మొఘలులు నిర్మించిన అందమైన భవనాలలో కొన్నిఇవే..!
భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భారతీయ సంస్కృతిని తెలుసుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరచుగా ఇక్కడికి వస్తుంటారు. భారతదేశపు విస్తృతమైన సంస్కృతిని ప్రతిబింబించే అనేక భవనాలు భారతదేశంలో ఉన్నాయి. వైవిధ్యాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భారతదేశం ఎల్లప్పుడూ ప్రజలను తనవైపు ఆకర్షిస్తుంది. భారతదేశాన్ని చాలా సంవత్సరాలు మొఘలులు పాలించారు. దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఇలాంటి అనేక భవనాలను భారతదేశంలో మొఘలులు నిర్మించారు. మొఘలులు నిర్మించిన అలాంటి కొన్ని భవనాల గురించే ఈ రోజు మనం తెలుసుకుబోతున్నాం. రండి, ఆలస్యమేందుకు ఆ భవనాల విశేషతలేంటో తెలుసుకుందాం.

జామా మసీదు
జామా మస్జిద్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు. మొఘల్ రాజు షాజహాన్ ఆదేశాల మేరకు 1644 నుంచి 1656 మధ్య ఢిల్లీ జామా మస్జిద్ ను నిర్మించారు. దీని నిర్మాణానికి అప్పట్లో 10 లక్షల రూపాయలు ఖర్చయ్యింది. 50000 వేలకు పైగా కార్మికులు దశాబ్ధానికి పైగా కష్టించి దీనిని రూపొందించారు. ఇక్కడి కోర్ట్ యార్డ్ లో 25 వేల మంది ఒకే సారి ప్రార్ధనలు చేసుకునే వీలు ఉంది. అంతేకాకుండా మసీదు ప్రాంగణంలో 85 వేల మందికి వసతి కల్పించే సౌలభ్యం కూడా ఉంది.
హుమాయున్ సమాధి
ఆగ్రాలోని తాజ్ మహల్ తరహాలో దీనిని నిర్మించారు. మొఘలులు భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత నిర్మించిన పెద్ద కట్టడాల్లో ఇది ముఖ్యమైనది. హుమాయూన్ భార్య హాజీ బేగం పర్షియా నుంచి ఆర్కిటెక్టులను పిలిపించి మరీ దీనిని కట్టించింది. ఈ సమాధి నిర్మాణం హుమయూన్ మరణించిన తొమ్మిదేళ్లకు క్రీ.శ 1565లో మొదలైంది. పూర్తవడానికి ఏడేళ్లు పట్టింది. నిర్మాణాన్ని మొదలు పెట్టిన మిరాక్ మీర్జా మరణించడంతో అతడి కొడుకు సయీద్ ముహమ్మద్ దీని నిర్మాణాన్ని పూర్తి చేశాడు.
ఫతేపూర్ సిక్రి
ఫతేపూర్ సిక్రి భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలో ఉన్న ఒక చారిత్రాత్మకమైన కోట నగరం. ఇది 16వ శతాబ్దం చివరలో మొఘల్ చక్రవర్తి అక్బర్ చేత నిర్మించబడింది. 1571 నుండి 1585 వరకు మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా పనిచేసింది. మొఘల్ వాస్తుశిల్పానికి అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటిగా నిలిచింది. ఈ నగరం నిర్మాణం దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. దీని నిర్మాణం 1585లో పూర్తయింది.

బులంద్ దర్వాజా
మొఘల్ వాస్తుశిల్ప వైభవానికి బులంద్ దర్వాజా ఒక అద్భుతమైన ఉదాహరణ అని చెప్పుకోవాలి. ఇది ఎరుపు, పసుపు ఇసుక రాయితో నిర్మించబడింది. తెలుపు, నలుపు పాలరాయితో ఈ నిర్మాణం లోపలి భాగం అలంకరించబడి ఉంటుంది. ఈ నిర్మాణపు స్తంభాలపై పవిత్రమైన ఖురాన్ శాసనాలు కనిపిస్తాయి. క్రీస్తు శకం 1576 లో గుజరాత్ పై సాధించిన అద్భుతమైన విజయానికి జ్ఞాపకార్ధంగా అక్బర్ చక్రవర్తి బులంద్ ఈ దర్వాజాను నిర్మించాడు. ప్రస్తుతం ఇది ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా నిలవడమే కాకుండా, పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

సఫ్దర్జంగ్ సమాధి
భారతదేశంలోని మొఘలులు నిర్మించిన అనేక అద్భుతమైన స్మారక కట్టడాలలో ఇది ఒకటి. 1753-54 మధ్య సఫ్దర్జంగ్ కుమారుడు షుజా-ఉద్-దౌలా చేత నిర్మించబడిన ఈ సమాధిలో మోతీ మహల్, బాద్షా పసంద్, జంగ్లీ మహల్ వంటి అనేక చిన్న పందిళ్లు ఉన్నాయి. మొఘల్ నిర్మాణాలలో ప్రముఖ నిర్మాణ శైలి అయిన చార్బాగ్ శైలి తోటల మధ్యలో నిర్మించబడిన సఫ్దర్జంగ్ సమాధి చెరువులు, ఫౌంటైన్లతో అలంకరించబడి ఉంటుంది. తెల్లటి పాలరాతి గోపురంతో ఎర్ర ఇసుకరాయితో ఈ సమాధిని నిర్మించారు.



Click it and Unblock the Notifications














