దేశంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ సంబరాలను ఇంట్లో, స్థానికంగా ఉండే చర్చిలలో జరుపుకునేవారు కొందరైతే.. మరికొందరేమో ఇతర ప్రాంతాలు, దేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తుంటారు. దేశంలో క్రిస్మస్ వేడుకలకు సందర్శించే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. దేశంలో అందమైన, పురాతనమైన చర్చీలకు కొదవే లేదు. ఈ ప్రదేశాలకు ఎంతో ఘన చరిత్ర కూడా ఉంది. మరి ఈ క్రిస్మస్ సెలవుల్లో కుటుంబంతో కలిసి సరాదాగా విహరించేందుకు ఈ ప్రదేశాలు ఎంతో అనువైనవి. రండి ఆ పురాతనమైన చర్చీలు ఎక్కడున్నాయో, వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చి, గోవా
గోవా బీచ్లకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇది ఏడాది పొడవునా సందర్శించదగ్గ ప్రదేశం. క్రిస్మస్ సెలవులకు న్యూయర్ వేడుకలను జరుపుకునేందుకు చాలామంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడ పురాతనమైన చర్చీలు కూడా ఉన్నాయి. అందులో బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చి కూడా ఒకటి. ఇది భారతదేశంలోని ప్రధాన చర్చిలలో ఒకటి. ఇది సుమారు 400 సంవత్సరాల నాటిది. ఇది క్రైస్తవ వాస్తుశిల్పానికి చక్కని ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ప్రపంచం నలుమూలల నుంచి క్రైస్తవ పర్యాటకులు ఈ చర్చిని చూసేందుకు వస్తుంటారు. దీనితో పాటూ గోవాలో ప్రసిద్ధిచెందిన మరికొన్ని చర్చీలు ఉన్నాయి. సే కేథడ్రల్, చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్, చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి సహా ఎన్నో పురాతన చర్చిలను పర్యాటకులు వీక్షించొచ్చు.

ది అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్
ది అవర్ లేడి ఆఫ్ ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ అనే చర్చి పనాజీలో ఉంది. దీనిని 1541లో ఒక చిన్న మందిరం ఆకారంలో నిర్మించారు. ఆ తర్వాత 1600-1609 మధ్య ఈ చర్చి ఎంతో అందమైన ఆకృతిని పొందింది. ఈ చర్చిలో ప్రధాన మందిరం మేరీ మాతకు అంకితం చేయడం జరిగింది. ఇక్కడ సెయింట్ పీటర్, సెయింట్ పాల్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది అతిపురాతనమైన చర్చీగా పేరొందింది.
ఆల్ సెయింట్స్ కేథడ్రల్ చర్చ్
ఇది ఒక రాతి చర్చి. ఈ చర్చి అలహాబాద్లో ఉంటుంది. ఆల్సెయింట్స్ కేథడ్రల్ చర్చ్1870లో సర్ విలియం ఎమర్సన్ రూపొందించారు. దీన్ని నిర్మించడానికి సుమారు 17 సంవత్సరాలు పట్టింది. ఇంది ఎంతో పురాతనమైనది. 1887లో పూర్తైన ఈ చర్చి అందానికి ఉదాహరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. దీని క్యాంపస్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. 40 అడుగుల వెడల్పు 130 అడుగుల పొడవుతో ప్రార్థనా మందిరం ఎంతో అద్భుతంగా ఉంటుంది.

సెయింట్ లూక్స్ చర్చి, కాశ్మీర్
కాశ్వీర్లో ఉన్న సెయింట్ లూక్స్ చర్చి అతి పురాతనమైనది. ఈ చర్చి కాశ్మీర్లోని శంకరాచార్య కొండ దిగువన ఉంటుంది. ఈ చర్చి పునాది రాయిని డాక్టర్ ఎర్నెస్ట్ , డాక్టర్ ఆర్థర్ నెవ్ వేశారని చరిత్ర చెబుతుంది. దీనిని 12 సెప్టెంబర్ 1896న లాహోర్ బిషప్ ప్రజలకు అంకితం చేశారు.
సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్, ఢిల్లీ
దిల్లీలోని పురాతన చర్చిల్లో ఒకటిగా పేరుగాంచింది సెక్రేడ్ హార్ట్ కేథడ్రల్ చర్చి. ఇది కన్నాట్ ప్లేస్లోని కేథడ్రల్ ఆఫ్ ది సేక్రేడ్ హార్ట్. భాయ్ వీర్ సింగ్ మార్గంలో ఉంటుంది. ఇది రోమన్ క్యాథలిక్ చర్చి. ఈ చర్చి 14 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇటలీకి చెందిన ఆర్కెటెక్ట్ హెన్రీ మేడ్ అత్యద్భుతంగా దీనిని తీర్చిదిద్దాడు. చర్చి పైకప్పు, అందమైన తోరణాలు, లోపల డిజైన్లు పర్యాటకులను మైమరింపజేస్తాయి.



Click it and Unblock the Notifications















