వేసవిలో సందర్శించేందుకు ఓ గొప్ప ప్రదేశం కోసం వెతుకుతున్నట్లయితే మాత్రం కర్నాటక ఎంతో ఉత్తమమైన ప్రదేశమని చెప్పుకోవచ్చు. నాలుగు నుండి ఐదు రోజుల పాటు హాయిగా హాలిడేని ఆస్వాదించవచ్చు. కర్నాటక వేసవిలో సందర్శించడానికి గొప్ప ప్రదేశం. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతాయి.
కూర్గ్, ఊటీ, మంగళూరు, మైసూర్, హంపి, గోకర్ణ వంటి అనేక ఇతర ప్రదేశాలను ఇక్కడ చూసేయొచ్చు. పర్వతాల నుండి బీచ్లు, వన్యప్రాణుల వరకు అన్ని రకాల ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ప్రయాణంతో పాటు ఆహారాన్ని ఇష్టపడేవారైతే, తప్పకుండా ఇక్కడి వంటకాలను ఓ పట్టుపట్టాల్సిందే..!

మద్దూరు వడ
కర్నాటకలో ప్రసిద్ధిచెందిన పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడి వంటకాలు కూడా పర్యాటకులకు నోరూరిస్తాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించే వారు ముఖ్యంగా మద్దూర్ వడను ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. ఈ వంటకాన్ని ఇక్కడ అల్పాహారం నుండి సాయంత్రం స్నాక్స్ వరకు కూడా వడ్డిస్తారు. ఈ వడను బియ్యం పిండితో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తురిమిన కొబ్బరి, మెంతులు, జీలకర్రతో తయారు చేస్తారు. దీని రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారు తప్పకుండా దీని రుచిని ఆస్వాదించాల్సిందే.

నీర్ దోస
నీర్ దోస అనే వంటకం కర్నాటకలోని తీర ప్రాంత జిల్లాల్లో చాలా ఫేమస్. ఇక్కడివారు ముఖ్యంగా దీనిని కోడి కూరతో ఆస్వాదిస్తారు. కోడికూరతో నీర్ దోసె తినడం మరిచిపోలేని ఓ అనుభూతనే చెప్పుకోవాలి. నీర్ దోస చేయడానికి బియ్యం మాత్రమే ఉపయోగిస్తారు. బియ్యాన్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే మెత్తగా పిండిలా తయారుచేస్తారు. నీర్ దోసలో మసాలాలు వంటివేవీ ఉపయోగించరు. సన్నని, క్రిస్పీ నీర్ దోస ఇక్కడ కొబ్బరి చట్నీతో వడ్డిస్తారు. ఇదే ఇక్కడి ఫేమస్ వంటకం.

అక్కి రోటీ
కర్నాటకలో ఉదయం అల్పాహారం కోసం అక్కి రోటీని తీసుకుంటారు. ఇక్కడి వంటకాలలో ఇది ఫేమస్. బియ్యం పిండితో చేసిన ఈ రోటీకి అనేక రకాల కూరగాయలు కూడా కలుపుతారు. దీని వల్ల దాని రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కర్నాటకలోని చాలా ఇళ్లలో ఉదయం అల్పాహారం అక్కి రోటీ.
మంగళూరు బిర్యానీ
మంగళూరు బిర్యానీ అనేది ఒక శాఖాహార వంటకం. ఇందులో అన్నం సుగంధ ద్రవ్యాలతో వండటం ఆనవాయితీ. ఈ పేస్ట్ కొబ్బరి, కొత్తిమీర, ఏలకులు, సోపు, లవంగాలు, అల్లం, ఎర్ర మిరపకాయ, వెల్లుల్లి మరియు జీలకర్రతో తయారు చేయబడింది. ఇక, ఈ వంటకంలో సీజనల్ కూరగాయలు కూడా కలుపుతారు.
మైసూర్ పాక్
కర్ణాటకలో ప్రసిద్ధిచెందిన స్వీట్లలో మైసూర్ పాక్ ఒకటి. ఇందులో నెయ్యి, పంచదార, శెనగపిండి మాత్రమే ఉపయోగించబడుతుంది. ఈ స్వీట్ను మొదట మైసూర్ ప్యాలెస్లోని వంటగదిలో తయారు చేశారు. కన్నడ భాషలో పాక్ అనే పదానికి చక్కెర ద్రావణం అని అర్థం. కర్ణాటకలోని దాదాపు ప్రతి స్వీట్ షాపులో మీకు ఈ స్వీట్ లభిస్తుంది. కర్నాటక సందర్శించిన తర్వాత తప్పకుండా ఈ స్వీట్ను ఆరగించాల్సిందే.. మరెందుకాలస్యం మీ కర్ణాటక ప్రయాణాన్ని మొదలుపెట్టండి మరి.



Click it and Unblock the Notifications













