మైసూరు దసరా ఉత్సవాలకు బయలుదేరుదామా...!
అక్టోబర్ నెల నుంచి పండుగలు మొదలుకానున్నాయి. ఈ నెలలో వచ్చే మొదటి పండుగ దసరా.. ఇది దేశంలోని ప్రజలంతా ఎంతో సంబురంగా జరుపుకునే పండుగ. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పండుగను నిర్వహించుకున్న కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగకు కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మైసూరు దసరా ఉత్సవాలు మరింత ప్రత్యేకం. ఈ ఉత్సవాలకు దేశంలోనే ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఓ వైపు రాజ సంస్థానం మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలతో ఇక్కడ దసరా సంబరాలు అంబరాన్నంటుతాయి. మరెందుకాలస్యం మైసూరు దసరా ఉత్సవాలకు బయలుదేరుదామా?
వివిధ రకాల దసరాలు..
మైసూరులో దసర పండుగ ఉత్సవాలు నెల ముందు నుంచే మొదలవుతాయి. ఇక్కడి ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తుంది. మైసూరులో ప్రత్యేకంగా వివిధ రకాల దసరాలు నిర్వహిస్తారు. బాలల దసరా, రైతుల దసరా, మహిళల దసరా, యువకుల దసరా అని వేరువేరు దసరాలు నిర్వహించుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ఇక్కడ ఎన్నో వేడుకలు కూడా నిర్వహించుకుంటారు. ఈ ఉత్సవాల సందర్భంగా చాముండి దేవిని తొమ్మిది రోజులపాటు తొమ్మిది అవతారాలను ఎంతో అందంగా ముస్తాబు చేసి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఇక్కడ అనేక పోటీలు, ప్రదర్శనలు, ఆహారోత్సవాలు ఇంకా ఎన్నో నిర్వహిస్తారు.

400 సంవత్సరాల కాలం నాటి వేడుకలు..
ఈ వేడుకలు నాలుగ వందల సంవత్సరాల క్రితం ప్రారంభించినవి. అప్పటినుంచి ఇప్పటివరకూ ఈ వేడుకలను అదేపద్ధతిలో నిర్వహిస్తున్నారు. వడయార్ రాజవంశం ఈ వేడుకలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. 1610 నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తొమ్మిది రోజుల పాటు జరిపే ఈ పూజలో దుర్గ, లక్ష్మీ, సరస్వతి, కాళీ, చాముండేశ్వరీ రూపాలను పూజించడం ఆనవాయితీ. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం, వాటి ఆకులను పంచుకోవడం చేస్తారు. ఇక, నవమి రోజు ఆయుధ పూజ చేయాలి. ఆయుధపూజ రోజున అన్ని వృత్తుల వారు తమ తమ పనిముట్లను, వాహనాలను శుభ్రం చేసి పూజిస్తారు.
లేజర్ షో కూడా ప్రత్యేకం..
ఈ ఉత్సవాల్లో దివిటీల ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ మధ్య లేజర్ షో కూడా ఏర్పాటు చేశారు. దసరా సందర్భంగా ఇక్కడ వివిధ శకటాల ప్రదర్శన ఉంటుంది. మైసూరు రాజవంశస్థులు నవరాత్రి పూజల్లో భాగంగా అంబా విలాస్ ప్యాలెస్లోని దర్బార్ హాల్లో శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి సోమవారం శ్రీకారం చుట్టారు. రత్నఖచిత బంగారు సింహాసనాన్ని అమర్చారు. ఈనెల 15 నుంచి 24 వరకు ప్యాలెస్లో రాజ సంప్రదాయానికి అనుగుణంగా యువరాజు యుదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ నవరాత్రి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్యాలెస్లోని అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని దసరా వేడుకలు జరిగే పది రోజుల పాటు ప్రజలు చూసే అవకాశం కల్పిస్తారు.

ఏనుగు మీద చాముండి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి ఊరేగిస్తారు...
మైసూరులో దసరా రోజు జరిగే వేడుక చూసేందు రెండు కళ్లు సరిపోవంటే నమ్మండి. ఏనుగు మీద స్వర్ణ అంబారీ వుంచి, చాముండి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి ఊరేగిస్తారు. ఒకే చెట్టు కలపతో 750 కిలోల బంగారం తాపడం చేసిన అంబారీ ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవం మైసూర్ ప్రధాన వీధులగుండా సాగుతుంది. ఈ ఉత్సవమే మైసూరు దసరా ఉత్సవాల్లో కీలక ఘట్టం. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతోపాటు మరికొన్ని ఏనుగులు సర్వాలంకార భూషితంగా ఈ వేడుకలో పాల్గొనడం జరుగుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా వస్తారు.



Click it and Unblock the Notifications













