మహానగరంలో పర్యాటక మణిహారం.. హుస్సేన్ సాగరం!
చారిత్రక నగరానికి మరింత అందాన్నిచ్చేందుకు మెడలో హారంలా చుట్టూ పచ్చని గార్డెన్స్తో అల్లుకున్న ఆహ్లాదరకమైన పర్యాటక ప్రదేశం హుస్సేన్ సాగర్. ఇది ముమ్మాటికీ హార్ట్ ఆఫ్ హైదరాబాద్ అనే చెప్పాలి. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ ట్యాంక్ బండ్ మీద కొలువైన వైతాళికులు చరిత్ర ప్రేమికులను ఆకర్షిస్తుంటే.. హుస్సేన్ సాగర్ మధ్య అత్యంత ఎత్తయిన ఏకశిలా బుద్దుని విగ్రహం నగర వాసులకు ప్రశాంతను చేరువచేస్తోంది. మరెందుకు ఆలస్యం హైదరాబాద్ పర్యాటక శిగలో దాగిన హుస్సేన్ సాగర్ విశేషాలను తెలుసుకుందామా?!
ఆసియాలో అతిపెద్ద కృత్రిమ సరస్సుగా ప్రసిద్ధి చెందిన హుస్సేన్ సాగర్ హైదరాబాద్లో ఉన్న అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ సరస్సు 1563లో ఇబ్రహీం కులీ కుతుబ్ షాచే ప్రారంభించబడింది. దీని మధ్యలో ఉన్న బుద్ధుని విగ్రహం ఏకశిలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఏకశిలా నిర్మాణం ప్రపంచంలో అత్యంత ఎత్తయినదీగా కూడా గుర్తింపు పొందింది. హుస్సేన్ సాగర్ను ట్యాంక్ బండ్ అని కూడా పిలుస్తారు. మూసీ నది ఒడిలో శాదదీరేలా దర్శరమిసతోంది హుస్సేన్ సాగర్. దీనికి సుమారు మూడు కిలోమీటర్ల పొడవైన ఆనకట్ట గోడ ఉంది. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతూ మహానగర వెన్నులా నిలుస్తోంది. సాగర్కు మూడు వైపులా ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్ మరియు లుంబినీ పార్క్లు సరిహద్దులుగా ఉన్నాయి.
ప్రధాన పర్యాటక హాట్స్పాట్గానే కాదు..
హుస్సేన్ సాగర్ ఒక ప్రధాన పర్యాటక హాట్స్పాట్గా ఉండటంతో పాటు, వాటర్ స్పోర్ట్స్కు కూడా కేంద్రంగా ఉంది. సెయిలింగ్, యాచింగ్ మరియు బోటింగ్ వంటి వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్ నిత్యం ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే, హుస్సేన్ సాగర్ వాటర్ స్పోర్ట్స్, బోట్ రైడ్ వంటి కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ దీని ప్రధాన ఆకర్షణ మాత్రం సాగర్ నడిబొడ్డున ఉన్న ఏకశిలా బుద్ధ విగ్రహం. ఈ బుద్ధుని విగ్రహం 1992 సంవత్సరంలో స్థాపించబడింది. బౌద్ధ గురువు దలైలామా స్వయంగా ప్రారంభించారు. సాయంత్రపు సమయంలో ట్యాంక్ బండ్ వద్ద నిలబడి, చుట్టూ మిరుమెట్లుగొలిపే లైట్ల కాంతులను చూస్తే.. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. అంతేకాదు, హుస్సేన్ సాగర్ ప్రత్యేకమైన హృదయాకారంలో ఉన్నందున, ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO)చేత ప్రపంచ హృదయంగా ప్రకటించబడింది.
వినోదరంపాటు చారిత్రక విజ్ఞానాన్ని అందించే..
నగరవాసులతోపాటు టూరిస్టులు రోజంతా గడిపేంత ఆహ్లాదం ఇక్కడ దొరుకుతుందనడంలో సందేహమే లేదు. లుంబినీ పార్క్ నుంచి బుద్దుని విగ్రహం వరకు లాంచ్లో విహరిస్తూ హుస్సేన్ సాగర్ అందాలను మనసారా ఆస్వాదించవచ్చు. లుంబినీ పార్క్ కాలిడోస్కోపిక్ లైట్ అండ్ సౌండ్ షోకు వేదిక. నగర చరిత్రను వివరించేలా ఆకట్టుకునే త్రీడీ చిత్రాలను లేజర్ లైట్లతో ప్రదర్శిస్తారు. ప్రదర్శన వినోదరంపాటు చారిత్రక విజ్ఞానాన్ని అందిస్తుందనే చెప్పాలి. లేజర్ షోతోపాటు మ్యూజికల్ వాటర్ ఫౌంటేన్ షో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ఇందిరాపార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్క్, చిల్ర్డన్స్ పార్క్, బటర్ ఫ్లై గార్డెన్ పార్క్, రాక్ గార్డెన్, గ్రీన్ లాన్స్ పిల్లలనే కాదు పెద్దలనూ ఆకట్టుకుంటాయి. అలా సాగర్ను చుట్టేసేందుకు బోట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. వీకెండ్లోనే కాకుండా సాయంకాలపు సమయంలో కుటుంబ సమేతంగా సేదదీరేందుకు హుస్సేన్ సాగర్ నగరవాసులకు సరైన ఎంపిక.