రెండురోజుల్లో దీపావళి రాబోతుంది. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. దీపావళి పండగ అంటేనే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా చేసుకునే పండగ. దీపావళి రోజున వాడవాడలూ దీపాలతో అలంకరిస్తారు. అమావాస్య చీకట్లను తరుముతూ ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగిస్తారు. తమ సంతోషాన్ని వివిధ రకాల పటాకులు కాల్చి ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అయితే మన దేశంలో దీపావళికి బాణసంచా కాల్చని, దీపావళి పండుగ జరుపుకోని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..
వలస పక్షుల కోసం...
తమిళనాడు శివగంగ జిల్లాలోని కొల్కుడ్పట్టి , వెట్టంగుడిపట్టి గ్రామస్థులు ప్రతి దీపావళి పండుగకు టపాసులు కాల్చరు. దీనికి ఓ పెద్ద కారణమే ఉంది. ఇక్కడి వెట్టంగుడి అభయారణ్యానికి కొన్ని దశాబ్దాలుగా వలస పక్షులు వస్తుంటాయి. అక్కడే కొన్ని రకాల పక్షులు పిల్లల్ని కూడా కంటాయి. అయితే, అవి ముఖ్యంగా శీతాకాలంలో స్విట్జర్లాండ్, రష్యా, ఇండోనేషియా, శ్రీలంక వంటి సుదూర ప్రాంతాల నుంచి ఈ అభయారణ్యానికి సుమారు 15 వేల పక్షులు వలస వస్తాయి. వలస వచ్చే పక్షులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఇక్కడి గ్రామస్థులు దీపావళికి టపాసులు కాల్చడాన్ని నిషేదించారు.

200 జాతుల వలస పక్షులు ..
ఈ అభయారణ్యానికి సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వివిధ జాతుల పక్షులు వలసలు వస్తాయి. అందులో గ్రే హెరాన్లు, డార్టర్లు, కామన్ టీల్స్ సహా మరో ఐదు నుంచి 10 రకాల వలస పక్షులు జాతులు ఉన్నాయి. ఈ అభయారణ్యం మొత్తం 38 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సుమారు అర్ధశతాబ్దం నుంచి 200 జాతుల వలస పక్షులు వెల్లంగుడి అభయారణ్యానికి వస్తున్నాయని ఇక్కడివారు చెబుతున్నారు.
పక్షులను సురక్షితంగా చూసుకునేందుకు ఇక్కడివారంతా కొన్ని దశాబ్దాల క్రితం నుంచి దీపావళి సమయంలో టపాసులను పేల్చడం కానీ.. తమ పిల్లలు చేత కాల్పించడం కానీ చేయడం లేదు. అయితే గత సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల పక్షుల రాక తగ్గిందని, పర్యాటకుల సంఖ్య కూడా తగ్గిందని గ్రామస్థులు చెబుతున్నారు.

ఐదు దశాబ్దాలుగా దీపావళికి దూరం..
పంజాబ్లోని కొన్ని గ్రామాల్లో అయితే, అసలు దీపావళి పండుగనే జరుపుకోరు. దీపావళి వేడుకలకు ఇక్కడి కొన్ని గ్రామాలు సుమారు ఐదుదశాబ్దాలుగా దూరంగా ఉంటున్నాయి. బఠిండా జిల్లాలోని మూడు గ్రామాలు మాత్రం దీపావళి సంబరాలు చేసుకునేందుకు నిరాకరిస్తున్నాయి. ఎందుకంటే, ఈ ప్రాంతాల్లో ఆర్మీ కంటోన్మెంట్, మందుగుండు సామాగ్రి డిపో వున్నాయి. దాంతో ఈ గ్రామాలు దీపావళిని జరుపుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. బఠిండా జిల్లాలోని పూస్మండి, భగూ, గులాభ్గఢ్ గ్రామాల్లో బాణాసంచా పేల్చడం, పంట వ్యర్థాలను కాల్చడం పై ఎప్పటినుంచో నిషేదం ఉంది.
అందుకే ఈ మూడు గ్రామాల వారు దీపావళి పండుగలను జరుపుకోరు. ఈ ప్రాంతంలోని పిల్లల్ని దీపావళి వేడుకలు చేసుకునేందుకు తమ బంధువుల ఇంటికి పంపిస్తామని ఇక్కడివారు చెబుతున్నారు. 1976లోనే భారీగా భూమిని సేకరించి ఆర్మీ కంటోన్మెంట్, మందుగుండు సామాగ్రి డిపోలను ఇక్కడ ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా ఇక్కడ టపాసులు కాలిస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఇక్కడివారు అంటున్నారు.



Click it and Unblock the Notifications














