దేశమంతా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశంలో పేరుగాంచిన మైసూర్ దసరా ఉత్సవాలు కూడా ఎంతో ఘనంగా మొదలయ్యాయి. కర్ణాటకలో జరిగే దసరా ఉత్సవాలు దేశంలోనే ప్రసిద్ధిగాంచినవి. ముఖ్యంగా మైసూరు ప్యాలెస్లో జరిగే దసరా ఉత్సవాలకు 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న దసరా నవరాత్రి ఉత్సవాలు నిన్న (గురువారం అక్టోబర్ 3) మైసూర్ ప్యాలెస్లో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ రాజ వేషధారణలో మెరిసారు. ఆయన సింహాసన దర్బార్ ని కూడా నిర్వహించారు. మైసూర్ దసరా మహోత్సవాలను 2024ను కూడా ఆయనే ప్రారంభించారు.

ప్రైవేట్ దర్బార్..
చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ రాజుగా మారినప్పుడు వినిపించే మాటలు గుర్తుకున్నాయా..? రాజాధిరాజ రాజా మార్తాండ రాజా కులతిలక యదువీర్ పరాక్.. బహు పరాక్.. బహు పరాక్.. వంధి మగధరుడు బహుపరాక్ అంటూ రాజును ఆహ్వానించే ఈ మాటలు దసరా నవరాత్రులు సందర్భంగా మైసూర్ ప్యాలేస్ లో వినిపించాయి. యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ రాజ ఠీవితో దర్భార్ కోసం మైసూర్ ప్యాలెస్కి విచ్చేసారు. చామరాజు వడయార్ యదువంశానికి చెందిన రాజు. నవరాత్రులలో మొదటి రోజు సందర్భంగా మైసూరులో వడయార్ ప్రైవేట్ దర్బార్ ని నిర్వహించారు. గతంలో రాజులు నిర్వహించే దర్బార్ల తరహాలోనే దసరా సందర్భంగా ప్రైవేట్ దర్బార్లు నిర్వహించడం మైసూర్ ప్యాలెస్లోని ఆనవాయితీ. దీని ప్రకారం ఈ ఏడాది కూడా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ దసరా ఉత్సవాల సందర్భంగా ప్రైవేట్ దర్బార్ నిర్వహించారు

పలు పూజ కార్యక్రమాలు..
యదువీర్ రాజు వేషధారణలో దర్బార్ హాలులోకి ప్రవేశించగానే వంధి మగధరుడు బహు పరాక్ అనే నినాదాలతో రాజును బటులు దర్బార్లోకి ఆహ్వానం పలుకుతారు. రాజు వేషధారణలో ఉన్న యదువీర్ సింహాసనం దగ్గరకు వెళ్లి సింహాసనానికి మూడుసార్లు ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత సింహాసనానికి పూజలు చేసి మంగళారతి కార్యక్రమం చేపట్టారు. సింహాసనం పక్కనే కూర్చొని నవగ్రహ పూజతోపాటు పలు పూజ కార్యక్రమాలు కూడా చేశారు. దీని తర్వాత యదువీర్ సింహాసనాన్ని అధిరోహించడం జరిగింది. ఆ పూజలు ముగిసిన అనంతరం అతని భార్య త్రిషికాకుమారి యదువీర పాదపూజ చేశారు. భార్య తర్వాత దివానులు సింహాసనం ముందు నిలబడి యదువీరకు నమస్కరించారు. ఆ తర్వాత రాజభవన ఆలయాలు, చాముండిబెట్ట, ఉత్తనహళ్లి బెట్ట సహా పలు ఆలయాల నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడయార్కు ఇచ్చారు. యదువీర్ భక్తి శ్రద్ధలతో అన్ని ప్రసాదాలను స్వీకరించారు.

కోడి సోమేశ్వరాలయం..
ఆ తర్వాత మైసూర్ రాష్ట్ర గీతం ఆలపించారు. అనంతరం యదువీర్ రత్నాల సింహాసనంపై దగ్గర నిలబడి జాతీయ గీతానికి వందనం చేశారు. రాష్ట్ర గీతాలాపన పూర్తయిన తర్వాత సింహాసనం నుంచి దిగి వచ్చి ప్రైవేట్ దర్బను ముగించారు. యదువీర్ రాజు వేషధారణలో ప్రైవేట్ దర్బార్ నిర్వహించడానికి ముందు మైసూర్ ప్యాలెస్లో తెల్లవారుజాము నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళ స్నానం చేసి చాముండేశ్వరికి పూజలు చేసిన అనంతరం యదువీర్ కంకణం ధరింపజేశారు.
అనంతరం రాజభవనంలోని కోడి సోమేశ్వరాలయం నుంచి ఏనుగు, ఆవు, గుర్రంతో వచ్చిన వాటిని తీసుకుని ప్రయివేట్ దర్భార్ లో యదువీర్ ముందుకు సాగారు. ఆ తర్వాత సుమారు గంట పాటు మైసూరు ప్యాలెస్లో గత వైభవాన్ని మళ్ళీ కనుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఇది ప్రైవేట్ దర్బార్ కార్యక్రమం కావడంతో ప్యాలెస్లోకి ప్రజలు ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఏదిఏమైనా ఎప్పటిలాగే మైసూర్ ప్యాలెస్ లో నవరాత్రి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ దసరా దర్బార్ మొదలైంది



Click it and Unblock the Notifications













