ఢిల్లీలో త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం నిర్మించనున్నారు..!
భారతదేశం త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంకు నిలయం కానుంది. భారతదేశంలో చాలా మ్యూజియమ్లను చూసి ఉంటారు. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియాన్ని ఎప్పుడైనా చూసారా? అది కూడా భారతదేశంలోనే ఉంది అన్న విషయం తెలుసా? అవునండి. అతి త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియమ్ను చూడబోతున్నారు. ఢిల్లీలోని నార్త్ అండ్ సౌత్ బ్లాక్లో దీన్ని నిర్మించనున్నారు. ఈ మ్యూజియం ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం పదండి. దేశంలోని 5000 వేల సంవత్సరాల చరిత్రను తెలియజేసే ఎనిమిది నేపథ్య విభాగాలు ఈ మ్యూజియంలో ఉండబోతున్నాయట.. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ మ్యూజియం గురించిన విశేషాలు తెలుసుకుందామా..!

ఐదువేల సంవత్సరాల చరిత్ర..
ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియంను త్వరలో నిర్మించేందుకు భారత్ సిద్ధమైంది. రాబోయే యుగే యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా అవతరించబోతుంది. ఇందులో 5,000 సంవత్సరాల పాటు భారతదేశ చరిత్రను వివరించే ఎనిమిది నేపథ్య విభాగాలు ఉంటాయి. అంతేకాకుండా, ఈ మ్యూజియం దేశ రాజధాని నడిబొడ్డున, నార్త్, సౌత్ బ్లాక్లలో, 1.17 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబోతున్నారు. బేస్మెంట్తో సహ కలిపి మూడు అంతస్థులలో 950 గదులను కలిగి ఉంటుంది ఈ మ్యూజియం. ఈ మ్యూజియం ఫ్రాన్స్ సహకారంతో తయారు చేయబడుతుంది.
ఎందుకంటే దేశంలోని ప్రధాన సాంస్కృతిక ప్రాజెక్టులను నిర్వహించడంలో మంచి అనుభవం ఈ దేశానికే ఉంది కాబట్టి. మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో మూడు రోజుల అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్పోను ప్రారంభించినప్పుడు ఈ మ్యూజియం గురించి ప్రస్తావించారు. ఇటీవల, ప్రధాన మంత్రి దాదాపు 123 ఎకరాల క్యాంపస్ విస్తీర్ణంతో దాదాపు IMR 2,700 కోట్లతో అభివృద్ధి చేసిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC) కాంప్లెక్స్ను ప్రారంభించారు.

నాగరికత సంస్కృతి ప్రదర్శన..
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన యుగే యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియంను కూడా ప్రకటించారు. ఈమ్యూజియంలో ఐదువేల సంవత్సరాలకు పైగా విస్తరించి ఉన్న భారతదేశపు గొప్ప నాగరికత సంస్కృతిని ఎనిమిది నేపథ్య విభాగాల ద్వారా ప్రదర్శిస్తుందట. ఈ విభాగాలలో ప్రాచీన భారతీయ విజ్ఞానం, ప్రాచీన కాలం నుండి మధ్యయుగం, మధ్యయుగం నుండి పరివర్తన దశ, ఆధునిక భారతదేశం, డచ్, బ్రిటిష్, పోర్చుగీస్, ఇతరులు భారతదేశానికి వచ్చినప్పుడు వలస పాలన, స్వాతంత్ర్య పోరాటం మరియు 1947 నుండి 100 సంవత్సరాలు అన్నింటిని ఇందులో చూపిస్తారట.

మ్యూజియం వర్చువల్ వాక్త్రూ..
మ్యూజియం వర్చువల్ వాక్త్రూ ద్వారా మ్యూజియం పూర్తయిన తర్వాత అందులోని గార్డెన్లు, గ్యాలరీలు ఎలా కనిపిస్తాయో అని ఒక డిజిటల్ అనుభవాన్నిఅందించారు. ఈ వర్చువల్ టూర్ ప్రదర్శనల ద్వారా గ్యాలరీలను కూడా ప్రదర్శించింది. ఇది పురాతన పట్టణ ప్రణాళికా వ్యవస్థలు, పురాతన వైద్య పరిజ్ఞానం, వేదాలు, ఉపనిషత్తులు, మరిన్నింటి గురించి సందర్శకులకు తెలియజేస్తుంది. మౌర్యుని నుండి గుప్త సామ్రాజ్యాలు, విజయనగర సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్య, అనేక ఇతర రాజవంశాల పాలన గురించి కూడా ఇందులో ప్రస్తావించబడింది. మ్యూజియంలో విభిన్న కళాఖండాలు ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మ్యూజియంలతో పాటు నేషనల్ మ్యూజియంలోని కళాఖండాలను కూడా ఇక్కడ ఉంచుతారు. అయితే ఈ మ్యూజియం ఎప్పటి వరకు నిర్మిస్తారనే విషయం ఇంకా తెలియరాలేదు.



Click it and Unblock the Notifications












