అరకులోయ అందాల గురించి కొత్తగా చెప్పే పనిలేదు. పచ్చని ప్రకృతినడుమ కుటుంబసమేతంగా గడిపేందుకు అనువైన పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఆంధ్రా ఊటీగా పిలుచుకునే అరకులోయలో పర్యటకుల మనసుదోచే మరో ఆకర్షణ అందుబాటులోకి రానుంది. ఎకో టూరిజంగా అభివృద్ధి చెందబోతోన్న ఈ ప్రాంతం సందర్శకులకు అరకులోని సరికొత్త వాతావరణాన్ని పరిచయం చేయబోతోంది. అటవీశాఖ ఆద్వర్యంలో రూపుదిద్దకుంటోన్న ఆ ప్రత్యేక పర్యాటక ఆకర్షణల గురించి తెలుసుకుందాం.
అరకు పర్యాటకాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమవుతోన్న ప్రకృతి ప్రేమికులకు అటవీశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. డుంబ్రిగుడ మండలంలోని అంజోడ సిల్క్ఫాం సరికొత్త రూపును సంతరించుకుంటోంది. గుబురుగా పెరిగిన ఎత్తయిన పైన్ చెట్ల నడుమ సుమారు 20 ఎకరాల్లో సిల్క్ఫాం పర్యాటకుల మనసును కట్టిపడేస్తుంది. ఈ పచ్చని ప్రదేశంలో వేకువజామున కురిసే మంచు తుంపరుల అందాలను.. గుబురుగా పెరిగిన చెట్ల నడుమ సూర్యోదయపు తొలికిరణాలను ఆస్వాదించే క్షణాలను మాటల్లో వర్ణించడం సాధ్యంకాదు. ఎక్కడా.. సిమెంట్ వాడకుండా సహజ సిద్ధంగా ఉన్న చెట్ల చెక్కలతో చూడముచ్చటగా ఇక్కడి పైనరీని తీర్చిదిద్దారు.

అతిథి గృహాలుగా గుడారాలు
సిల్క్ఫాం ఇక్కడికి వచ్చే సందర్శకుల వన భోజనాలకు వేదికగా వేదికగా చెప్పొచ్చు. అటవీశాఖ ఎకో టూరిజంగా దీనిని అభివృద్ధి చేసే క్రమంలో రూ. 71 లక్షలతో ఆధునికీకరణ పనులను పూర్తి చేసి.. పర్యటకులకు మరింత ఆహ్లాదం కలిగేలా తీర్చిదిద్దింది. పైన్ చెట్ల నడుమ అరకు పైనరీ ముఖద్వారాన్ని ఎంతో అందంగా ముస్తాబుచేశారు. అంతేకాదు, ఈ ప్రాంతంలో చుట్టూ కంచెలను ఏర్పాటు చేసి పూలవనాలతో సుందరంగా తయారు చేశారు.
సందర్శకులు ప్రశాంతమైన వాతావరణాన్ని గడిపేలా ఆరుబయట అతిథి గృహాలుగా గుడారాలు ఏర్పాటు చేశారు. రాత్రిపూట అరకు అందాలను ఆస్వాదించాలనుకునేవారికి ఈ గుడారాలు సరైన ఎంపికగా నిలుస్తాయనడంలో సందేహమే లేదు. భోజన సౌకర్యానికి రెస్టారెంట్తోపాటు ప్రత్యేకంగా రూపొందించిన టేకు, వెదురు కలపతో రూపుదిద్దుకున్న బెంచీలు కుటుంబ సమేతంగా గడిపేందుకు ఎంతో అనువుగా ఉంటాయి.

విద్యుత్తు కాంతుల నడుమ వాకింగ్ ట్రాక్
ఎకో టూరిజంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా ఉన్న గిరిజన యువతకు ఉపాధి అవకాశాలతోపాటు అటవీశాఖ ఆదాయం పెంపొందించేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. అందమైన పైన్ చెట్ల నడుమ ఫొటోల సెల్ఫీలు, వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక ఫొటో షూట్లు తీసుకునేందుకు అనువుగా అంజోడ సిల్క్ఫాంను ముస్తాబు చేశారు. చీకటి సమయంలోనూ సరదాగా ఆరుబయట నడిచేందుకు వీలుగా విద్యుత్తు కాంతుల నడుమ వాకింగ్ ట్రాక్ను రూపొందించారు. వీటితోపాటు రూ.
15 లక్షలతో అరకులోయ అటవీశాఖ రేంజ్ కార్యాలయ ప్రాంగణంలో పర్యటకులు విడిది చేసేందుకు ప్రత్యేకంగా అతిథి గృహాలను ఆధునికీకరించారు. పూల మొక్కల వనం, చిన్న పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక పార్కు, వీఐపీలు విడిది చేసేందుకు ప్రత్యేక సూట్ గదులను రేంజ్ కార్యాలయ ప్రాంగణంలో తీర్చిదిద్దారు. ప్రకృతి ఒడిలో పరవసించాలనుకునేవారికి ఈ అంజోడ సిల్క్ఫాం అసలైన గమ్యస్థానంగా నిలుస్తుందనే చెప్పాలి. మరెందుకు ఆలస్యం సరికొత్త అరకు అందాలను వీక్షించేందుకు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.. హ్యేపీ జర్నీ!



Click it and Unblock the Notifications













