తెలంగాణలోని హైదరాబాద్లో ప్రసిద్ధిచెందిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, ప్రకృతి ప్రసాదించిన ప్రదేశాలు, ఇలా ఒకటేమిటో ఎన్నో... వీకెండ్ మొదలయ్యిందంటే ఇక్కడికి సమీపంలోని ప్రాంతాలను చూసేందుకు పర్యాటక ప్రేమికులు వాలిపోతుంటారు. హైదరాబాద్ నగరంలోని మరో అందమైన ఆకర్షణ హుస్సేన్ సాగర్. నగరానికి విచ్చేసిన వారేవరైనా సరే హుస్సేన్ సాగర్లో బోటు ప్రయాణం చేయకుండా ఉండరు. ఎందుకంటే, ఇక్కడ బుద్ధుని విగ్రహం అంత ఫేమస్. అయితే, ఈ మధ్యకాలంలో హుస్సేన్ సాగర్లో మరో అదనపు ఆకర్షణను కూడా చేర్చారు. అదే మ్యూజికల్ ఫౌంటెన్... రండి ఆ మ్యూజికల్ ఫౌంటెన్ విశేషాల గురించి తెలుసుకుందాం..
మార్చి 2024 నుండి హుస్సేన్ సాగర్ సరస్సులో మ్యూజికల్ ఫౌంటెన్ ప్రారంభించడం జరిగింది. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన మ్యూజికల్ ఫౌంటెన్ గా పేరుగాంచింది. ఈ మ్యూజికల్ ఫౌంటెన్ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రారంభించింది. హుస్సేన్ సాగర్ సరస్సు హైదరాబాద్ ప్రధాన నగరానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుగా ప్రసిద్ధిచెందింది. ఈ సరస్సు మొత్తం నగరాన్ని రెండు భాగాలుగా విభజించి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను ఏర్పరుస్తుంది. హైదరాబాద్కు వచ్చే పర్యాటకులకు ఇది పెద్ద ఆకర్షణ అనే చెప్పుకోవాలి. హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వారి అభిరుచులకు తగ్గట్లుగా ఎంజాయ్ చేసేందుకు వివిధ రకాల పార్కులను, సంస్కృతిక కళా క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి.

కళ్లు మిరమిట్లు గొలిపే లైటింగ్..
ఇక, ఈ హుస్సేన్ సాగర్ సరస్సులో సుమారు రూ.17.02 కోట్లతో మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. 180 మీటర్ల పొడవు మరియు 10 మీటర్ల వెడల్పు ఉన్న ఈ మ్యూజికల్ ఫౌంటెన్ దాదాపు 90 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఇది దేశంలోనే ఎత్తైన మ్యూజికల్ ఫౌంటెన్గా పేరుగాంచింది. కళ్లు మిరమిట్లు గొలిపే లైటింగ్ అందాలు ఇక్కడికి వచ్చే పర్యాటకుల మనస్సును ఆకట్టుకున్నాయి. రాత్రి సమయంలో తళుక్కుతళుక్కు మని మెరుస్తూ, సందర్శకులకు ఆహ్లదకరమైన సంగీతాన్ని అందిస్తోంది. ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ను చేసేందుకు హుస్సేన్ సాగర్కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. హుస్సేన్ సాగర్ లేక్ వద్ద మ్యూజికల్ ఫౌంటెన్ను ఎన్టీఆర్ మార్గంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేయడం జరిగింది.

మ్యూజికల్ ఫౌంటెన్ సమయం
వారంలో పని దినాలలో హుస్సేన్ సాగర్ లేక్ మ్యూజికల్ ఫౌంటెన్ 3 షోలు ఉంటాయి. వారాంతాల్లో, సెలవుల్లో సంగీత ప్రదర్శనల సంఖ్యను నాలుగుకి పెంచుతారు. ఒక్కో షో 20 నిమిషాల నిడివి ఉంటుంది. ఎన్టీఆర్ మార్గ్ నుంచి, సాగర్ బోటు షీకారులోనూ ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రదర్శనను చూసే అవకాశం ఉంటుంది. రోజూ రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మూడుసార్లు మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రదర్శన ఉంటుంది. వీకెండ్స్, సెలవు రోజుల్లో షోల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.

ప్రవేశ రుసుము
హుస్సేన్ సాగర్ లేక్ వద్ద సంగీత ప్రదర్శనను చూడటానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. కానీ పర్యాటకులు లుంబినీ పార్క్ నుండి చూడాలనుకుంటే మాత్రం రూ. 50 ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వివిధ థీమ్లతో పొగ మంచు ఫెయిరీ ఫాగ్, క్లౌడ్ ఎఫెక్ట్ను సృష్టిస్తూ అద్భుత వాతావరణంలో ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రదర్శన ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.



Click it and Unblock the Notifications













