సెలవుల్లో రిషికేష్లోని ఈ ప్రదేశాలను చుట్టేలా ప్లాన్ చేసుకోండి..
ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడల్లా మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు రిషికేశ్. నాలుగు నుండి ఐదు గంటల్లో హాయిగా ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. ఈ వారంలో వచ్చే సెలవులతో రిషికేష్లో ఈ ప్రదేశాలను చుట్టేందుకు ప్రణాళిక సిద్దం చేసుకోండి. ఇది ప్రకృతి అందాలతో నిండి ఉండే అద్భుతమైన ప్రదేశమే కాకుండా చాలా మంది ఇష్టపడే గమ్యస్థానంగానూ పేరు సాధించింది. రిషికేశ్ ప్రధానంగా ఆధ్యాత్మికత పరంగా, యోగా కేంద్రంగా, సాహస ప్రియుల గమ్యస్థానంగా మంచి గుర్తింపు పొందింది. మరెందుకాలస్యం రిషికేష్లోని ఈ ప్రదేశాలను చూసేయండి మరి.

రిషికేష్లో మెరైన్ డ్రైవ్..
రిషికేశ్లో మెరైన్ డ్రైవ్ ఉందని మీకు తెలుసా..? రిషికేశ్లోని గంగా నది ఒడ్డున 'ఆస్తా మార్గం' ఉంది. దీనిని మెరైన్ డ్రైవ్ అని కూడా పిలుస్తారు. ఇది గంగా నది ఒడ్డున చాలా సంవత్సరాల క్రితం నిర్మించబడింది. దేశంలోని నదీ తీర ప్రాంతాల్లో ఉండే అందమైన పట్టణాల్లో రిషికేశ్ ఒకటి. దీంతో ఇది సాధారణ నదీతీర గమ్యస్థానంగానూ పేరుగాంచింది. ఎళ్లవేళలా చల్లని గాలులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ పట్టణం పర్యాటకులకు మంచి వాతావరణాన్ని అందిస్తుంది. ఈ రహదారి రిషికేశ్లోని త్రివేణి ఘాట్ నుండి బ్యారేజ్ వరకు నిర్మించబడింది. దీని పొడవు సుమారు మూడు కిలోమీటర్లు ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యాటకులు సంచరిస్తూనే ఉంటారు.

నీర్ఘర్ జలపాతం
ఈ జలపాతం రిషికేశ్లో అతిపెద్ద జలపాతం. దీనిని నీర్ఘర్ జలపాతం అని కూడా పిలుస్తారు. ప్రకృతి అందాలను తిలకించేందుకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ నీర్ జలపాతం బద్రీనాథ్ హైవే పైన రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు చేరుకోవడానికి మోటర్ రహదారి ఉంది. దాని సహాయంతో ఇక్కడకు వెళ్లవచ్చు. ఈ జలపాతం రిషికేశ్లోని అతిపెద్ద జలపాతంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి జలపాతపు సవ్వడులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

జిల్మిల్ గుహ
జిల్మిల్ గుహ అంటే మూడు గుహల సమూహం. ఈ గుహలు మణికుట్ పర్వతం మీద ఉన్నాయి. ప్రధాన రిషికేష్ నగరంలోని లక్ష్మణ్ ఝుల నుండి 21 కిలోమీటర్లు, నీలకంఠ ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నీలకంఠకు డ్రైవింగ్ చేసిన తర్వాత, దట్టమైన అడవిలో ఉన్న ఫుట్పాత్ ద్వారా, దాదాపు ఒక గంట లేదా అంతకంటే తక్కువ సమయంలో ఈ ప్రదేశాన్ని చేరుకోగలరు. అవును, ఈ ప్రదేశాన్ని చేరుకోవాలంటే కాలినడక మార్గం ద్వారే చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించడం అంత కష్టమేమీ కాదు. ఇది ఎంతో సురక్షితమైనది కూడా. రోజంతా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉంటారు. నికుత్ కజ్రీ ఫారెస్ట్ అని పిలువబడే ఈ అడవి అనేక ఏనుగులకు నిలయంగా కూడా ఉంది.
రిషికుండలోని వేడి నీటి జలపాతం..
ప్రసిద్ధ రఘునాథ్ దేవాలయం పక్కనే రిషికుండ్ అనే అందమైన, పురాతనమైన వేడి నీటి జలపాతం ఒకటి ఉంది. ఈ ప్రదేశానికి వనవాస సమయంలో రాముడు వచ్చి ఈ జలపాతపు నీటిలో స్నానం చేశాడని ప్రతీతి. పురాతన కాలంలో,ఈ జలపాతపు నీటిని ఋషులు తమ పవిత్ర స్నానానికి ఉపయోగించేవారట. త్రివేణి ఘాట్కి అతి సమీపంలో ఉన్న ఈ ప్రదేశాన్ని రిక్షా ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
గరుడ చట్టి జలపాతం
రుషికేశ్ నుండి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడ చట్టి జలపాతం వర్షాకాలంలో అత్యంత సుందరమైనదిగా పరిగణించబడుతుంది, ఇక్కడ నీరు ఏడు వేర్వేరు స్థాయిల నుండి ప్రవహిస్తుంది. ఈ జలపాతం ప్రారంభమయ్యే సమీపంలోనే గరుడునికి అంకితం చేయబడిన ఆలయం ఉంది. ఈ జలపాతం చూసేందుకు చిన్నదైనప్పటికీ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దట్టమైన పచ్చదనం, తాకబడని ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ ప్రదేశం రిషికేశ్లోని రహస్య ప్రదేశాలలో ఒకటిగా పేరుగాంచింది.



Click it and Unblock the Notifications













