తెలంగాణలోని సిద్దిపేటలో నిర్మించిన శ్రీపాద కార్య సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ టెంపుల్గా నిర్మితమైంది. ఈ ఆలయం వాస్తుశిల్ప సౌందర్యం, సాంకేతిక పరిఙ్ఞానంతో పర్యాటకులను ఆకట్టకుంటుంది. ఇది అసాధారణమైన రీతిలో నిర్మించిన ఒక ఆధ్యాత్మిక అద్భుతమనే చెప్పుకోవాలి. శ్రీపాద కార్య సిద్ధేశ్వర స్వామి దేవస్థానం 'ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ హిందూ దేవాలయం".
నవంబర్ 24 నుంచి భక్తుల సందర్శనకు అనుమతి...
ఈ దేవాలయాన్ని సింప్లిఫోర్జ్ క్రియేషన్స్తో కలిసి అప్సుజా ఇన్ఫ్రాటెక్ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని చార్విత మెడోస్లో ప్రారంభించడం జరిగింది. దీనిని సిద్దిపేట నడిబొడ్డున బూరుగుపల్లి, వాయుపురి వేదికగా నెలకొల్పారు. ఈ ఆలయం తెలంగాణ సాంస్కృతి వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఆలయ నిర్మాణం 35.5 అడుగుల పొడవు, 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన అనంతరం నవంబర్ 24, 2023 తేది నుంచి భక్తుల సందర్శనార్థం దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ దేవాలయానికి మూడు గర్భాలయాలు...
ఈ హిందూ దేవాలయాన్ని మూడు భాగాలుగా నిర్మించారు. ఈ కట్టడంలో మూడు గర్భాలయాలు ఉంటాయి. 'మోదక్' ఆకారంలో ఉన్నది గణేశుడికి, దీర్ఘచతురస్రాకార ఆలయం శివుడికి, కమలం ఆకారంలోనిది పార్వతి దేవి కోసం రూపొందిచడం జరిగింది. సింప్లిఫోర్జ్ చే అంతర్గతంగా అభివృద్ధి చేసిన సిస్టమ్, దేశీయంగా అభివృద్ధి చేసిన మెటీరియల్, సాఫ్ట్ వేర్తో ఈ నిర్మాణం త్రీడీగా ముద్రించబడింది. ఈ ఆలయ వాస్తుశిల్ప వైభవం ఇక్కడికి వచ్చిన భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది.
ఈ ఆలయ ప్రారంభోత్సవంలో అప్సుజా ఇన్ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ హరి కృష్ణ జీడిపల్లి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ ఘూలే, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వసీం చౌదరి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా హరికృష్ణ జీడిపల్లి మాట్లాడుతూ సంప్రదాయాల సమన్వయంతో దైవ దర్శనానికి జీవం పోస్తూ 3డిలో నిర్మించిన ఈ హిందూ దేవాలయం మన అంకితభావానికి నిదర్శనమని అన్నారు.
ఈ ప్రక్రియ 70 రోజుల ముద్రణలో పూర్తయ్యింది..
చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ ఘూలే కూడా మాట్లాడారు. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి ఆలయం. ఈ నిర్మాణం, నిర్మాణ అవసరాలు, ఆలయ రూపకల్పన సూత్రాలు, 3డి ప్రింటింగ్ అవసరాలు, ఇన్-సైట్ నిర్మాణంలో సవాళ్లతో కూడుకొని ఉందన్నారు. ఇక, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వసీం చౌదరి మాట్లాడుతూ ఈ ఆలయం పూరీ జగన్నాథ ఆలయ శైలి నుండి ప్రేరణ పొందిదని, ఈ ఆలయ గోపురం డిజైన్లు వాస్తుశిల్పం పట్ల మన నిబద్దతను చూపుతాయన్నారు.
ఈ నిర్మాణ సమయంలో ఎదురైన అడ్డంకులను దాటుకుంటూ సింప్లిఫోర్జ్ పేటెంట్ పొందిన 3డీ ప్రింటబుల్ కన్ స్ట్రక్షన్ మెటీరియల్, సింప్లిక్రీట్ని ఉపయోగించి మరీ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మోదక, శివాలయం లోటస్ గర్భగుడులతోపాటు అన్నీ గర్భాలయాలు, గోపురం స్పైర్లు పూర్తిగా ఆన్-సైట్ 3డీ ప్రింటింగ్ ద్వారా రూపొందించబడినేవనని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ ప్రక్రియంతా కేవలం 70 రోజుల నిరంతర ముద్రణలో పూర్తవ్వడం ఎంతో విశేషమన్నారు. ఆలయ మండపం స్లాబ్ సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి నిర్మించారని వెల్లడించారు.



Click it and Unblock the Notifications













