కీసరగుట్ట ఆలయం భగవంతుడు శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ ఆలయం రంగారెడ్డి జిల్లాలోని ఒక గట్టు పై ఉన్నది. కీసరగుట్ట ఆలయం రంగారెడ్డి జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో, ECIL కు 10 కిలోమీటర్ల దూరంలో కలదు. శివరాత్రి పర్వదినాన ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
పురాణకథ
పూర్వం శ్రీరాముడు, రావణుడిని సంహరించిన తరువాత అయోధ్యనగరానికి వెళుతుండగా ... కీసరగుట్ట కొండమీద కొద్దిసేపు ఆగాడు. రావణుడిని చంపినందుకు శ్రీరాముడు శివలింగాలను ప్రతిష్టించాలనుకుంటాడు. శ్రీరాముడు వెంటనే ఆంజనేయుడిని పిలిచి.. కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. దీంతో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆంజనేయుడు ఆకాశంలో ఎగురుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు.

చిత్ర కృప : J.M.Garg
అయితే ముహూర్త సమయం సమీపిస్తున్నా ఆంజనేయుడి జాడ ఎవ్వరికి కనిపించలేదు. ఎక్కడ ఆలస్యమౌతుందా అని శ్రీరాముడు ఆలోచిస్తున్న వేళ శివుడు ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్ని రాముడికి ఇచ్చి మాయమవుతాడు. ముహూర్తం దాటిపోతుండటంతో రాముడు శంకరుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని ఆ ప్రాంతంలో ప్రతిష్టిస్తాడు.
ఇది కూడా చదవండి : కాకతీయులు నిర్మించిన అద్భుత దేవాలయాలు !
ఇంతలోనే ఆంజనేయుడు 101 శివలింగాలను భుజాల మీద పెట్టుకొని రాముడు ముందు వాలిపోతారు. అక్కడ జరిగిన పరిస్థితులను చూసి .. తాను తెచ్చిన శివలింగాలను విసిరేసాడు ఆంజనేయుడు. అదంతా చూస్తున్న రాముడు కోపగించుకోకుండా దగ్గరకు పిలిపించుకొని ఇలా అన్నాడు ''ఆలయంలో ఆత్మలింగ దర్శనానికి ముందే నిన్ను, నువ్వు తెచ్చిన శివలింగాలను భక్తులు దర్శిస్తారు. ఆ తరువాతే శ్రీ రామలింగేశ్వరునిని దర్శించుకుంటారు'' అని వరమిస్తాడు.

చిత్ర కృప : Aditya Siva
అంతేకాకుండా ఆంజనేయుని తండ్రి అయిన కేసరి పేరుమీదుగా ''కేసరిగిరి''గా ఆ ప్రాంతం పిలువబడుతుందని అనుగ్రహించాడు. అలా కేసరిగిరిగా పెట్టిన పేరు కాలక్రమంలో కీసరగిరి, కీసర, కీసరగుట్టగా మారిపోయింది.
ఆలయ విశేషాలు
క్రీ.శ. 4 - 5 శతాబ్దాల్లో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన విష్ణుకుండినులలో ప్రసిద్ధుడైన రెండవ మాథవవర్మ రాజధాని అయిన ఇంద్రపాలనగరం ఇదేనని కొన్ని ఆధారాలు కూడా లభించాయి. ఈ మహారాజు వేయికి పైగా యజ్ఞయాగాదులను నిర్వహించి నర్మదానదీ తీరం వరకు సామ్రాజ్యాన్ని వ్యాపింపజేసాడు.

చిత్ర కృప : Aditya Siva
ప్రధాన ఆలయం పశ్చిమానికి అభిముఖంగా వుంటూ.. శ్రీరామలింగేశ్వరుడి ప్రధాన దైవం వుంటుంది. ఈ ప్రథానఆలయం ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలుగా నిర్మించిబడింది. ముఖమండపంలో ఉన్న స్వామి వారికి కుడివైపు పార్వతీదేవి, ఎడమై వైపు శివగంగదేవి దర్శనమిస్తారు.
మండపానికి కుడివైపున్న వేదికపై ఆంజనేయుడు, వినాయకుడు, శివలింగము.. ఎడమవైపున్న వేదికపై వల్లీదేవసేనా సమేత కుమారస్వామి దర్శనమిస్తారు.

చిత్ర కృప : Aditya Siva
ధ్వజస్థంభంతో కాలభైరవుడిని సేవించుకోవచ్చు. ఈస్వామికి ఎదురుగా నందీశ్వరుడు గంభీరముద్రలో దర్శనమిస్తాడు. రాహుకేతు పూజలు కూడా ఇక్కడే ప్రత్యేకం. భక్తులు ఈయనను కోరికలు తీర్చే తండ్రిగా భావిస్తారు.
ఆలయానికి ప్రాంగణం వెలుపల ఎక్కడ చూసిన శివలింగాలే కనిపిస్తాయి. ఆంజనేయుడు ఈ లింగాలనే చెల్లాచెదురుగా విసిరేయడంతో ఇవి ఇలా దర్శనమిస్తున్నాయి. శివరాత్రి పర్వదినాల్లో భక్తులు ఇక్కడ వేలకొద్దీ వస్తుంటారు.

చిత్ర కృప : keesara
కీసరగుట్ట ఆలయం ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3:00 గంటల నుండి రాత్రి 7:30 వరకు తెరిచే ఉంటుంది. వారంలో ప్రతి రోజూ గుడిని దర్శించుకోవచ్చు. వసతికి టిటిడి వారి ధర్మశాల ఉన్నది.
కీసరగుట్టలో ఇతర ఆలయాలు
నాగదేవత ఆలయం, పాలగుండం, రామాలవమ్, శివ పంచరత్నం, సీతమ్మవారి గుహ, శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం, శ్రీ లక్ష్మి నృసింహ ఆలయం, శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారి ఆలయం, శ్రీ రాములవారి పాదాలు, ఉపాలయం.

చిత్ర కృప : Aditya Siva
కీసరగుట్ట ఎలా చేరుకోవాలి ?
కీసరగుట్ట ఆలయం హైదరాబాద్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో, ECIL X రోడ్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో కలదు. జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ నుండి కోఠి నుండి దేవాలయానికి బస్సులు కలవు.



Click it and Unblock the Notifications











