ఈ సమ్మర్ హాలిడేస్లో ప్రయాణం చేయడమంటే చాలామందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ప్రయాణంతో పాటు సాహస యాత్రల పట్ల మక్కువ ఉండేవారు కూడా ఉంటారు. అలాంటి వారు జైపూర్ సమీపంలో ఉన్న రణథంబోర్ నేషనల్ పార్క్ను సందర్శించొచ్చు. ఈ నేషనల్ పార్క్ సందర్శించేందుకు ఉత్తమ సీజన్ వేసవి. కాబట్టి ఈ సీజన్లో తప్పకుండా మీరు మీ కుటుంబంతో కలిసి సరదాగా ఇక్కడ విహరించొచ్చు. ఈ పార్క్లో ఉండే వన్యప్రాణులను సులభంగా చూసేయొచ్చు. ఢిల్లీ వాసులు కూడా ఈ పార్క్ను చూడొచ్చు. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీ నుంచి కూడా ఈ ప్రాంతం చాలాదగ్గరే. రెండు మూడు రోజుల సెలవులను ఆస్వాదించడానికి చాలా ఉత్తమమైన ప్రదేశం. ఇది వినోదపరంగా కూడా ఎంతో అద్భుతమైన ప్రదేశమని చెప్పుకోవాలి. ఈ పార్క్ విశేషాలేంటో చూసేద్దాం..
రణతంబోర్ రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలో ఉన్న సవాయి మాధోపూర్కు సమీపంలో ఉంటుంది. ఇది వింధ్య పీఠభూమి, ఆరావళి కొండలకు ఆనుకుని, ఉత్తరాన బనాస్ నది, దక్షిణాన చంబల్ నది సరిహద్దులుగా ఉంటుంది. ఇది 1955లో సవాయి మాధోపూర్ షికార్గహ్ పేరుతో స్థాపించబడింది. 1980లో దీనికి రణతంబోర్ అభయారణ్యం అనే పేరు వచ్చింది. పూర్వం ఈ అడవిలో చాలా పులులు ఉండేవి. ఆ పులులను వేటాడేందుకు రాజులు వచ్చేవారు. అలా కాలక్రమేణా పులుల సంఖ్య క్రమంగా తగ్గడంతో దీనిని అభయారణ్యంగా ప్రకటించారు. రాయల్ బెంగాల్ టైగర్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇది భారతదేశానికే కాకుండా విదేశీ పర్యాటకులకు కూడా కేంద్రంగా ఉంది.

రణతంబోర్ కోట విశేషాలు..
ఈ రణతంబోర్ కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ప్రకటించారు. ఇది రణతంబోర్ నేషనల్ పార్క్ లోపల ఉంది. ఇది క్రీ.పూ.944లో నిర్మించిన చారిత్రక కోటగా చెబుతుంటారు. స్వాతంత్ర్యానికి ముందు, ఇది జైపూర్ రాజకుటుంబంతో ఉండేది. ఇది అటవీ రాజుల వేటగా ఉండే ప్రదేశం.
త్రినేత్ర గణేష్ ఆలయం
త్రినేత్ర గణేష్ ఆలయం రణతంబోర్లో ఉంది. ఈ పురాతన ఆలయం రణతంబోర్ కోట ప్రవేశ ద్వారం దగ్గర ఉంటుంది. భారతదేశంలో మూడు కన్నుల వినాయకుని విగ్రహం ఉన్న ఏకైక ఆలయం ఇదేనని చెబుతుంటారు. త్రినేత్రుని ఆలయంతో పాటు అతని భార్యలు రిద్ధి, సిద్ధి విగ్రహాలు కూడా స్థాపించబడ్డాయి. ఏదైనా కార్యక్రమానికి ముందు, ప్రజలు ఈ ఆలయంలో గణేశుడికి ఆహ్వాన లేఖలను పోస్ట్ ద్వారా పంపుతారట. దీనిని ఆలయ పూజారి భగవంతుని విగ్రహం ముందు చదివి వినిపిస్తారు. ఈ ఆనవాయితీ ఇక్కడ ఎప్పటి నుంచో కొనసాగుతుందని ఇక్కడివారు చెబుతున్నారు.

కాచిడా వ్యాలీ
కాచిడా వ్యాలీ టైగర్ రిజర్వ్ సమీపంలో ఉంది. దీనిని రణతంబోర్ జీప్ సఫారీ సమయంలో చూడవచ్చు. ఇక, ఈ లోయలో చిరుతపులులు, ఎలుగుబంట్లు, ఇతర అడవి జంతువులు కూడా కనిపిస్తాయి. ఎత్తైన, దిగువన ఉన్న కొండల మధ్య చిన్న చిన్న చెరువులు, పచ్చదనంతో అలరారుతూ మనసును పరవశింపజేస్తుంది.
చేరుకోవడం ఎలా?
ఈ ప్రాంతానికి అన్నిమార్గాల గుండా ప్రయాణం చేయవచ్చు. విమాన మార్గం ద్వారా అయితే, ఢిల్లీ నుండి విమానంలో జైపూర్ చేరుకుని అక్కడి నుంచి కారులో లేదా రైలులో సవాయ్ మాధోపూర్ వెళ్లవచ్చు. ఇది జైపూర్ నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక, ట్రైన్లో బయలుదేరాలంటే మాత్రం రణతంబోర్కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సవాయి మాధోపూర్ స్టేషన్లో దిగాల్సి ఉంటుంది.

ఎప్పుడు వెళ్ళాలి
ఈ పార్క్ను వేసవిలో సందర్శించేయొచ్చు. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఈ పార్క్ సందర్శిచేందుకు ఉత్తమ సమయం. వర్షాకాలంలో, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రదేశంలో చాలా ప్రాంతాలు మూసివేయబడతాయి. అందుకే ఆ సీజన్లో వెళ్లకపోవడమే మంచిది.



Click it and Unblock the Notifications













