ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఉంది. ఇది పుణ్య క్షేత్రం మరియు పంచారామాల్లో ఒకటి. ఈ ప్రదేశం గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ ... క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం ద్రాక్షారామం లేదా దక్షారామం . దక్ష ప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది.

ఆలయ ముఖ చిత్రం
Photo Courtesy: Aditya Gopal
నేటి ఫ్రీ కూపన్లు : ఇప్పుడే త్వరపడండి బుకింగ్ ఖజానా వద్ద హోటళ్ళ బుకింగ్ ల మీద 50 % ఆఫర్ సాధించండి
పౌరాణిక గాధలు
తారాకాసురుని కంఠంలో అమృత లింగం వుందేది. అది వుండగా అతన్ని జయించలేరని దానిని ఛిన్నం చేయడానికి దేవతలు కుమారస్వామిని ప్రార్ధించారు. కుమారస్వామి దెబ్బకు అది 5 ముక్కలైంది. ఒకటి ద్రాక్షారామంలో, రెండవది అమరారామం [అమరావతి] లో, మూడవది క్షిరారామం [పాలకొల్లు] లో, నాలుగవది సోమారామం [గుణుపూడి, భీమవరం] లో , అయిదవది కుమారారామం [సామర్లకోట దగ్గరగల భీమవరం] లో పడ్డయట. పూర్వం దక్షప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది. అందుకే దక్షారామం అయింది. అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ వుండేవి, అందుకని ద్రాక్షారామం అన్నారు.
ఒకనాడు దక్షుడు యజ్ఞం తలపెట్టాడు. ఈ యజ్ఞానికి అందరినీ పిలిచి శివుణ్ని పిలవలేదు కారణం శివుడు చూసినా కూడా పలకరించలేదని, అభివాదం చేయలేదని కోపం వచ్చి!! మీకొక విషయం తెలుసా ?? దక్షుడు శివునికి స్వయాన మామ పిల్లనిచ్చాడు. అంటే పార్వతి దేవి దక్షునికి కూతూరన్న మాట. తండ్రి చేస్తున్న యాగం గురించి కూతురైన పార్వతి దేవికి తెలుస్తుంది. పుట్టింటిలో జరిగే కార్యం కనక వెళ్తానని శివుని వద్ద ప్రపోజల్ పెడ్తుంది. కానీ శివుడు పిలవని పేరంటానికి వెళ్ళకూడదని అంటాడు. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైన ఉందా ?? ఎలోగలాగా ఆ శివుణ్ని ఒప్పించుకొని పుట్టింటిలో జరిగే యజ్ఞానికి వెళ్ళింది పార్వతి దేవి.
ఇక ఇక్కడ ఏమతుంది షరా మామూలే. పార్వతి దేవిని ఎవరూ కూడా పలకరియ్యలేదు. ప్రేమాదరాలు చూపించలేదు. పార్వతి దేవికి కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. అయ్యో !! నా భర్త మాట వినకుండా వచ్చానని పశ్చాత్తాపపడింది. ఆడవాళ్ళు ఎట్లోఅట్ల సాధించుకుంటారే గాని తీర చూస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇటు పుట్టింట్లోనూ వుండలేక పోయింది, అటు శివుడి దగ్గరకెళ్ళి జరిగిన విషయం చెప్పలేకపోయింది. పాపం. ఆ అవమానం భరించలేక తనని తను కాల్చుకుని బూడిద అయింది. ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు. తన జటాజూటంనుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆయన వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. పత్నీ వియోగాన్ని భరించలేని శివుడు పార్వతి సూక్ష్మశరీరాన్ని భుజంమీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయతాండవం చేశాడు. శివుణ్ణి ఆపటానికి విష్ణువు పార్వతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన చక్రాయుధంతో ముక్కలు చేశాడు. ఆ శరీరం 18 ముక్కలయి 18 చోట్ల పడ్డాయి. అవే అష్టాదశశక్తిపీఠాలు. దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమరూపంలో స్వయంభువుడిగా వెలిశాడు.
పూర్వం వేదవ్యాసుల వారు కాశిలో నివసించేవారు. ఒకసారి కాశీవిశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలచి ఎక్కడా భిక్ష దొరక్కుండా చేశాడట. దానికి వేదవ్యాసుడు కోపించి కాశీని శపించబోయాడుట. అప్పుడ అన్నపూర్ణాదేవి ఆయనకీ, శిష్యులకీ భిక్ష పెట్టిందట. వేదవ్యాసుడు కాశీని శపించబోవటం శివుడికి కోవం తెప్పించింది. వెంటనే శివుడు వేదవ్యాసుణ్ణి శిష్యసమేతంగా కాశీ విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి ఆయనకు దక్షారామము పోయి అక్కడ భీమేశ్వరుని సేవించమనీ, అక్కడ వుంటే కాశీలో వున్నట్లే వుంటుందనీ చెప్పగా వ్యాసుడు తన 300 మంది శిష్యులను వెంటబెట్టుకుని దాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు. దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంబంమీద వ్యాసుని విగ్రహం చెక్కబడింది.
భీమేశ్వర ఆలయం
ద్రాక్షారామం పంచారామాలలో ఒకటిగానే కాదు, అష్టాదశ శక్తి పీఠాల్లొ ఒకటిగా, త్రిలింగ క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ మూల విరాట్ట్ బీమేశ్వర స్వామి కాగా, అమ్మవారు దాక్షాయిణి. భీమేశ్వర స్వామి స్వయంభు లింగరూపంలో 14 అడుగుల ఎత్తు వుంటారు. లింగం సగభాగం నల్లగా, మిగిలిన సగభాగం తెల్లగా ఉంటుంది. అర్ధనారీశ్వరుడు నతానికి ఇదొక నిదర్శనం. ఆలయంలో క్రింద దర్శన అనంతరం పై అంతస్తులో పూజాదికాలతో మళ్లీ దర్శనం చేసుకుంటారు. అంటే రెండు అంతస్తులలో వుంటుంది. ఇక్కడ లక్ష్మి నారాయణుడు క్షేత్రపాలకుడిగా వున్నాడు. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ. 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్థంభాలపై, గోడలపై 832 పైగా శాసనాలు ఉన్నాయి. మనకి వీటిలోని వ్రాత అర్ధంకాకపోయినా చారిత్రిక పరిశోధకులకు ఇవి పెన్నిధి వంటివి. ఇలాంటి శాసనాల ఆధారంగా చేసిన పరిశోధనల ద్వారానే మనకు మనదేశ పూర్వ చరిత్ర తెలుస్తుంది.

