క్షేత్రం : సింగరకొండ లేదా శింగరకొండ
సమీప పట్టణం : అద్దంకి
జిల్లా : ప్రకాశం
రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్
సింగరకొండ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రముఖ ఉభయ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాలు ప్రఖ్యాతి గాంచినవి. సింగరకొండ అద్దంకి నుండి 6 కి.మీ. దూరంలో భవనాసి చెరువు వొడ్డున ఉంది. మొదట్లో సింగన కొండ అని పిలవబడ్డ నరసింహ క్షేత్రం, అయిననూ ఆంజనేయ స్వామి క్షేత్రం గానే ప్రఖ్యాతి గాంచెను. ఆలయంలో కల గరుడ స్తంభంపై గల శాసనం ప్రకారం ఈ ఆలయ పొషకుడుగా 14 వ శతాబ్దంలో దేవరాయలు అనే రాజు కలడు.
గుడి ప్రవేశం
చిత్రకృప : singarakonda devasthanam
స్థల పురాణము
సీతమ్మ తల్లి కోసం వెతుకుతూ దక్షిణాపధం బయలుదేరిన ఆంజనేయుడు, ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారని ఒక నమ్మకం. అందుకే ఇచ్చట ఆంజనేయుడు దక్షిణాముఖుడై కనపడతారు.
అద్దంకి తాతాచార్యులు అని గొప్ప భక్తుడు సింగరకొండలో కొండపై గల నరసింహ స్వామి గుడియంది ధ్వజారొహణ చేయుచుండగా, కొండ క్రింద ఒక దివ్యపురుషుడు ఒక ఆంజనేయ విగ్రహమునకు హారతి ఇచ్చుచూ కనబడెను. పరుగు పరుగున క్రిందకు వెళ్ళిన తాతాచార్యుల వారికి పురుషుడు మాయమై, దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయ విగ్రహం కనపడింది.
పూజలు
సింగరకొండలో ప్రతి మంగళ వారం మరియు శని వారం విశేష పూజలు జరుగును. అటులనే, ముఖ్య పండుగలు అయిన ఉగాది, శ్రీరామ నవమి, హనుమ జ్జయంతి, ముక్కోటి, సంక్రాంతి, బ్రహ్మోత్సవాల తిరునాల్లు ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజుల యందు లక్షల కొద్దీ భక్తులు వచ్చి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీశ్శులు పొందెదరు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్ష తమలపాకుల పూజ, కోటి తమలపాకుల పూజ చూడుటకు రెండు కళ్ళూ చాలవు.
శ్రీ సువర్చలాంజనేయస్వామి స్వామి
చిత్రకృప : singarakonda devasthanam
- అభిషేకం - 6 AM - 7 PM - ప్రతిరోజూ
- దర్శనం, అర్చన, ఆకు పూజ - 7 AM - 12: 30 PM - ప్రతిరోజూ
- పంచ హారతి - 1 PM - 1:30 PM - ప్రతిరోజూ
- దర్శన్, అర్చన, ఆకుపూజ -2 PM - 7 PM - ప్రతిరోజూ
- ప్రదోషకలర్చన - 7 PM - 7:45 PM - ప్రతిరోజూ
- శాశ్విత అభిషేకం రూ. 500/- 6 AM- 7 AM - సంవత్సరంలో ఏరోజైనా
నిత్యాన్నదాన పథకం
స్వామివారిని దర్శించుకొనడానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాట్లు, 2001 నుండి హనుమజ్జయంతి సందర్భంగా మొదలు పెట్టినారు. ప్రతి మంగళవారం, శనివారం 150 మంది భక్తులకు, మిగతా రోజులలో 50 మంది భక్తులకు, అన్నప్రసాదవితరణ జరుగుచున్నది.
సమీప దర్శనీయ ఆలయాలు
అయ్యప్పస్వామివారి ఆలయం, షిర్డీ సాయిబాబావారి ఆలయం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం, శ్రీ గాయత్రీమాత ఆలయం, కొండపైనెలకొనియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం, శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం చూడదగ్గవి.
మారుతి భవన్
చిత్రకృప : singarakonda devasthanam
వసతి
సింగరకొండ లో వసతి పొందాలనుకునేవారు దేవస్థానం ఏర్పాటు చేసిన కాటేజీలలో బస చేయవచ్చు. కనుక ఇక్కడికి వచ్చే యాత్రికులు మమారుతి భవన్ లో వసతి పొందవచ్చు. అద్దె తక్కువ ధరకే లభిస్తుంది. ఈ భవన్ రెండు అంతస్తుల సముదాయం.
సింగరకొండ ఎలా చేరుకోవాలి ?
ఎంత దూరం : హైదరాబాద్ నుండి 290 కిలోమీటర్లు, విజయవాడ నుండి 110 కిలోమీటర్లు, ఒంగోలు నుండి 36 కిలోమీటర్లు, అద్దంకి నుండి 5 కిలోమీటర్ల దూరంలో సింగరకొండ కలదు.
విమాన మార్గం ద్వారా : సమీప విమానాశ్రయం విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్. అక్కడ దిగి క్యాబ్ లేదా టాక్సీ లలో సింగరకొండ చేరుకోవచ్చు.
రైలు మార్గం : ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపాన ఉన్నది. హైదరాబాద్, విజయవాడ నుండి చెన్నై వెళ్ళే ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్ళన్నీ ఒంగోలు స్టేషన్లో ఆగుతాయి.
రోడ్డు/ బస్సు మార్గం : సమీప బస్ స్టాప్ - అద్దంకి. హైదరాబాద్, విజయవాడ, ప్రకాశం నుండి అద్దంకి కి బస్సులు కలవు.
ఒంగోలు నుంచి: బస్సు ప్రయాణీకులు అద్దంకి వెల్లు బస్సు ఎక్కవలెను. అద్దంకి నుంచి సింగర కొండకు ప్రతి 30 నిముషములకి బస్సులు ఉన్నాయి. కారు ద్వారా వెళ్ళు యాత్రీకులు అద్దంకి నుంచి సింగర కొండ మార్గంలో వెళ్లవలెను.