రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నెల మొదటి నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక, ఇప్పడు ఏప్రిల్ నెల మొదటి నుంచే ఎండల తీవ్రత మరింత పెరిగింది. వేసవి సెలవులు రాబోతున్నాయి. విహారయాత్రలకు ప్లాన్ చేసుకుందాం అని అనుకున్న చాలామంది కూడా ఈ ఎండలకు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, అలాంటివారికి వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏపీ వాతావరణంలో పలు మార్పులు కనిపించబోతున్నాయి. ఇప్పటికే సోమవారం (ఏప్రిల్ 8) నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఇక, మంగళవారం, బుధవారాల్లో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పర్యాటకులకు ఈ వార్త కాస్త ఊరటనిచ్చిందనే చెప్పుకోవాలి.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లాలనుకునేవారికి ఇదొక మంచి అవకాశం. ఈ సెలవుల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేయొచ్చు. ఉత్తర కోస్తాలోని పలుప్రాంతాల్లో వడగాలుల తీవ్రత కాస్త తగ్గిందనే అంటోంది వాతావరణ శాఖ. వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, జంగమేశ్వరపురం, బాపట్ల, ఒంగోలు, నెల్లూరుతో పాటుగా తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు.
ఇక, కావలిలో అత్యధికంగా 24 గంటల వ్యవధిలో 6.9 డిగ్రీల తగ్గుదల నమోదైనట్లు సమాచారం. ఉత్తర కోస్తా నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈ ప్రభావం కారణంగా సోమవారం నాడు ఉత్తర కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వాతావరణంలో మార్పులు కనిపించాయి. అక్కడక్కడా తేలికపాటి చిరుజల్లులు కూడా కురిశాయి. పలు ప్రాంతాల్లో మేఘావృత్తం అయ్యింది. కాబట్టి పర్యాటకులు ఈ రెండు మూడు రోజులు విహారయాత్రలు ప్లాన్ చేసుకోవచ్చు.

ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం..
రాబోయే రెండు, మూడు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఇక, నేడు రేపు ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. మంగళవారం నాడు ఉత్తరకోస్తాలోని 39 మండలాల్లో, బుధవారం 66 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని ఐఎండీ భావిస్తోంది. మంగళవారం నాడు కోస్తాలోని పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం.
రాయలసీమలోని పలుల జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు..
శ్రీకాకుళంలోని 13మండలాల్లో, విజయనగరంలోని 12 మండలాల్లో, పార్వతీపురం మన్యంలోని 11 మండలాల్లో, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 3 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. ఇక, రాయలసీమలోని పలుల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడులో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా, కడప జిల్లా వెడురూరులో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక, కర్నూలు జిల్లా వగరూరులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత, అన్నమయ్య జిల్లా సానిపాయలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.



Click it and Unblock the Notifications













