భారతదేశంలో సాదారణ ప్రజలు సూదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ఎంచుకునే ఏకైక మార్గం.. రైలు మార్గం.. ఈ రైలు మార్గాలు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండడంతోపాటు అతి తక్కువ ఖర్చుతో వారిని తమ తమ గమ్యస్థానాలకు చేర్చుతాయి. అందుకే చాలామంది రైలు మార్గాలను ఎంపిక చేసుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని రైలు మార్గాల్లో అనేక అధునాతన సౌకర్యాలు కలిగిన రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పడు దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల జోరు అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేలా చేయడంలో కృషిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 54 వందేభారత్ ట్రైన్స్ పట్టాలెక్కిన సంగతి తెలసిందే..ఈ ట్రైన్స్ వేర్వేరు రాష్ట్రాలు, వేరువేరు నగరాల మధ్య ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని స్పెషాలిటీస్, స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉండటం వల్ల ప్రస్తుతం దేశంలో వీటి డిమాండ్ పెరుగుతోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే వందేభారత్ ట్రైన్స్ టికెట్ ధర అధికమే అయినప్పటికీ, త్వరగా తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు ఎక్కువశాతం మంది ఈ ట్రైన్లను ఎంపిక చేసుకుంటున్నారు. ఇంతవరకు కేవలం కూర్చుని వెళ్లే వందేభారత్ ట్రైన్లలో త్వరలోనే స్లీపర్ రైళ్లు కూడా ప్రయాణికులకు అందుబాటలో ఉండనున్నాయి. వందే భారత్ స్లీపర్ ట్రైన్లను త్వరలోనే ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రొటోటైప్ వెర్షన్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా ఆవిష్కరించారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఎమ్ఈఎల్) ఫెసిలిటీలో ఆయన వీటిని ప్రారంభించారు.

వందేభారత్ స్లీపర్ కోచ్ ట్రైన్స్ ప్రత్యేకతలు..
వందే భారత్ చైర్ కార్ విజయవంతమైన తర్వాత, వందే భారత్ స్లీపర్ తయారీ పూర్తయినట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా వివరించారు. పది రోజుల పాటు వీటిపై కఠినమైన ట్రయల్స్, టెస్ట్లు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇవి మరిన్ని పరీక్షల కోసం పట్టాలెక్కెందుకు సిద్ధపడనున్నాయి. ఈ పరీక్షలు విజయవంతమైతే వీటి ఉత్పత్తి ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు. సంవత్సరం తర్వాత నెలకు రెండు నుంచి మూడు చొప్పున వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు ఆయన వివరించారు.
ఇక ఇందులో రీడింగ్ ల్యాంప్స్, ఛార్జింగ్ అవుట్లెట్లు, స్నాక్ టేబుల్, మొబైల్-మ్యాగజైన్ పెట్టుకునే ఆధునాతనమైన సదుపాయాలు కూడా ఉన్నాయి. రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే 'కవచ్' వ్యవస్థ కూడా ఈ ట్రైన్స్లో ఉన్నాయి. అన్ని కోచ్లు స్టెయిన్లెస్ స్టీల్ కార్ బాడీతో అమర్చబడి ఉంటుంది. జీఎఫ్ఆర్పీ ఇంటీరియర్ ప్యానెల్స్ ఉంటాయి, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ ట్రైన్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన సదుపాయాలతో టాయిలెట్లు, కొత్త టెక్నాలజీతో రూపొందించిన సీటు కుషన్లు వందేభారత్ స్లీపర్ కోచ్ ట్రైన్స్ ప్రత్యేకతల్లో ముఖ్యమైనవి.

మూడు వెర్షన్లలో...
ఈ ట్రైన్స్లో 16 కోచ్లు, 823 బెర్త్లతో అందుబాటులో ఉంటాయి. వీటిలో 11, 3టైర్ ఏసీ కోచ్లు, 4, 2 టైర్ ఏసీ కోచ్లు, ఒక ఫస్ట్ టైర్ ఏసీ కోచ్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్స్ 800 నుంచి 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఈ ట్రైన్లో ఉండే ఆక్సిజన్ స్థాయి వైరస్ నుంచి ప్రజలను రక్షిస్తుంది. ఇక, ఈ ట్రైన్స్ మూడు వెర్షన్లలో రానున్నాయి. ఇక, ఇప్పటికే సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ ఛైర్కార్ ట్రైన్స్ దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే వందే మెట్రో రైలును కూడా తీసుకొచ్చేవిధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.



Click it and Unblock the Notifications













