వెన్నులో వణుకు పుట్టించే ఢిల్లీలోని భయానక ప్రదేశాలు ఇవే...
భారతదేశంలో అందమైన ప్రదేశాలతో పాటు కొన్ని అరుదైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇండియాలోని ఢిల్లీలో అయితే అందమైన ప్రదేశాలకు కొదవే లేదు. కానీ, అక్కడే వెన్నులో వణుకు పుట్టించే అతి భయంకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా? ఢిల్లీలో ఆశ్చర్యపరిచే అనేక హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయి. రండి, ఆ ప్రదేశాల గురించి ఓసారి తెలుసుకుందాం.
అగ్రసేన్ మెట్ల బావి
ఢిల్లీలోని ఈ మెట్ల బావిలో అనేక దయ్యాల కథలు ముడిపడి ఉన్నాయి. ఇది అందమైన వాస్తుశిల్పానికి ఉదాహరణ. ఈ మెట్ల బావిలోని అత్యల్ప భాగం మూడు స్థాయిలుగా విభజించబడింది. నల్లటి నీటితో ఈ బావి నిండి ఉంటుంది. దానిపై ఇనుప కడ్డీలు స్థిరంగా ఉంటాయి. చాలా మంది ఈ నీటిలో దూకి ఆత్మహత్యలకు పాల్పడటమే ఇందుకు కారణమని ఇక్కడి వారు భావిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారిని ప్రేత శక్తులు వశీకరణకు గురిచేస్తాయని అందుకే, ఈ నీటిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇక్కడివారు చెబుతున్నారు. ఈ కారణంగా సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ ప్రవేశం నిషేధించబడింది. ఒకవేళ ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకుంటే మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు మాత్రమే ఇక్కడికి చేరుకోండి. దీని సమీప మెట్రో స్టేషన్లు బరాఖంబ, జనపథ్.

మల్చా మహల్
అడవుల మధ్య ఉన్న ఈ భవనంలో బేగం విలాయత్, ఆమె పిల్లలు ఇక్కడ నివసించారని చెప్పుకునేవారు. అయితే 1993లో బేగం విలాయత్ ఆత్మహత్య చేసుకుంది. 2017లో బేగం కుమారుడు ప్రిన్స్ రజా శవమై కనిపించాడు. ఆ తర్వాత ఈ ప్రదేశం హాంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడింది. బేగం విలాయత్ ఆత్మ ఇప్పటికీ ఇక్కడ సంచరిస్తుందని ఇక్కడివారి నమ్మకం. ధౌలా కువాన్ ఇక్కడికి సమీప మెట్రో స్టేషన్, ఇక్కడ నుండి ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఉదయం పూట ఈ ప్రాంతాన్ని సందర్శించొచ్చు.

భూలి భటియారీ ప్యాలెస్
సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్లో నిర్మించిన ఈ భవనం ఢిల్లీలోని అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో ఒకటి. మచ్లా మహల్ లాగా ఫిరోజ్ షా తుగ్లక్ ఈ వేట మైదానాన్ని నిర్మించాడు. ఈ ప్రదేశానికి సంబంధించి చాలా కథలే వినిపిస్తాయి. అందులో ఒకటి, భటియారీ కులానికి చెందిన ఒక మహిళ దారి తప్పి ఇక్కడకు వచ్చింది. ఆ తర్వాత ఆమె ఇక్కడ ఆమె ఇక్కడే మరణించింది. ఆమె మృతదేహాన్ని ఇక్కడే పాతిపెట్టారు. అప్పటినుంచి ఇక్కడ ఆమె ఆత్మ సంచరిస్తుందని ఇక్కడివారు నమ్ముతున్నారు. సాయంత్రం తర్వాత ఇక్కడికి వెళ్లడం నిషేధం. కానీ పగటిపూట ఈ ప్రదేశపు అందాలను వీక్షించొచ్చు. కరోల్ బాగ్ ఇక్కడికి సమీప మెట్రో స్టేషన్.

జమాలి కమలీ సమాధి
మెహ్రౌలీ ఆర్కియోలాజికల్ పార్క్లో ఉన్న ఈ సమాధి మొఘల్ కాలం నాటి వాస్తుశిల్పానికి చాలా అందమైన ఉదాహరణగా పేర్కొంటారు. సూఫీ సన్యాసి జమాలి, అతని శిష్యుడు కమలిని ఇక్కడ సమాధి చేశారు. ఇక్కడ జిన్లు నివశిస్తున్నారని ఇక్కడి కథనం ప్రసిద్ధి చెందింది. వింత వింత శబ్దాలు, సమీపంలో ఎవరో నిలబడి ఉన్ననీడలు కనిపించేవని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. ఇక్కడికి సమీప మెట్రో స్టేషన్ గ్రీన్ పార్క్.
ఫిరోజ్ షా కోట్లా కోట
ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించిన ఈ కోట నేడు ఢిల్లీలోని అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జిన్లు నివసిస్తారని, కొందరు ఇక్కడికి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం జిన్లకు లేఖలు రాస్తారని ఈ ప్రాంతానికి సంబంధించిన కథనం. ఇక్కడికి సమీప మెట్రో స్టేషన్ ఢిల్లీ గేట్.



Click it and Unblock the Notifications












