కుటుంబంతో కలిసి రైలు ప్రయాణం చేయడం అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే, కుటుంబ సభ్యులలో పిల్లలు కూడా ఉంటే మాత్రం జర్నీలో వారికోసం మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అలా పిల్లల విషయంలో రైల్వే శాఖ కీలక ప్రకటన వెల్లడించింది. రైళ్లలో పిల్లలతో ప్రయాణించే తల్లుల సౌకర్యంలో భాగంగా పిల్లల కోసం రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా బేబీ బెర్తులను పరిచయం చేస్తోంది.
ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని దృవీకరించారు. ఇప్పటికే లఖ్నవూ మెయిల్లో రెండు బేబీ బెర్త్లను ప్రయోగాత్మకంగా తీసుకువచ్చినట్లు తెలిపారు. మిగిలిన అంశాలను పరిగణలోకి తీసుకొని బేబీ బెర్తల విషయంలో పూర్తిస్తాయి ప్రణాళికను వెల్లడిస్తామని ప్రకటించారు.

ప్రయోగంపై పలు ప్రశంసలు..
కేంద్ర రైల్వే మంత్రి ప్రకటనతో రైళ్లల్లో బిడ్డలతో ప్రయాణించే తల్లుల కోసం రైల్వే శాఖ ఎలాంటి ప్రణాళికలు వేయబోతోందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. నిజానికి చిన్న పిల్లలతో ప్రయాణం చేసేవారిలో చాలామంది పిల్లల కోసం ప్రత్యేకంగా బెర్తులు బుక్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ బేబీ బెర్తుల పైన రైల్వే శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఇదే అంశం పైన రాజ్యసభలో బీజేపీ ఎంపీ సమర్ సింగ్ సోలంకీ అడిగిన ప్రశ్నకు మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇస్తూ.. లఖ్నవూ మెయిల్లో రెండు బేబీ బెర్త్లను ప్రయోగాత్మకంగా తీసుకువచ్చామని, ఒక బోగీలో రెండు దిగువ బెర్త్లకు వాటిని అమర్చగా.. ఇప్పటికే ఈ ప్రయోగంపై పలు ప్రశంసలు వచ్చినట్లు తెలిపారు. అవసరం లేనప్పుడు వీటిని మడత పెట్టుకునేలా బేబీ బెర్త్లను రూపొందించారు.

ప్రయాణీకుల సూచనలు స్వీకరించి..
అంతేకాదు, ఈ బేబీ బెర్త్లు ఏర్పాటు చేయడం వల్ల పలు ఇబ్బందులు ఉన్నట్లు కూడా తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. బోగీలో సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గడం లాంటి సమస్యలను గుర్తించినట్లు వెల్లడించారు. అయితే, ప్రయాణికుల బోగీల్లో మార్పులు నిరంతర ప్రక్రియ అని గుర్తు చేశారు. ప్రత్యేకించి.. బేబీ బెర్తులు అనేవి పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించినవి అన్నారు. పిల్లలతో రైళ్లలో ప్రయాణించే చాలామంది తల్లిదండ్రులు రైళ్లలో పిల్లలను తమ బెర్తు పైనే సర్దుబాటు చేసుకుంటూ ఇబ్బందిగా జర్నీని కొనసాగిస్తుంటారు.
అలాంటి వారు సౌకర్యవంతమైన ప్రయాణం చేసేందుకు రైల్వే శాఖ తాజా ప్రతిపాదన ఉపయోగపడుతుంది. ప్రధాన బెర్తుకి ఆనుకుని ఉండే ఈ బేబీ బెర్తుని పైకి ఎత్తి పిల్లలను దాని మీద పడుకోబెట్టుకోవడంతోపాటు అవసరం లేనప్పుడు దాన్ని కిందికి మడత పెట్టేందుకు వీలుగా వీటిని రూపొందించారు. చిన్న పిల్లలను ముఖ్యంగా శిశువును సురక్షితంగా పడుకోబెట్టడానికి ఈ బేబీ బెర్తులు ఎంతో సౌకర్యవంతగా ఉంటాయి. అయితే, ఈ విధానం అమలుపై ప్రయాణీకుల సూచనలు స్వీకరించి, సమస్యలను పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. మరి రైల్వే శాఖ తీసుకువస్తోన్న ఈ బేబీ బెర్త్ విధానంపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి!



Click it and Unblock the Notifications