భీమేశ్వర ఆలయానికి దారి
Photo Courtesy: chandra
గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది. అందుకే ఆ పేరు. గద లేదు. నమస్కార ముద్రలో వుంటాడు. తుష్కరులు ఈ విగ్రహం కాళ్ళ దగ్గర కొట్టేశారు. ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి. దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట. ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్ట దిక్పాలకులకూ మండపం వుంది. బహుశా దీన్ని ఇక్కడే చూస్తామేమో.

ఆలయ ప్రాంగణం
Photo Courtesy: Ramachandra
ఏకశిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. అష్టదిక్పాల మండపానికి ఎదురుగా వున్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు. ఇందులో మూడు ప్రాకారాలున్నాయి. అందులో మొదటి రెండు ప్రాకారాలలో గోడలకి బొడిపలు కనబడతాయి. పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి వుండటంవల్ల ఆ ప్రదేశమంతా కాంతిమయంగా వుండేదట. నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు.

ఆలయ లోపలి భాగం
Photo Courtesy: Ramachandra
ఇక్కడ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లొ ద్వాదశ శక్తి పీఠంగా మాణిక్యాంబ రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది. మిగతా శక్తి పీఠా క్షేత్రాలకు ద్రాక్షారామంలోని మాణిక్యాంబ శక్తి పీఠానికి ఒక భిన్నమైన విశిష్టత వుంది. దాదాపు అన్ని శక్తి పీఠ క్షేత్రాలలో అమ్మవారి విగ్రహం ఒకచోట, శ్రీచక్ర యంత్రం మరోచోటా వుంటాయి. కానీ ద్రాక్షారామంలో మాణిక్యాంబదేవిని శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్టించడం వల్ల శ్రీచక్రయంత్రానికి, అమ్మవారికీ ఏకకాలంలో పూజలు జరుగుతుంటాయి. ఈ క్షేత్రంలో యంత్రం వేసి అమ్మవారిని ప్రతిష్టించడం విశేషం. సతీదేవి తనువు చాలించిన ప్రదేశంలోనే శక్తిపీఠం ఆవిర్భవించడం వల్ల ఒక మహిమాన్విత ప్రాంతంగా విరా జల్లుతోంది.

ఆలయంలోని ప్రధాన కొలను
Photo Courtesy: Adityamadhav83
ద్రాక్షారామం ఎలా చేరుకోవాలి ??
విమాన మార్గం
ద్రాక్షారామం కి 36 కి. మీ. దూరంలో ఉన్న విమానాశ్రయం రాజమండ్రి విమానాశ్రయం. ఈ విమానాశ్రయం దేశీయ విమానాశ్రయం. ఇక్కడి నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ వంటి నగరాలకు విమాన సర్వీసులు ఉన్నాయి.
రైలు మార్గం
ద్రాక్షారామం కి 30 కి. మీ. దూరంలో ఉన్నది సామర్లకోట రైల్వే జంక్షన్ . ఇక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ మొదలగు నగరాలకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
రోడ్డు మార్గం
రోడ్డు మార్గం గురించి ఎటువంటి ఢోకా చెదావలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ద్రాక్షారామంకి అన్ని నగరాలనుంచి బస్సు సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కనుక బస్సు మార్గం శ్రేయస్కరం.

ద్రాక్షారామంకి రోడ్డు మార్గం
Photo Courtesy: Bsskchaitanya



Click it and Unblock the Notifications













