భారతదేశంలో సందర్శించేందుకు చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. డిసెంబర్లో చలికాలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డిసెంబర్ మాసంలో ప్రయాణించాలనుకునేవారు తప్పుకుండా సిమ్లా, మనాలి, ముస్సోరీ మొదలైన ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళిక వేసుకోండి. భారతదేశంలో ఈ ప్రదేశాలే కాకుండా, ఇంకా పర్యాటకులు సందర్శించేందుకు అనువైన, అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడి అందమైన దృశ్యాలను చూసేందుకు తరలివస్తుంటారు. చలికాలంలో ఇంట్లో కూర్చొని వేడి వేడి టీ తాగేందుకు కొందరు ఇష్టపడితే, మరికొందరేమో ప్రకృతి రమణీయమైన లోయలను ఆస్వాదించాలని కోరుకునేవారు ఉంటారు. అలాంటి వారు తప్పకుండా భారతదేశంలోని ఈ ప్రాంతాలను సందర్శించాల్సిందే.

కూర్గ్ (కర్ణాటక)
భారతదేశంలోని స్కాట్లాండ్ అని పిలువబడే కర్ణాటకలో ఉన్న కూర్గ్ డిసెంబర్లో సందర్శించడానికి చాలా అందమైన ప్రదేశం. కర్నాటకలోని పశ్చిమ కనుమలలో ఉన్న ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికుల మొదటి ఎంపిక అనే చెప్పుకోవాలి. ఇక్కడి పొగమంచు వాతవరణంతో పాటు గంభీరమైన జలపాతాలు, కాఫీ తోటలు ఇంకా ఎన్నో అద్భుతాలు ఇక్కడ దాగి ఉన్నాయి. ఇలాంటి ప్రకృతి అందాలను చూడాలనుకునేవారు తప్పకుండా ఈ ప్రదేశాలను సందర్శించొచ్చు.

వారణాసి (ఉత్తర ప్రదేశ్)
ఉత్తరప్రదేశ్లోని కాశీ ఓ స్వచ్ఛతమైన నగరం. డిసెంబర్లో సందర్శనకు ఇది ఉత్తమమైన ప్రదేశం. ఇది ఒక ప్రసిద్ధ మతపరమైన ప్రదేశం. ఇక్కడ నెలకొని ఉన్న ఘాట్ల అందమైన దృశ్యాలను ఉదయం మరియు సాయంత్రం వేళల్లో వీక్షించొచ్చు. గంగా నదిపై బయటి నుండి వచ్చే సైబీరియన్ పక్షుల ఎగరడం వంటి అద్భుతమైన దృశ్యాలను తిలకించవచ్చు. సాయంత్రం పూట ఇచ్చే హారతి, దేవాలయాలు, భక్తిపారవశ్యంలో మునిగి తేలుతున్న యాత్రికులు ఇక్కడి చల్లటి గాలి, గంటల శబ్దంతో పర్యాటకులు ఎంతో ప్రశాంతతను పొందుతారు. దేవాలయాలు, శ్రావ్యమైన శ్లోకాలు ఇక్కడి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇవి శరీరానికి, మనస్సుకు ఎంతో సంతృప్తినిస్తాయి.
రాన్ ఆఫ్ కచ్ (గుజరాత్)
రాత్రిపూట చలిలో ఇసుకపై నడవడం వంటివి ఆనందించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్కి వెళ్లండి. రెండు నెలల పాటు ఇక్కడ జరిగే సాంస్కృతిక ఉత్సవాన్ని కచ్ మహోత్సవ్ అని కూడా అంటారు. ఇక్కడ లభించే సాంప్రదాయక ఆహారం పర్యాటకులకు ఎంతగానో నచ్చుతుంది. అంతేకాదు, ఇంకా ఇక్కడ ఎడారి సఫారీ, హస్తకళల నమూనాలు వంటివి చూడొచ్చు. ఇంకా సినీ సెలబ్రిటీలను కూడా చాలామందిని ఇక్కడ చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడ జరిగే పండుగలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి.

తవాంగ్ (అరుణాచల్ ప్రదేశ్)
ఈశాన్య భారతదేశంలో ఉన్న తవాంగ్ను చేరుకోవడం ఒక సవాలుతో కూడుకున్న పనే. కానీ ఈ ప్రాంతాన్ని చేరుకున్న తర్వాత, అక్కడి అందమైన దృశ్యాలను చూస్తూ మైమరిచిపోతారు. ఇక్కడ మంచుతో కప్పబడిన హిమాలయాలు, పురాతన మఠాలు మరియు అద్భుతమైన లోయలను చూసిన పర్యాటకులు ఎంతో ఆకర్షితులవుతారు. ఈ మఠం సముద్ర మట్టానికి సుమారుగా 3,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది భారతదేశం అతిపెద్ద, ప్రపంచంలో రెండవ అతిపెద్ద మఠం హోదాను కలిగి ఉండడం విశేషం. ఇది సుమారు 400 సంవత్సరాల పురాతన మఠంగా చెబుతారు. ఇది 300 మందికి పైగా బౌద్ధ సన్యాసుల ఆశ్రయం అని కూడా పిలుస్తుంటారు.



Click it and Unblock the Notifications















