తెలంగాణలోని ఆ రెండు గ్రామాలకు ఉత్తమ పర్యాటక గుర్తింపు..
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉత్తమ పర్యాటక గ్రామాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలంగాణా రాష్ట్రానికి చెందిన రెండు గ్రామాల పేర్లు బయటికి రావడం విశేషం. అందులో రాష్ట్రం నుంచి సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్, జనగామ జిల్లాలోని పెంబర్తిని ఎంపిక చేసింది. ఈ గ్రామాలకు ఈ నెల 27న దిల్లీలో అవార్డులు అందజేయనున్నారు. ఉత్తమ పర్యాటక గ్రామ పోటీల్లో సత్తా చాటిన ఈ రెండు గ్రామాల గురించి ఇప్పడు తెలుసుకుందాం.

కాకతీయుల కాలం నుంచే..
సంస్కృతి, కళలకు పెట్టింది పేరు తెలంగాణ. ఇప్పటికే తెలంగాణ కళలకు, సంస్కృతులకు, పర్యాటకానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. తాజాగా రాష్ట్రంలోని మరో రెండు గ్రామాలు ఈ ఏడాదికిగాను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపికయ్యాయి. ఈ అవార్డులకు ఎంపికయిన మొదటి గ్రామం జనగామ జిల్లా పెంబర్తి.. ఈ గ్రామం కాకతీయుల కాలం నుంచే కళలకు ప్రసిద్ధి చెందింది. ఇత్తడి, కంచు లోహాలతో ఈ గ్రామంలో తయారుచేసే కళాకృతులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని అమెరికా, బెల్జియం, జపాన్, జర్మనీ వంటి ఇతర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.

ఏటా 25 వేల మంది పర్యాటకులు..
సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళా ఖండాలు, గృహ అలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. అంతేకాకుండా ప్రతి ఏటా 25 వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి, ఆర్థిక కార్యకలాపాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని, పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

గొల్లభామ చీరలు ప్రత్యేకం..
ఇక ఈ అవార్డులకు తెలంగాణ నుంచి ఎంపికైన రెండో గ్రామం సిద్దిపేట జిల్లా చంద్లాపూర్. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నేసే గొల్లభామ చీరలు తెలంగాణ కళా సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ఇంకా ఇక్కడి రంగనాయక స్వామి దేవాలయం, రంగనాయక కొండలు, ప్రకృతి అందాలు చూడదగినవి. ఇక్కడ నేసే గొల్లభామ చీరలు కళామ్మ తల్లి ముద్దుబిడ్డలైన నేతన్నల కళానైపుణ్యానికి నిలువుటద్దాలు. రంగనాయక స్వామి దేవాలయం, పరిసర ప్రాంతాలు గ్రామీణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన నేపథ్యంతోపాటుగా ఇక్కడి గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కారణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సెప్టెంబర్ 27వ తేదీన అంటే నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేయబోయే కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేయనున్నారు. 2021లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి యుఎన్డబ్ల్యుటిఓ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు కల్పించే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన జీ-20 సమావేశాలైనా.. భూదాన్ పోచంపల్లి ఇక్కత్ చీరలను, ఇక్కడి నేతన్నలు నేసిన కండువాలను వివిధ దేశాల అధినేతలకు, విదేశీ ప్రముఖులకు అందజేశారు. వివిధ విభాగాలకు సంబంధించిన జీ20 సమావేశాలకు హాజరైన విదేశీ ప్రతినిధులకు కూడా పోంచపల్లిలో నేసిన చీరలను కేంద్ర ప్రభుత్వం ద్వారా గిఫ్ట్లుగా అందజేశారు.



Click it and Unblock the Notifications













