భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన ఇస్లాం మత క్షేత్రం .. అజ్మీర్. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో, జైపూర్ కు 130 కి. మీ ల దూరంలో కలదు. దీని చుట్టూ ఆరావళి పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. అందుకే అజ్మీర్ ను "ఆరావళి పర్వత శ్రేణులలో ఆణిముత్యం" అని పిలుస్తారు. ఆరావళి పర్వతాలు భారతదేశంలో అతిపురాతన ముడత పర్వతాలు. దేశంలోని పురాతన కోటల్లో ఒకటైన తారాఘర్ కోట అజ్మీర్ నగరాన్ని రక్షిస్తున్నది.
చిన్న చరిత్ర
క్రీ.శ.7 వ శతాబ్దంలో అజ్మీర్ నగరాన్ని అజయరాజ్ సింగ్ చౌహాన్ స్థాపించాడు. చౌహాన్ వంశీయులలో పృథ్వీ రాజ్ చౌహాన్ అగ్రగణ్యుడు. ఆతరువాత ఎన్నో రాజ వంశాల చేతిలో ఈ నగరం వెళ్ళిపోయింది. క్రీ.శ. 18 వ శతాబ్దంలో బ్రిటీష్ వారు 50000 చెల్లించి అజ్మీర్ ను మరాఠా నుంచి వశపర్చుకున్నారు. చివరగా 1956 లో రాజస్థాన్ రాష్ట్రంలో అంతర్భాగమైనది.
బుల్లెట్ బాబా టెంపుల్ - పూజించబడే ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ !
సూఫీ ప్రవక్త ఖాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా కు అజ్మీర్ బాగా ప్రసిద్ధి. ఇక్కడికి ప్రపంచ దేశాల నుండి ప్రముఖులు తరలివస్తుంటారు. కేవలం ఇస్లాం మతానికి చెందిన వారే కాకూండా ఇతర మతాలకు చెందిన వారు కూడా వస్తారు. సరస్సులు, సైట్ సీఇంగ్ స్థలాలు, కోటలు, మసీదులు, దర్గాలు మరియు దేవాలయాలు చూడదగ్గవిగా ఉన్నాయి.
రాచరికం ఉట్టిపడే రాజస్థాన్ అందాలు !
ఆడాయి దిన్ కా ఝోప్రా
ఆడాయి అంటే రెండున్నర అని అర్థం. పేరుకు తగ్గట్టే ఈ మసీదును రెండున్నర రోజుల్లో నిర్మించారు. మొదట్లో సంస్కృత కళాశాల గా ఉన్న ఈ స్థలం ఘోరీ దండయాత్రతో మసీదుగా మార్చబడింది. మసీదు గోడచుట్టూ దివ్య ఖురాన్ చెక్కబడింది. తొలితరం ఇండో ఇస్లానిక్ తరానికి ఇదొక ఉదాహరణ.
చిత్రకృప : Billyakhtar
అనా సాగర్
అనా సాగర్ సరస్సు, 13 కి.మీ ల విశాల ప్రాంతంలో తవ్వించిన కృతిమ సరస్సు. క్రీ.శ 1135 - 1150 మధ్య దీనిని అనా చౌహాన్ తవ్వించాడు. సరస్సు పరిసరాల్లో దౌలతాబాద్ తోట, పార్కులు, పాలరాతి ఆవరణలు ఉన్నాయి. సరస్సులో విహరించటానికి నీటి బోట్లు, స్కూటర్ లు అందుబాటులో ఉన్నాయి.
చిత్రకృప : Singh92karan
దర్గా షరీఫ్
దర్గా షరీఫ్ - ఖాజా మొయినుద్దీన్ చిస్తీ నివాసం. ఈ దర్గా తలుపులు వెండితో, ఆయన సమాధి కూడా వెండి రైలింగ్ తో ఉంది. ప్రతి సంవత్సరం 6 రోజులపాటు ఉరుసు నిర్వహిస్తారు.
చిత్రకృప : Manuel Menal
ఒంటరిగా
114 సంవత్సరాల వయసులో సూఫీ ఒంటరిగా గదిలో ఆరు రోజులపాటు ప్రార్థనలు చేసి దేహాన్ని వదిలేశారని భక్తుల భావన. అందుకే 6 కు అంత ప్రాధాన్యం ఇస్తారు. అక్బర్ వారసుడు పుట్టినందుకు గుండిగలు ఇచ్చినట్లు చెబుతారు.
చిత్రకృప : Shahnoor Habib Munmun
తారాగర్ కోట
భీమ్ బుర్జ్ కోట ఆవరణలోని రాతి స్థంభం. దీని కింద గర్భగుంజన్ అనే జలాశయం ఉంది. ప్రజల తాగునీటి ఎద్దడి నివారించేందుకు ఈ జలాశయం తోడ్పడుతుంది. కోట లోని ఇతర ఆకర్షణలు తప్పక చూసి తీరవలసిందే!
