ఏపీటీడీసీ ఒక్కరోజు టూర్ ప్యాకేజీలతో విశాఖ- అరకు అందాలను చూసేయండి!
విశాఖ తీరప్రాంతంలోని ప్రకృతి అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాంక్రీట్ నగరంతో మిళతమైన సుందర దృశ్యాలకు విశాఖలో కొదవే లేదు. మరీ ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే ఆంధ్రా ఊటీగా పిలిచే అరకు ప్రయాణానికి కేంద్ర బిందువు విశాఖ అంటే అతిసయోక్తికాదు.
అందుకే, పర్యాటక ఆసక్తి ఉన్నవారిని మరింత ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సరికొత్త టూర్ ప్యాకేజీలతో ముందుకొచ్చింది. ఒక్క రోజులో విశాఖ అందాలతోపాటు అరకును చుట్టేసేందుకు ఈ ప్యాకేజీల్లో చాలా ఆఫర్లే ఉన్నాయి. మరెందుకు ఆలస్యం ఆ వివరాలేంటో చూసేద్దామా!!

ఈ బిజీ లైఫ్లో కాస్త ప్రశాంతత కోసం ఎక్కడికైనా వెళదామంటే ఒకటి రెండు రోజులకు మించి అవకాశం దొరకక చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే, ఒక్క రోజులో విహారయాత్ర ముగించడం అంటే సవాళ్లతో కూడుకున్నదే అని వారి అభిప్రాయం. ఈ శీతాకాలంలో దగ్గరలోనే ఉన్న అరకు అందాలు చూసేందుకు ప్లాన్ చేసినా రానుపోనూ సమయం సహకరించదు.
అలాంటివారి కోసం అరకుతో పాటు వైజాగ్ టూర్ను ఒక్కరోజులోనే పూర్తి చేసేలా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. తక్కువ ధరకే ఒక రోజు అరకు టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ప్రకృతి అందాల అరకు లోయల్లో పర్యటించేందుకు పర్యాటకులు ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేయొచ్చు. అంతేకాదు, అరకుతో పాటు విశాఖ నగర అందాలను మనసారా ఆస్వాదించేందుకు కూడా మంచి మంచి ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది ఏపీ పర్యాటకశాఖ.

అరకు టూర్ ప్యాకేజీ వివరాలివే
ఆంధ్రా ఊటీ అరకు అందాలను ఆస్వాదించేందుకు ఏపీటీడీసీ ఒక రోజు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఇందులో విశాఖ కేంద్రంగా అరకు టూర్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటలకు ముగుస్తుంది. ఈ ప్యాకేజీలో రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. బృందాలుగా గమ్యస్థానం చేరుకున్న తర్వాత పర్యాటకులు పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు చూడొచ్చు.
టూర్ ప్యాకేజీలో నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్ ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.1,590, పిల్లలకు రూ.1,270గా నిర్ణయించారు. ప్యాకేజీలో భాగంగానే రుచికరమైన బ్రేక్ఫాస్ట్, మినరల్ వాటర్, టీ, స్నాక్స్తోపాటు అరకు ఫెమస్ ట్రైబల్ ధింసా డ్యాన్స్ను ఎంజాయ్ చేయవచ్చు.

విశాఖ నగర అందాలను ఒక్క రోజులో..
అందాల నగరం విశాఖపట్నంలోని స్థానిక పర్యాటక ప్రాంతాలను చూసేందుకు కూడా లోకల్ సైట్ సీయింగ్పేరుతో ఏపీటీడీసీ ఒక రోజు టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది. ఈ ప్యాకీజీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.30 గంటలకు ముగుస్తుంది. ఇందులో పర్యాటకులు కైలాసగిరి, సింహాచలం, తొట్లకొండ, ఫిషింగ్ హార్బర్లో బోటింగ్, రిషికొండ బీచ్, విశాఖ సబ్ మెరైన్ మ్యూజియం, జాతర శిల్పారామం లాంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు చూడొచ్చు.
ఈ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.910, పిల్లలకు రూ.730. టూర్ ప్యాకేజీలో ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, లంచ్ కవర్ అవుతాయి. నాన్ ఏసీ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. నాన్ ఏసీ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.760, పిల్లలకు రూ.610గా నిర్ణయించారు. దీనితోపాటు రాత్రివేళ నగరపు అందాలను చూసేందుకు నైట్ టూర్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. ఈ టూర్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగుస్తుంది.
ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు ఫిషింగ్ హార్బర్, సబ్మెరైన్ మ్యూజియం, కైలాసగిరి, జాతర శిల్పారామం చూడొచ్చు. రుషికొండ బీచ్లోని హరిత రిసార్ట్లో డిన్నర్ ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.448, పిల్లలకు రూ.340. టూర్ ప్యాకేజీలో సైట్ సీయింగ్, డిన్నర్ కవర్ అవుతాయి. మరెందుకు ఆలస్యం.. ఒక్కరోజు పర్యాటకానికి కేటాయించి, వెల కట్టలేని అనుభూతులను మూటగట్టుకోండి.



Click it and Unblock the Notifications













