ఐఆర్సిటిసి తిరుపతి టు ఊటీ సరికొత్త టూర్ ప్యాకేజీ!
కుటుంబసమేతంగా తిరుపతి దర్శనం చేసుకుని, సరదాగా విహారయాత్రకు వెళ్లాలనుకునేవారికి ఐఆర్సిటిసి టూరిజం గుడ్న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి ఊటీకి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. దీంతో శీతాకాలంలో ఊటీ అందాలు చూడాలనుకునే ఔత్సాహికుల కోరిక తీరనుందనే చెప్పాలి.
నిజానికి వేసవి విడిది కేంద్రంగా పేరొందిన ఊటీకి శీతాకాలంలో ప్రయాణమంటే చాలామంది ఆలోచిస్తారు. అయితే అక్కడి ప్రకృతి అందాలు ఈ సీజన్లోనే రెట్టింపు అవుతాయని కొందరి నమ్మకం. ఆ నమ్మకంతోనే శీతాకాలంలో ఊటీకి వెళ్లేందుకు మక్కువ చూపిస్తారు. అలాంటి వారి కోసమే అల్టిమేట్ ఊటీ పేరుతో ఐఆర్సిటిసి టూరిజం ఈ రైల్ టూర్ ప్యాకేజీని పరిచయం చేస్తోంది.
ఈ సీజన్లో ఊటీ వెళ్లాలనుకునేవారు ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజుల విహారం ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఊటీ, కూనూర్లోని ప్రకృతి అందాలను దగ్గరగా చూసే అవకాశం ఉంది. వారంలో ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

అన్ని తరగతుల వారికీ అనువుగా..
ఐఆర్సిటిసి ఊటీ టూర్ ప్యాకేజీ ధరలు అన్ని తరగతుల వారినీ దృష్టిలో ఉంచుకుని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ వివరాల ప్రకారం కంఫర్ట్ ప్యాకేజీ కోసం ట్రిపుల్ షేరింగ్కు రూ.10,880, డబుల్ షేరింగ్కు రూ.13,780, సింగిల్ షేరింగ్కు రూ.25,420గా నిర్ణయించారు. అలాగే, స్టాండర్డ్ ప్యాకేజీ కోసం ట్రిపుల్ షేరింగ్కు రూ.9,540, డబుల్ షేరింగ్కు రూ.12,450, సింగిల్ షేరింగ్కు రూ.24,080 చెల్లించాలి. ఇక్కడ కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ప్రయాణం, స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ఏసీ హోటల్లో బస, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అయ్యేలా ఏర్పాటు చేశారు. అయితే, లంచ్, డిన్నర్, రైలులో భోజనం, సైట్సీయింగ్ ప్లేసెస్లో ఎంట్రెన్స్ టికెట్లు, బోటింగ్, హార్స్రైడింగ్ లాంటివి ప్యాకేజీలో కవరవ్వవు. వీటి కోసం సొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ప్రయాణానికి రూట్ మ్యాప్..
ఐఆర్సీటీసీ అందిస్తోన్న ఈ అల్టిమేట్ ఊటీ టూర్ మొదటిరోజు తిరుపతిలో రాత్రి 11.55 గంటలకు ప్రారంభమవుతుంది. అలా రాత్రి తిరుపతి రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కితే మరుసటి రోజు ఉదయానికే కొయంబత్తూర్ చేరుకుంటారు. అక్కడ సొంత ఖర్చులతో టిఫిన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఊటీకి బయలుదేరాల్సి ఉంటుంది. మధ్యాహ్నానికి ఊటీ చేరుకున్న తర్వాత అక్కడే హోటల్కు చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ అందాలను మనసారా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. జాబితాలోని ప్రదేశాల సందర్శన అనంతరం రాత్రికి ఊటీలో బస చేయాలి.

కూనూర్ సైట్ సీయింగ్..
ఇక మూడో రోజు ఊటీ లోకల్ టూర్కు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ మూడోరోజు పర్యటన జాబితా ఉంటాయి. ఆ ప్రదేశాల విహారం తర్వాత మళ్లీ రాత్రికి ఊటీలో బస చేయాలి. నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ ఉంటుంది. ఈ టూర్లో ఇదే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మధ్యాహ్నం తిరిగి ఊటీ చేరుకుంటారు.
సాయంత్రం వరకు షాపింగ్ చేయొచ్చు. రాత్రికి ఊటీలో బస చేయాలి. ఐదో రోజు ఊటీ నుంచి బయల్దేరి, కొయంబత్తూర్ రైల్వే స్టేషన్లో సాయంత్రం 4.35 గంటలకు రైలు ఎక్కితే అర్ధరాత్రి తిరుపతి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. మరెందు ఆలస్యం శీతాకాలపు ఊటీ అందాలను ఆస్వాదించేందుకు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.



Click it and Unblock the Notifications