చిత్రకృప : Amit Rawat
సోలా ఖంబా
అజ్మీర్ లోని సోలా ఖంబా 16 స్తంభాల ఆదారం మీద పైకప్పు ఉండటంవల్ల దీనికి సోలా ఖంబా అనిపేరు వచ్చింది. ఇది ఔరంగజేబు పాలనలో నిర్మించబడింది. దీనిని షేక్ అలా-అల్-దిన్ సమాధి అని పిలుస్తారు. ఇది దర్గా షరీఫ్ వెలుపల ఉంది.
చిత్రకృప : S N Barid
అక్బర్ ప్యాలెస్, మ్యూజియం
అక్బర్ చక్రవర్తి, అతని సైన్యం అజ్మీర్ లో ఉన్నప్పుడు ఈ ప్యాలెస్ మ్యూజియం లో ఉండేవారు. ప్రస్తుతం ఇందులో క్రీ.శ. 6-7 శతాబ్దాల కాలం నాటి శిల్పాలు, విగ్రహాలు ఉన్నాయి. ప్రాచీన ఫిరంగులు, ఆయుధాలు, కత్తులు,సైనిక యుద్ధ పరికరాలు మొదలైనవి ప్రదర్శిస్తుంటారు.
చిత్రకృప : Arefin.86
అక్బరీ మసీద్
దర్గా షరీఫ్ లో షాజహాన్ గేట్, బులంద్ దర్వాజా మధ్య అక్బర్ దీనిని నిర్మించాడు. ఈ మసీద్ నిర్మాణానికి ఆకుపచ్చ, తెలుపు రంగు పాలరాయిని వాడారు. ప్రస్తుతం మసీద్ పర్షియన్, అరబిక్ ధార్మిక విద్యలను అందిస్తున్నది.
చిత్రకృప : ZAKIR NAQVI
రాణి మహల్
తారాఘర్ లోపల ఉన్న రాణిమహల్ ను అజ్మీర్ పాలకులు భార్యలు, ఉంపుడుగత్తెలు, నాట్యకత్తెలు, ప్రియురాళ్ల కొరకు నిర్మించారు. ఈ భవన నిర్మాణం రాజస్థాన్ నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ.
చిత్రకృప : Arefin.86
అబ్దుల్ ఖాన్ సమాధి
ఈ టూంబ్ తెల్లని పాలరాతితో నిర్మించబడిన అందమైన కట్టడం. దీనిని సయ్యద్ సోదరులు వారితండ్రి జ్ఞాపకార్థం నిర్మించారు. నాలుగు మెట్లు గల ఎత్తైన సమాధిలో నిర్మించిన ఈ దీర్ఘ చతురస్త్రాకార నిర్మాణం తోరణాలతో, నాలుగు స్థంభాలతో రూపకల్పన చేయబడింది.
చిత్రకృప : David de Mallorca
నసియాన్ దేవాలయం
అజ్మీర్ లోని నసియాన్ మందిర్ ను ఎర్రని మందిర్ లేదా లాల్ మందిర్ అని పిలుస్తారు. ఇది పృథ్వీ రాజ్ మార్గ్ లో ఉన్నది. మొదటి జైన తీర్థాంకులు ఆదినాథుని కోసం ఈ మందిరాన్ని నిర్మించారు. ఇది రెండు అంతస్తులుగా కలిగి ఉంది. మొదటి అంతస్థులో ఆదినాథుని విగ్రహం, రెండవ అంతస్తులో మ్యూజియం కలదు.
చిత్రకృప : Ramesh Lalwani
దౌలత్ ఖానా
దౌలత్ ఖానా ఒక మ్యూజియం. ఇందులో ఈ ప్రాంతలపు అద్భుత శిల్పాలతో పాటు మొఘలులు, రాజపుత్రులు వాడిన ఆయుధాలను, హిందూ విగ్రహాలను ప్రదర్శిస్తారు. సందర్శన సమయం : ఉదయం 6 నుండి సాయంత్రం 4: 30 వరకు తెరుస్తారు (సెలవు దినాలలో తప్ప).
చిత్రకృప : Satyamonline4u
పురావస్తు మ్యూజియం
ఈ మ్యూజియం అజ్మీర్ లోని దిలే ఆరాం తోటల్లో ఉంది. ఇందులో అనేక శాశనాలను, పురాతన నాగరికత కు సంబంధించిన, తవ్వకాల్లో బయటపడిన వస్తువులను భద్రపరిచారు. సందర్శన సమయం : ఉదయం 10 నుండి సాయంత్రం 4 : 30 వరకు.
చిత్ర కృప : Ashley Van Haeften
అజ్మీర్ ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం : సమీపాన 132 కి. మీ దూరంలో జైపూర్ ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని అజ్మీర్ చేరుకోవచ్చు.
రైలు మార్గం : అజ్మీర్ లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఉదయపూర్, జైపూర్, జోధ్ పూర్, మైసూర్, అహ్మదాబాద్, ఇండోర్, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుండి వస్తుంటాయి.
రోడ్డు/ బస్సు మార్గం : ఢిల్లీ, బికనీర్, జైపూర్, జోధ్ పూర్, ఉదయపూర్ తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు అజ్మీర్ కు నడుస్తాయి.
చిత్ర కృప : Shahrukhalam334