మార్చి నెల మొదలయ్యింది. ఈ నెలలో చాలా సెలవులే వచ్చాయి. కాబట్టి ఈ హాలిడేస్లో లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకునేవారు తప్పకుండా ఈ ప్రదేశాలను సందర్శించాల్సిందే. ప్రస్తుత రోజుల్లో దాదాపు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్న వారే. కాబట్టి వీరు కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే మాతస్రం కొన్ని నెలల ముందు నుండి ప్రణాళికలు చేస్తుంటారు. వీకెండ్ తో పాటు అదనంగా కలిసి వచ్చే సెలవులను ఉపయోగించుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు మార్చి నెలలో వచ్చే లాంగ్ వీకెండ్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఒక చక్కని ట్రిప్ను ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకీ మార్చి నెలలో చూడాల్సిన ప్రదేశాలు ఏమిటో? ఇప్పుడు తెలుసుకుందాం.
గోవా
గోవా మార్చి నెలలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశమని చెప్పుకోవాలి. ఇక్కడ నైట్ లైఫ్ తో పాటు బీచ్ లో కూడా ప్రశాంతంగా గడపవచ్చు. ఈనెలలో ఇక్కడ జరిగే అతిపెద్ద హిందూ జానపద పండుగ షిగ్మోలో పాల్గొనే అవకాశం కూడా మీకు లభిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ అనేక క్రీడా కార్యకలాపాలను కూడా ఆస్వాదించవచ్చు. గోవా భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా పిలుస్తారు. గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు, దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.

డార్జిలింగ్
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ కూడా మార్చిలో సందర్శించేందుకు ఒక వినోదభరితమైన ప్రదేశం. డార్జిలింగ్లో, ఎత్తైన కొండలతో చుట్టుముట్టబడిన అందమైన, అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ బటాసియా గార్డెన్, కాంచనజంగా వ్యూ పాయింట్, టెన్జింగ్ రాక్, ఘూమ్ రైల్వే స్టేషన్లను కూడా సందర్శించవచ్చు. టాయ్ ట్రైన్ రైడ్ కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఇక్కడ సందర్శించేందుకు చాలా ప్రదేశాలే ఉన్నాయి.
జైపూర్
మార్చిలో సందర్శించేందుకు రాజస్థాన్ రాజధాని జైపూర్ గొప్ప ఎంపిక అని చెప్పుకోవాలి. జైపూర్ నగరాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. దీనిని గులాబీ నగరం అని కూడా అంటారు. మార్చి నెలలో ఇక్కడ జైపూర్ ఎలిఫెంట్ ఫెస్టివల్ని కూడా చూడొచ్చు. ఇది దేశంలోనే కాకుండా విదేశీ పర్యాటకులలో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి రాజభోజనం పర్యాటకులకు ఎంతగానో నచ్చుతుంది.

రణతంబోర్
వన్యప్రాణుల ప్రేమికులకు రాజస్థాన్లోని రణతంబోర్ ఎంతో ఉత్తమమైన ప్రదేశం. ఈ ప్రాంతాన్ని మార్చిలో తప్పకుండా సందర్శించాల్సిందే. మీ భాగస్వామి, కుటుంబం, స్నేహితులతో లేదా ఒంటరిగా కూడా ఇక్కడ విహరించొచ్చు. రాజస్థాన్ లోని రణతంబోర్ లో ఈ సీజన్లో జంగిల్ సఫారీని కూడా ఆస్వాదించొచ్చు. కాబట్టి మార్చి నెలలో పర్యాటకులు ఇక్కడ ఇతర జంతువులతో పాటు ముఖ్యంగా పులులను అన్వేషించేందుకు వెళ్లవచ్చు. వైల్డ్ లైఫ్, సఫారీను ఇష్టపడే వారు రణతంబోర్ నేషనల్ పార్క్ లో ఒక గొప్ప సమయాన్ని గడపొచ్చు. సుమారు 1300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యం అడవి జంతువులతో పాటు సహజ ప్రకృతి అందాలను అన్వేషించేలా చేస్తుంది. ఇంకా ఇక్కడ సందర్శించేందుకు చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఈ పార్కులో 10వ శతాబ్ధం నాటి అద్భుతమైన రణతంబోర్ కోట కూడా ఉంటుంది.
వృందావన్ (హోలీ పండుగ)
మార్చి నెలలో హోలీ పండుగ ఉంటుంది. ఈ పండుగను పవిత్ర నగరమైన వృందావన్ లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కాబట్టి పర్యాటకులు ఈనెలలో వృందావన్ను సందర్శించొచ్చు. ఈ పండుగను ప్రాచీన కాలం నుండి జరుపుకుంటున్నారు. భారత దేశంలో అతిపెద్ద పండుగల్లో ఒకటైన ఈ హోలీ ఉత్సవంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పర్యాటకులు, యాత్రికులు ఈ ప్రదేశానికి తరలి వస్తుంటారు. వృందావన్ శ్రీకృష్ణుడి లీలా నగరంగా ప్రసిద్దిచెందింది. ఈ ప్రాంతం హోలీ వేడుకతో మరో కొత్త శోభను సంతరించుకుంటుంది. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. కాబట్టి ఇక్కడికి రైలు, విమానం, రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఢిల్లీ సహా అన్ని ప్రధాన నగరాల నుండి మధుర వరకూ బస్సులో చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications















