భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది. అదే విధంగా ఒక్కక్క దేవాలయం నిర్మాణం, ఆ దేవాలయంలోని మూలవిరాట్టు కు ప్రత్యేక పురాణ కథలు కూడా ఉంటాయి. అటువంటి కోవకు చెందినదే నాగేశ్వర జ్యోతిర్లింగం. ఓ సాధారణ భక్తుడిని రక్షించడానికి జ్యోతి రూపంలో వెలిశాడని చెబుతారు.
దీన్ని బట్టి ఆ పరమశివుడు తనను నమ్మినవారితో సదా వెన్నంటి ఉంటాడన్న విషయం స్పష్టమవుతోంది. ఇక ఈ జ్యోతిర్లింగం మోక్ష నగరాల్లో కొలువై ఉండటం గమనార్హం. అందువల్లే ఈ జ్యోతిర్లింగం మిగిలిన జ్యోతిర్లింగాలతో పోలిస్తే విశిష్టమైనదిగా భారతీయ పురాణాలు చెబుతాయి.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆ జ్యోతిర్లింగం వివరాలతో పాటు అక్కడకు దగ్గరగా ఉన్న ముఖ్యమైన పర్యాటక కేంద్రాలకు సంబంధించిన వివరాలతో కూడిన కథనం నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం...
ఏడు మోక్ష నగరాల్లో ఒకటి
P.C: You Tube
భారత దేశంలోని ఏడు మోక్ష నగరాల్లో ఈ ద్వారక కూడా ఒకటి. శ్రీకృష్ణపరమాత్ముడు సంచరించిన ఈ క్షేత్రం హిందువులు పవిత్రంగా భావించే ఛార్ దామ్ యాత్రలో ద్వారక కూడా ఒకటి కావడం గమనార్హం. జరాసందుని బారి నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఈ నగరాన్ని శ్రీకృష్ణపరమాత్ముడు నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఉన్న ఆలయాల్లో ద్వారకాధీశ మందిరం పవిత్రమైనది. శ్రీ క`ష్ణుడి మనుమడైన వజ్ననాధుడు ఈ మందిరాన్ని మొదటిసారిగా నిర్మించినట్లు పురాణలను అనుసరించి తెలుస్తోంది.
నాగేశ్వర లింగం
P.C: You Tube
ఇక్కడ ఉన్న మరో ఆలయం నాగేశ్వర లింగం. మన పురాణాలను అనుసరించి భారత దేశంలోని 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది 10వది. సప్త మోక్ష నగరాల్లో జ్యోతిర్లింగం ఉండటం అరుదైన విషయం. ఇక్కడ జ్యోతిర్లింగం ఏర్పడటానికి పరమశివుడి భక్తుడు కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన కథనం శివపురాణంలో ఉంది. ప్రస్తుతం ఈ నాగేశ్వర లింగం ద్వారకా నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న దారుకావనం అనే చోట ఉంది.
తారకాసురుడనే రాక్షసుడు
P.C: You Tube
పూర్వం ఇక్కడ నాగజాతి ప్రజలు నివసించేవారు. అదే విధంగా తారకాసురుడనే రాక్షసుడు తన సంతితో ఇక్కడి దగ్గర్లోని అడవిలో నివశిస్తూ దారిన పోయే వారిని చెరసాలలో బంధించి రోజుకు ఒకరి చొప్పున భక్షిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే సుప్రియుడనే ఒక వర్తకుడు తన వ్యాపరనిమిత్తం ఈ మార్గం గుండా పోతూ తారకాసురుడి కంటబడ్డడు. యథాప్రకారం రాక్షసుడు సప్రియుడిని కారాగారంలో బంధిస్తాడు. ఇక అతన్ని తినే సమయం ఆసన్నమవుతుంది. అయితే శివుడి పరమ భక్తుడైన సుప్రియుడు తన మెడలో ఉన్న లింగాన్ని చేతిలో తీసుకొని శివపూజ చేస్తూ ఉంటాడు.
జ్యోతి రూపంలో
P.C: You Tube
కారాగారానికి వచ్చిన తారకాసుడు తన చేతిలో ఉన్న గదతో సుప్రియుడిని మోది చంపి తినడానికి ఉపక్రమిస్తాడు. శివపూజలో ఉన్న తన భక్తుడికి ఆటంకం కలిగించడమే కాకుండా అతన్ని సంహరించడానికి ప్రయత్నించిన రాక్షసుడిపై ఈశ్వరుడికి తీవ్ర ఆగ్రహం కలుగుతుంది. దీంతో జ్యతి రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ తారకాసురుడిని సంహరిస్తాడు. అదే విధంగా తన భక్తుడి కోరిక మేరకు అక్కడ లింగం రూపంలో కొలువై ఉండిపోతాడు. ఇక ఈప్రాంతం అప్పట్లో నాగజాతి ప్రజలు నివశిస్తుండటం వల్ల వారు ఆ లింగానికి నాగేశ్వర లింగమని పేరుపెట్టి పూజలు చేయడం ప్రారంభించారు. ఇలా ఓ ముక్తి క్షేత్రంలో నాగేశ్వర లింగం వెలిసింది.
ద్వారకాధీశుడి ఆలయం
P.C: You Tube
ముందే చెప్పుకొన్నట్లు ఇక్కడ చూడదగిన మరో క్షేత్రం ద్వారకాధీశుడి ఆలయం. పూర్వకాలంలో ఈ ఆలయాన్ని ఆ శ్రీక`ష్ణ పరమాత్మ మనుమడు నిర్మించగా ఆధునిక ఆలయాన్ని 16వ శతాబ్దంలో పున:నిర్మించారు. ఐదు అంతస్తులతో కూడిన ఈ ఆలయం ఇసుక, సున్నపురాయితో నిర్మితమైంది. ఈ ఆలయం గోమతీ నదీ సముద్రంలో సంగమించే ప్రదేశానికి అతి దగ్గరగా ఉంటుంది. ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న వాసుదేవ, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణిదేవి, సత్యభామా దేవి ఆలయాలు ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి
P.C: You Tube
జామ్ నగర్ ఎయిర్ పోర్ట్ ద్వారకకు కేవలం 45 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ ఎయిర్ పోర్టు నుంచి ద్వారకకు ప్రైవేటు ట్యాక్సీల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అదే విధంగా ద్వారకలో రైల్వేస్టేషన్ ఉంది. భారతదేశంలోని చాలా ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు నేరుగా రైలు సదుపాయం ఉంది. అదే విధంగా ఉత్తర భారత దేశంలోని ప్రధాన నగరాల నుంచి కూడా ద్వారకకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది.