పాలంపూర్ ప్రయాణానికి బయలుదేరుదామా..
ఢిల్లీ మరియు చండీగఢ్ సమీపంలో నివసించే ప్రజలకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం హిమాచల్. వేసవిలో హిమాచల్కు వచ్చే వారి సంఖ్య పూర్తిగా పెరుగుతుంది. సిమ్లా, మనాలి, స్పితి, ధర్మశాల, పర్వానూ, డల్హౌసీ దాదాపు ఎల్లప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటాయి. కానీ ఈ రద్దీ ప్రదేశాలు కాకుండా ప్రశాంతమైన, ప్రకృతి ప్రయాణాన్ని కోరుకుంటున్నారా? అయితే పాలంపూర్ ప్రయాణాన్నీమీ జాబితాలో చేర్చాల్సిందే. రండి పాలంపూర్ విశేషాలేంటో తెలుసుకుందాం.
పాలంపూర్ హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల నుండి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఒక చిన్న కొండ పట్టణం, ఇది ధౌలాధర్ శ్రేణి యొక్క అద్భుతమైన వీక్షణలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో అందమైన జలపాతాలు, పురాతన కట్టడాలు, కోటలు సరస్సులు, మంచి సువాసనలు వెదజల్లే తేయాకు తోటలను చూడొచ్చు.

పిల్లలతో గనుక ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే గోపాల్పూర్ జంతుప్రదర్శనశాలను అస్సలు మిస్సవ్వద్దు. ఎందుకంటే ఈ జంతుప్రదర్శనశాలలో వివిధ రకాల జంతువులతోపాటు పక్షులు ఇతర వన్యప్రాణులు ఉంటాయి. పిల్లలు వీటిని చూసి ఆనందంతో కేరింతలు కొడతారు. ఈ ప్రాంతం ధర్మశాల-పాలంపూర్ రహదారిపై ఉంది. మరెందుకాలస్యం వేసవిలో చల్లనిగాలిని ఆస్వాదించాలనుకుంటే పాలంపూర్ ప్రయాణానికి సిద్ధంకావాల్సిందే. పాలంపూర్లో చూడదగిన ప్రదేశాలు
కరేరి సరస్సు
కరేరీ సరస్సు అనేది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నఒక మంచినీటి సరస్సు. ట్రెక్కింగ్ ప్రియులకు ఇది ఎంతో ఉత్తమమైన ప్రదేశం. చిర్ మరియు చిల్గోజా పైన్లతో నిండి ఉంటుంది ఈప్రాంతంమంతా. ఈ ప్రాంతాన్ని కుమార్వా సరస్సు అని కూడా పిలుస్తారు. చుట్టూ అందమైన చెట్లతో నిండి ఉంటుంది ఈ ప్రాంతం. అందుకే ఈ ప్రాంతం ఎక్కువగా సినీప్రియులు ఇష్టపడతారు. ఈ సరస్సుదగ్గరే బాలీవుడ్, టాలీవుడ్ షూటింగ్లు కూడా జరిగాయి.

కాంగ్రా కోట
కాంగ్రా కోట హిమచల్ ప్రదేశ్లో అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది ధర్మశాల నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాంగ్రా కోటను కటోచ్ రాజవంశం నిర్మించింది. వీరు కాంగ్ర రాష్ర్టంలోని రాజపుత్ర కుటుంబానికి చెందినవారు. మహాభారత పురాతనంలో కూడా ఈ కోట ప్రస్తావన ఉంది. ఈ కోట ఈ ప్రాంతంలోనే అతిపెద్ద కోట మరియు పురాతనమైనది. కోట సమీపంలోని కొండపైన జయంతి మాతయొక్క చిన్న ఆలయం ఉంది. దాని పక్కనే కాంగ్రా కోట చరిత్రను తెలిపే మ్యూజియం కూడా ఉంది. మహారాజా సన్సార్ చంద్కటోచ్ మ్యూజియం కూడా ఉంది. ఇది పట్టణంలోని ఒక రాజకుటుంబంచే నిర్వహించబడుతోంది. ఈ కోటకు గైడ్లతోపాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు, తినడానికి ఒక ఫలహారశాలను కలిగి ఉంది.
అండర్రెట్టా
అండర్రెట్టా అనేది ధౌల్ధర్ కొండలపై ఉన్న ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో పాటు కుండల తయారీకి కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో చాలా రకాల ఆర్ట్ గ్యాలరీలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఓ రోజు చాలు. ఒక్కరోజులోనే ఈ ప్రాంతంలో ఉన్న ఆర్ట్గ్యాలరీలు మరియు ప్రకృతి అందాలను, కుండల తయారీని చూడొచ్చు.

బైజ్నాథ్ ఆలయం
ఇది కాంగ్రా లోయలో నిర్మించిన చాలా అందమైన దేవాలయం. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం చాలా వరకు పూరీ జగన్నాథ ఆలయాన్ని పోలి ఉంటుంది.

టాయ్ ట్రైన్
పాలమూరులో పర్యాటకులను ఆకర్షించేది టాయ్ట్రైన్. ఈ ప్రాంతాన్ని గనుక మీరు సందర్శిస్తే ఈ టాయ్ ట్రైన్ను అస్సలు మిస్సవద్దు. టాయ్ ట్రైన్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. పాలంపూర్ నుండి పఠాన్కోట్ మధ్య నడుస్తున్న ఈ టాయ్ ట్రైన్ పచ్చని దట్టమైన అడవులు మరియు పర్వతాల గుండా వెళుతుంది. ఈ సమయంలో మీరు జలపాతాలు, నదులు, చిన్న గ్రామాలు వంటి అనేక అందమైన దృశ్యాలను చూడవచ్చు. ముఖ్యంగా మే నుండి జూన్ వరకు ఇక్కడ సందర్శించేందుకు ఉత్తమమైన ప్రదేశం. కాబట్టి మరెందుకాలస్యం పాలంపూర్కి మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.



Click it and Unblock the Notifications













