ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగిన పిఠాపురం పవిత్రమైన గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో జైన, బౌద్ధ, శైవ మరియు వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా ఉన్నది. పిఠాపురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్ఫు గోదావరి జిల్లాకు చెందిన పుణ్య క్షేత్రం. పిఠాపురాన్ని పూర్వం 'పీఠికాపురం' అనేవారు. పిఠాపురం రాజులు కళాపోషణను, సాహిత్యాన్ని పెంచిపోషించేవారు. పురాణాల్లో ఈ క్షేత్రాన్ని పుష్కర క్షేత్రంలో గా పేర్కొన్నారు. ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాథుడు తన పిఠాపురం గురించి తన కావ్యంలో ప్రస్తావించాడు కూడా.
ఇది కూడా చదవండి: కాకినాడ లో సందర్శనించవలసిన స్థలాలు !
చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, మరోవైపు గోదావరి నదికి నెలవైన ఈ పిఠాపురం అష్టాదశశక్తి పీఠాలలో ఒకటైన పురుహూతికా అమ్మవారికి నిలయం. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. అమ్మవారి పేరుమీదనే ఈ ఊరికి పిఠాపురం అన్న పేరొచ్చింది. పిఠాపురంలో దర్శించవలసిన ఆలయాలు/ సందర్శనీయ స్థలాల వివరాలలోకి వెళితే ...

చిత్ర కృప : Rajachandra
కుక్కుటేశ్వర దేవాలయం
కుక్కుటేశ్వర దేవాలయం కోనేరు (పాదగయ) కు ముందు తూర్పుముఖంగా ఉంటుంది. గుడికి ఎదురుగా ఏకశిల నంది విగ్రహం అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది. కుక్కుటేశ్వర లింగం తెల్లగా గర్భాలయంలో కొలువై ఉంటుంది. ఈ ఆలయానికి రెండు వైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి.
పురుహూతికా దేవి ఆలయం
కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు.

పురుహూతికా అమ్మవారు
చిత్ర కృప : Rajachandra
ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషను కి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్తాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు. గుడి చాలా చిన్నది. అయినప్పటికి అష్టాదశ శక్తీ పీఠాల శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా ఉంటుంది.

పాదగయ క్షేత్రం
చిత్ర కృప : విశ్వనాధ్.బి.కె.
శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం
పిఠాపురం దత్త క్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం. శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు. ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం" గా ఏర్పాటు చేయబడింది. శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురం లో మాత్రమే కలదు. మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి పాదుకలు కలవు.
పిఠాపురంలో చూడవలసిన ఇతర దేవాలయాలు/ సందర్శనీయ స్థలాలు
షిరిడి సాయి గురు మందిరం, కాలభైరవుడు ఆలయం, కుంతి మాధవస్వామి ఆలయం, వేణు గోపాలస్వామి ఆలయం, నూకాలమ్మ గుడి, కుక్క పాముగుడి, రాముని కోవెల , వెంకటేశ్వరస్వామి గుడి, కోతి గుడి, కోట సత్తెమ్మ తల్లి గుడి, శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం మొదలైనవి చూడదగ్గవి.

పిఠాపురం ఎలా చేరుకోవాలి ?
చిత్ర కృప : Rajachandra
పిఠాపురం చేరుకోవటం ఎలా ?
వాయు మార్గం : విమానాల్లో వచ్చే యాత్రికులు రాజమండ్రి (60 కి. మీ) లేదా వైజాగ్ (180 కి. మీ) ఎయిర్ పోర్ట్ లో దిగి, క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి పిఠాపురం చేరుకోవచ్చు.
రైలు మార్గం : సామర్లకోట రైల్వే జంక్షన్ పిఠాపురం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ తెలంగాణ, రాయలసీమ మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగుతాయి. స్టేషన్ బయట షేర్ ఆటోలు లేదా బస్టాండ్ కు వెళ్లి ప్రభుత్వ బస్సుల్లో ఎక్కి పిఠాపురం చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం : కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి, తుని తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు ప్రతిరోజూ తిరుగుతుంటాయి.



Click it and Unblock the Notifications













