ఉత్తరాఖండ్లోని రిషికేశ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం యోగా నగరంగా కూడా పేరుగాంచింది. అంతేకాదు, భారతదేశంలోని అతిపెద్ద సాహస ప్రదేశంగా కూడా ఈ ప్రాంతం ప్రాముఖ్యతను సంతరించుకుంది. చాలామంది సెలవుల్లో ప్రయాణాలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటప్పుడు ఈ సెలవుల్లో తప్పకుండా రిషికేష్ను సందర్శించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి.
ఇక్కడి చాలా ప్రదేశాలను ఇంతకుముందే చూసి ఉండవచ్చు. కానీ రిషికేశ్ గుహలు చాలా ప్రత్యేకమైనవి. ఈ గుహలకు సంబంధించిన అనేక రహస్య కథనాలు ఉన్నాయి. ఈ రహస్యాలు అత్యంత భయానకంగా ఉంటాయి. వశిష్ఠ గుహ అనేది రిషికేశ్లోని అత్యంత ప్రసిద్ధ గుహ. పురాణాల ప్రకారం రాముడి గురువు రిషి వశిష్ఠ ఆత్మ ఇక్కడ తిరుగుతుందని చెబుతుంటారు. బుధేర్ గుహ, మౌని బాబా గుహ వంటి గుహలు ఇక్కడ ఎంతగానో ప్రసిద్ధి చెందాయి.

వశిష్ఠ గుహ
రిషికేష్లోని వశిష్ఠ గుహ చరిత్ర చాలా పురాతనమైనదని చెప్పుకోవచ్చు. ఇది దాదాపు 3000 సంవత్సరాల నాటిదని చరిత్ర చెబుతోంది. వశిష్ఠ గుహ ఒక రహస్యమైన గుహగా పరిగణించబడుతుంది. రాముడి గురువైన వశిష్ఠుని ఆత్మ ఇప్పటికీ ఇక్కడ నివసిస్తుందని ఇక్కడివారి నమ్మకం. సూర్యుడు అస్తమించగానే ఈ గుహ దగ్గరికి వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించరు. ఈ గుహ రాముని గురువైన ఋషి వశిష్ఠకు అంకితం చేయబడింది. అంతేకాదు, ఇక్కడ వశిష్ఠ మహర్షి పూజ వంటి కార్యక్రమాలు కూడా చేసేవారని ఇక్కడివారి నమ్మకం. వశిష్ఠ గుహ రిషికేశ్లో ధ్యాన ప్రియులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా కూడా పేరుగాంచింది. వశిష్ఠ గుహ రిషికేశ్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో రిషికేశ్ బద్రీనాథ్ హైవేపై ఉంది. ఇది గంగా నది ఒడ్డున ఉంది. పురాణాల ప్రకారం వశిష్ఠ మహర్షి ఇక్కడ ధ్యానం చేసేవాడు.

బుధేర్ గుహలు
బుధేర్ గుహలు అనేవి చారిత్రక గుహలు. ఈ గుహలు మియోలా గుహల పేరుతో కూడా ప్రసిద్ధి చెందాయి. పురాణాల ప్రకారం, మహాభారత ఇతిహాసంలోని పాండవులు తమ కోటకు నిప్పంటించినప్పుడు తప్పించుకోవడానికి బుధేర్ గుహలను నిర్మించబడ్డాయని తెలుస్తోంది. ఇది 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. రిషికేశ్ నుండి కొన్ని గంటల దూరంలోనే బుధేర్ గుహలను చేరుకోవచ్చు. ఈ గుహ వెడల్పు చాలా తక్కువగా ఉందని, అతి కష్టంతో ఈ గుహలోపలకి ప్రవేశించాలని ఇక్కడికి వెళ్లినవారు చెబుతున్నారు. ఈ గుహ లోపలికి వెళ్లే కొద్దీ లోతు పెరుగుతూ ఉంటుందని చెబుతున్నారు. చీకటిపడగానే ఈ గుహలోపలికి ఎవ్వరూ వెళ్లే సాహసం చేయరు.

మౌని బాబా గుహ
రిషికేశ్లో ఉన్న మౌని బాబా గుహ చాలా ప్రసిద్ధి చెందిన గుహ. గుహ గురించి చాలా కథలు ఉన్నాయి. బాబా గుహ నిగూఢమైన విషయాలతో నిండి ఉందని ప్రజల విశ్వాసం. కొంతమంది ఇది ఆధ్యాత్మిక కేంద్రమని కూడా నమ్ముతున్నారు. దీని కారణంగా ఇది పర్యాటకులకు ప్రత్యేక ప్రాంతంగా దర్శనమిస్తుంది. ఇక్కడికి స్థానిక పర్యాటకులే కాకుండా విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. అయితే, సూర్యుడు అస్తమించగానే ఈ గుహ లోపల తిరిగేందుకు ఎవరూ సిద్దపడరు.
రిషికేశ్ ఎలా చేరుకోవాలి
ఉత్తరాఖండ్, భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రధాన గమ్యస్థానాలకు రిషికేశ్ మోటరబుల్ రోడ్ల ద్వారా అనుసంధానించబడి ఉంది. లగ్జరీ, సాధారణ బస్సులు ఢిల్లీ ISBT కాశ్మీరీ గేట్, మీరట్ నుండి రిషికేశ్కి సులభంగా అందుబాటులో ఉంటాయి. అక్కడి నుండి టాక్సీ లేదా ఆటోలు ద్వారా ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications













