శిల్పకళా సౌందర్యానికి చిరునామా.. బేలూరు- హళేబీడు
మా బృందం నిత్యం విహారయాత్రలతో బజీగా ఉంటుంది. అయితే, దేశంలో మేం చూసిన అనేక ప్రదేశాలలో మా మనసుకి బాగా నచ్చిన అద్భుతమైన ప్రదేశాలు బేలూరు- హళేబీడు. చారిత్రాత్మక విషయాలను చరిత్ర పుస్తకాలలో చదవటం వేరు, చూడటం వేరు. ఇది మా సొంత అభిప్రాయం మాత్రమే. బేలూరు-హళేబీడు చూశాక కలిగిన ఉద్వేగం మాటల్లో చెప్పలేం. అలా అక్కడ గడిపిన ప్రతిక్షణమూ మా మనసులో చెరగని ముద్రవేసింది. అక్కడి నల్లరాతి బండ్లను శిల్పాలుగా మలచిన తీరు అమోఘం. ఆ మధురమైన జ్ఞాపకాల దృశ్యమాలిక మీకోసం..
కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాకు చేరువగా బేలూరు-హళేబీడు అనే జంట పట్టణాలు ఉన్నాయి. హళేబీడు బేలూరు జిల్లా కేంద్రమైన హాసన్కు అతి సమీపన ఉన్న చిన్న పట్టణాలు. వీటిని పూర్వం దొరసముద్ర, ద్వారసముద్ర అని పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని హెూయసలలు క్రీస్తుశకం 1000 నుండి 1346 సంవత్సరాల మధ్య కాలంలో దాదాపు 350 సంవత్సరాల కాలం పరిపాలించారు. స్వతంత్ర రాజవంశం కావడానికి ముందు వీరు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగానే ఉండేవారు.
సందర్శకులు, చరిత్రకారుల ప్రత్యేక ఆకర్షణగా ఈ ప్రాంతాన్ని రాజవంశీయులు తీర్చిదిద్దారు. ఈ ప్రాంతాన్ని సందర్శించినవారికి 'శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు..' అని 1962లో ఆదుర్తి సుబ్బారావు మంచి మనసులు సినిమాలో రాసిన ఆ మధురమైన పాట తప్పనిసరిగా గుర్తుకొస్తుంది.

ఇదీ చారిత్రక నేపథ్యం
క్రీస్తుపూర్వం 1117 సంత్సరంలో తలకాడ్లో జరిగిన యుద్ధంలో చోళుల్ని జయించి, హెూయసలులు స్వాతంత్య్రం ప్రకటించుకుని రాజ్యాధికారాన్ని చేపట్టారు. వీరిలో మొదటి స్వతంత్ర రాజైన విష్ణువర్ధనుడు క్రీస్తుశకం 12వ శతాబ్ద ప్రథమ దశకంలో రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఇతని పరిపాలన జరిగిన కాలంలో విజయోత్సాహానికి గుర్తుగా చెన్నకేశవాలయం నిర్మాణం ప్రారంభించాడు. ఆలయ నిర్మాణంలో విష్ణువర్ధనుడికి మంత్రి కేతనమల్లనితో పాటు కేసరశెట్టి అనే ఓ శివభక్తుడు కూడా తోడ్పడినట్టుగా ప్రచారంలో ఉంది.
అలా విష్ణువర్ధనుడు మొదలు పెట్టిన ఆలయ నిర్మాణాన్ని తర్వాత ఆతని మనుమడైన రెండవ వీరబల్లల 1160లో పూర్తిచేశాడు. అదే నేటి బేలూరులోని చెన్నకేశవాలయం. అలనాటి హెూయసలుల ఆలయ నిర్మాణ శైలికి చక్కని నమూనాలుగా చెప్పే దేవాలయాలలో మొదటిది బేలూరులోని చెన్నకేశవాలయం. చెన్నకేశవ ఆలయంలో మూల విరాట్టు 3.7 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ ఆలయం హాళేబీడులోని హెుయసలేశ్వరాలయం.

అద్భుత శిల్ప చాతుర్యం
హళేబీడులో ముందుగా ఓ నక్షత్ర ఆకారంలో ఉన్న ఎత్తయిన అరుగుపై ఉన్న ఓ పురాతన ఆలయ నిర్మాణం తారసపడింది. ఆ ఆలయాన్ని చూసినపుడు గోడలపై ఉన్న శిల్పాలు చెక్కేందుకు శిల్పులు ఎన్నెన్ని రాత్రులు నిద్రకు దూరంగా గడిపి ఉంటారో అనే ఒక ఆలోచన వస్తే మనల్ని ఓ ఉద్వేగపూరితమైన ప్రపంచంలోకి నెట్టేస్తుంది. శిల్పులు మన ప్రాచీన నృత్యశాస్త్రాన్ని ఒకసారి తిరగేసి ఉంటారు. అందుకేనేమో, అలనాటి కవులు రాసుకున్న కవిత్వంలోని భావాలూ, భంగిమల రూపంలో మనోహరమైన సౌందర్య శిల్పాలుగా అపురూపంగా తీర్చిదిద్దారు.

