ టూర్ విజయవంతంగా పూర్తయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ ఆపరేట్ చేస్తున్నట్టు ఐఆర్సిటిసి ప్రకటించింది. అది కూడా కేవలం రూ.14 వేలకే. ఇందులో భాగంగా అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్లోని ప్రముఖ ఆలయాలతో పాటు సమీపంలోని పర్యాటక ప్రాంతాలను కూడా చూడొచ్చు.
ఈ యాత్ర అక్టోబర్ 31న ప్రారంభం కానుంది. ఇది మొత్తం ఎనిమిది రాత్రులతో కూడిన టూర్. 9 రోజుల ప్రయాణం. ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకున్న పర్యాటకులు సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూర్, రేణిగుంటలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ఎక్కోచ్చు.

తొమ్మిది రోజుల ప్రయాణం..
మొదటి రోజు ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర సికింద్రాబాద్లో ప్రారంభమవుతుంది. రెండో రోజు పర్యాటకులు తిరువన్నామలై చేరుకుంటారు. అక్కడ ప్రెష్ అయిన తర్వాత అరుణాచల దర్శనం చేసుకోవాలి. అక్కడి నుంచి సాయంత్రం మధురైకి బయల్దేరాల్సి ఉంటుంది. ఇక మూడో రోజు మధురై చేరుకుంటారు. ముందుగా రామేశ్వరం చేరుకోవాలి. అక్కడ ప్రెష్ అయ్యి రామనాథస్వామి ఆలయంతో పాటు అక్కడి స్థానిక ఆలయాలు సందర్శించుకోవాలి. ఆ రాత్రికి రామేశ్వరంలో బస చేయాల్సి ఉంటుంది. నాలుగో రోజు రామేశ్వరం నుంచి మధురైకి ప్రయాణాన్ని మొదలుపెట్టాలి. సాయంత్రం మధురైలో మీనాక్షి అమ్మవారి దర్శనం ఉంటుంది. అక్కడినుండి కన్యాకుమారికి ప్రయాణం. ఐదో రోజు కన్యాకుమారి చేరుకుంటారు.
కన్యాకుమారిలో రాక్ మెమొరియల్, కుమారి అమ్మన్ టెంపుల్, గాంధీ మండప్, సన్సెట్ పాయింట్ వీక్షించొచ్చు. రాత్రికి కన్యాకుమారిలోనే బస చేయాలి. ఇక, ఆరో రోజు త్రివేండ్రం ప్రయాణానికి సిద్ధం కావాలి. అక్కడ శ్రీ పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్ ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి. అక్కడి నుంచి తిరుచ్చిరాపల్లి ప్రయాణం. ఏడో రోజు ఉదయం శ్రీరంగంలో రంగనాథ స్వామి వారి దర్శనం. అనంతరం తంజావూరులో బృహదీశ్వర ఆలయం చేరుకుంటాం. అక్కడి నుంచి తిరుగు ప్రయాణానికి సిద్ధం కావాలి. ఎనిమిదో రోజు, తొమ్మిదో రోజు ప్రయాణం ఉంటుంది. పర్యాటకులు తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లలో దిగొచ్చు.

ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి...
ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ మూడు కేటగిరీల్లో ఉంటుంది. భారతీయ రైల్వే రైల్ టూరిజంను ప్రోత్సహించేందుకు భారత్ గౌరవ్ స్కీమ్లో భాగంగా 33 శాతం కన్సెషన్ అందిస్తోంది. ఎకానమీ ప్యాకేజీ ధర రూ.14,100. స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.21,500. కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.27,900. పర్యాటకులు https://www.irctctourism.com/ వెబ్సైట్లో ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీనీ బుక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత భారత్ గౌరవ్ సెక్షన్లోకి వెళ్లాలి. అందులో దివ్య దక్షిణ యాత్ర వేర్వేరు తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసేముందు అక్కడ ఉన్న నియమనిబంధనలన్నీ పూర్తిగా చదవాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications














