దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు చరిత్రను పరిచయం చేయడంతోపాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయి. అలాంటి చారిత్రక నగరాల్లో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ కూడా ఒకటి. ఇక్కడి అనేక నిర్మాణాలు అలనాటి రాచరికపు కాలానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయి. అందుకే ఈ నగరాన్ని సిటీ ఆఫ్ ఫ్యాలెసెస్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక్కడ గడిపే ప్రతి క్షణం మన భారతీయ సాంస్కృతిని, వారసత్వ సంపదను పరిచయం చేస్తుందంటే అతిసయోక్తి కాదు. మరెందుకు ఆలస్యం.. ఆ మైసూర్తోపాటు చుట్టుపక్కల ఉన్న పర్యాటక అందాలను పలకరిద్దాం పదండి!
కర్ణాటకలోని మైసూరు అంటే వారసత్వ భవనాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలో కొన్ని ప్యాలెస్ల రూపంలో ఉండగా, మరికొన్ని ప్రభుత్వ భవనాలుగా ఉపయోగపడుతున్నాయి. ఒక్క మైసూరులోనే 100కు పైగా రాజ భవనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నేటికీ వాడుకలో ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద ప్యాలెస్లలో ఒకటైన మైసూర్ ప్యాలెస్ను 1912లో వడయార్ రాజవంశీయులు నిర్మించారని ప్రచారంలో ఉంది. ఈ ప్యాలెస్ లోని లైట్ అండ్ సౌండ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇది కుటుంబసమేతంగా సందర్శించే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక్కడ ప్రతి ఏటా దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే, మైసూర్ జూ కూడా భారతదేశంలోని పురాతన జంతుప్రదర్శనశాలలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దీనిని 1892లో ఏర్పాటు చేశారు. ఈ జంతుప్రదర్శనశాల సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ విభిన్న జంతువులు సందడి చేస్తుంటాయి. ఇది అనేక జాతుల జంతుజీవాల సేకరణకు నిలయంగా పేరుగాంచింది. మైసూర్ జంతుప్రదర్శనశాలలో భారతదేశంలోని జంతువులే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి రంపించిన జంతువులు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.

బృందావన్ గార్డెన్ అందాలు..
కృష్ణ రాజ్ సాగర్ డ్యామ్ క్రింద ఉంది బృందావన్ గార్డెన్. 60 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ తోట నిర్మాణం 1927లో ప్రారంభమై 1932లో పూర్తి చేశారు. దేశంలోని ఉత్తమమైన గార్డెన్లలో బృందావన్ గార్డెన్ పేరు తప్పకుండా చేర్చాల్సిందే. కాశ్మీర్లోని షాలిమార్ గార్డెన్స్ మాదిరి రూపొందించబడిన ఈ ఉద్యానవనం పచ్చటి పచ్చిక బయళ్ళు, పూల పాన్పులు, మల్టీ హ్యూడ్ ఫౌంటైన్లతో సందర్శకులను ఆకర్షిస్తుంది. ప్రసిద్ధ మ్యూజికల్ ఫౌంటెన్ ఇక్కడ అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఇది ఒక రకమైన వాటర్ బ్యాలెట్. లైట్లు సంగీతానికి అనుగుణంగా వెలుగుతూ సందర్శకులను ఉర్రూతలూరిస్తాయి. ఈ రంగుల ఫౌంటెన్ను ఆస్వాదించడానికి సూర్యాస్తమయం తర్వాత సందర్శించాలి.

శివనసముద్రం జలపాతం..
శివనసముద్రం జలపాతం మైసూర్ నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దక్షిణ కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధ జలపాతాలలో ఒకటి. జూన్ మాసంలో రుతుపవనాలు వచ్చినప్పుడు గగనచుక్కి, బారచుక్కి జలపాతాలు సైతం ఎంతో అందంగా కనువిందు చేస్తాయి. శివనసముద్ర జలపాతం వద్దకు చేరుకున్నాక గంటల సమయం క్షణాల్లా గడిచిపోతాయి. కావేరీ నదిని రెండు జలపాతాలుగా విభజించే ద్వీప పట్టణం శివనసముద్రం. గగన్చుక్కి జలపాతం మరియు బారచుక్కి జలపాతాలు రెండు జలపాతాల పేర్లు. ఈ జలపాతాలు ప్రపంచంలోని టాప్ 100 జలపాతాల జాబితాలో చేర్చుకోబడతాయి.



Click it and Unblock the Notifications