వాటిని రాతి శిల్పాలు అనలేం
ఆ రాళ్ళల్లో ఎన్నో మెలికలను, సొంపులను చూపించడం అసాధ్యమైన పని. ఆలయ గర్భగుడి, ముఖద్వారం, నంది భృంగి విగ్రహాలు, ఆలయం లోపలి భాగం, పైకప్పుల్లోని సౌందర్యం అంత అద్భుతంగా చెక్కడం అనితర సాధ్యం. ఆలయం తూర్పుముఖంగా ఉంటుంది. దీని నాలుగు ద్వారాలలో రెండు ద్వారాలు తూర్పు వైపు, ఒకటి ఉత్తరంవైపు, మరోటి దక్షిణంవైపు ఉంటాయి. ఉత్తరం ద్వారం దగ్గరలోనే ద్వారపాలక విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలయం వెలుపలి ఉద్యానవనంలో గోమఠేశ్వరుడి విగ్రహం చూడముచ్చటగా తీర్చిదిద్దారు.
బేలూరు, హళేబీడు రెండు ఆలయాల చుట్టూ విశాలమైన ప్రదక్షిణపథం ఉంది. హళేబీడులోని శిల్ప సౌందర్యం మన దేశ శిల్పుల ప్రతిభకి, శిల్పచాతుర్యానికి చక్కని చిరునామాగా చెప్పవచ్చు. ఆలయాలు బయటి స్తంభాల పైభాగాన్నీ, పైకప్పునూ కలుపుతూ ఏటవాలుగా నిలబెట్టిన చక్కని మనోహర శిల్పాలు. వాటిలో దర్పణ సుందరి, వికటనర్తకి, రసికశబరి, మయూరశిఖే శిల్పాలు మన చూపును పక్కకి తిప్పుకోనివ్వవు. రామాయణ ఘట్టాలూ, దశావతార ప్రదర్శన, వామనావతార శిల్పాలు ఎంతో నైపుణ్యంతో రమణీయంగా చెక్కారు.

ప్రతిభకు సజీవ సాక్ష్యాలుగా..
హెూయసల రాజులకి కులదైవంగా భావించే నరసింహస్వామి విగ్రహాలు 34 వరకూ ఉన్నాయి. వీటిలో ఒక శిల్పమైతే అత్యంత భయంకరంగా కదులుతున్న నాలుకతోనున్న రూపాన్ని ఎంత గొప్పగా సందర్శకుల కనులకు సాక్షాత్కరింపజేశారో చూస్తే మన మనసులుమ పలకరిస్తాయి. హళేబీడులో హెూయసలేశ్వరుడిగా మహారాజు పేరు మీద, శాంతలేశ్వరుడిగా మహరాణి శాంతలాదేవి పేరు మీదనే నేటికీని పూజలు అందుకుంటున్న శివలింగాల ఎదురుగా రెండు నంది విగ్రహాలను ప్రతిష్టించారు. వీటికి చుట్టూ మండపాలు ఉన్నాయి.
అలాగే, నంది విగ్రహాలు రకరకాల అలంకరణలతో ఉంటాయి. విగ్రహ కంఠ ప్రదేశంలో మూడు పట్టెడలు, కిందనే మువ్వల గొలుసు, రెండు కొమ్ములను చుట్టుతూ చక్కని ముత్యాల పట్టికలు, నడుము పైభాగం నుంచీ బెత్తెడు బెత్తెడు వెడల్పుతోనున్న చక్కనైన పేటల గొలుసులు, గిట్టలకు పైభాగాన కడియాలు, మకరతోరణం, జయవిజయుల మెళ్ళోనున్న హారాల నొక్కులు శిల్ప సౌందర్య మనోహర దృశ్యాలు చూస్తే, విస్మయానికి గురవ్వాల్సిందే! అత్యంత సుందరంగా మలచబడిన ఈ ప్రతిమలలోని కొన్ని వివరాలు కాలానికి చెదిరిపోయినప్పటికీ, ఎప్పటికీ వాటిలోని ప్రతిభ సజీవ సాక్ష్యాలుగా మనకళ్ల ముందు నిలిచిపోతాయి.

అపార శిల్పకళా నైపుణ్యం..
హుయసెల శిల్పులలో అపార శిల్పకళా నైపుణ్యంలో గొప్ప పేరు పొందిన అమరశిల్పి జక్కన్న ముఖ్యుడు. ఆలయ నిర్మాణం పూర్తిచేసి, చెన్నకేశవస్వామి విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నప్పుడు ఆ సమయంలో జక్కన్న కుమారుడు డంకనాచార్యుడు ఈ విగ్రహం లోపభూయిష్టమైనదని, ఆ విగ్రహం ఉదరభాగంలో కప్ప ఉందనీ చెప్పాడట! దానికి కంగుతిన్న జక్కనాచార్యులు దానిని నిరూపించమని కొడుకుకు సవాల్ విసిరాడట! ఒక ఉలితో బొమ్మని ఉదరభాగంలో కొట్టగా అందులోంచి ఒక కప్ప బైటికి దూకిందట.
ఈ విషయం తాను గ్రహించలేకపోయానన్న విచారంతో జక్కన్న తన కుడిచేతిని నరికేసుకున్నాడు. ఆ తరువాత అదే ప్రదేశంలో మరొక ఆలయం నిర్మాణాన్ని చేపట్టారని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ఇప్పటికీ ప్రాంగణంలో పాత ఆలయాన్ని చూడవచ్చు. దీనిని నాటి కాలంలో ప్రజలు కప్పిచిన్నగరాయ ఆలయం అని పిలిచేవారు.



Click it and Unblock the Notifications













