" కిన్నెరసాని... వచ్చిందమ్మ వెన్నెల పైటేసి... " అనే కవి భావనలకు అద్దంపట్టే ప్రకృతి రమణీయతకు, ఆహ్లాదభరితమైన వాతావరణానికి, కొండలు, అడవులు, చెట్ల నడుమ వన్యమృగాల సంచారంతో చరిత్రకెక్కిన పాల్వంచలోని కిన్నెరసాని ... ఒక ప్రసిద్ద పర్యాటక ప్రదేశం. నిజానికి కిన్నెరసాని గోదావరి నదికి ఒక ఉపనది. వరంగల్ లో పుట్టి, ఖమ్మం జిల్లాలోని భద్రాచలానికి కాస్త దూరంలో గోదావరి నదిలో కలుస్తుంది. సుమారుగా 90 కి. మీ. ప్రవహిస్తున్న ఈ నది .. 1300 చ.కి.మీ. ప్రాంతాన్ని ఆక్రమించింది.

కిన్నెరసాని ద్వీపం ఇదిగో..ఇలాగా
Photo Courtesy: ravindra_s_1999
మంచి పిక్నిక్ స్పాట్ గా కిన్నెరసాని
ఖమ్మం జిల్లా పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరంలోని యానంబైలు, కిన్నెరసాని గ్రామాల నడుమ 1967లో అటవీ శాఖ అభయాణ్యంలో కిన్నెరసాని నదిపై రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మించారు. ఈ రిజర్వాయర్ డ్యామ్ నిర్మాణించిన దగ్గరనుండి పిక్నిక్ స్పాట్ గా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మధ్యప్రదేశ్, కర్నాటక, ఒరిస్సా, మహారాష్ర్ట నుంచి సైతం పర్యటనకు వస్తుంటారు. ఈ ప్రాజెక్టు వ్యవసాయ భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, కొత్తగూడెం పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది.

కిన్నెరసాని రిజర్వాయర్ వద్ద పర్యాటకుల తాకిడి
Photo Courtesy: telangana tourism
ఇక్కడ స్థానికంగా ఉండే విద్యార్థినీ, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు సెలవు దొరికిందంటే చాలు కిన్నెసానిలో ప్రత్యక్షమవుతారు. దీనికి తోడు దూరప్రాంతాల నుండి వచ్చే పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో సెలవు దినాల్లో ఈ ప్రాంతమంతా పర్యాటకులతో నిండిపోతుంది.
అద్దాల మేడ
కిన్నెరసానికి ప్రత్యేక ఆకర్షణ.. అద్దాల మేడ. 34 సంవత్సరాల క్రింతం సింగరేణి సంస్థ నిర్మించిన అద్దాల మేడ పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే కొన్నేళ్ళ క్రితం పీపుల్స్వార్ ఈ అద్దాల మేడను బాంబులతో ధ్వంసం చేయడంతో దీని ఆకర్షణీయతకు కొంత విఘాతం ఏర్పడింది. ధ్వంసమైన అద్దాల మేడను పునరుద్దరించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. దీంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యము
కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యము 635 చ.కి.మీ.లు. విస్తరించి ఉంది.
ఇక్కడ కనిపించే జంతువులు : ఇక్కడి అభయ అరణ్యాన్ని పరిరక్షించి అంతరించిపోతున్న అరుదైన జంతు జాతులను రక్షించేందుకు వన్యమృగ సంరక్షణ విభాగాన్ని పాల్వంచ కేంద్రంగా నెలకొల్పారు. ఈ అభయారణ్యంలో పులి, చిరుతపులి, ఎలుగు బంట్లు, కృష్ణజింక, కడితి, దుప్పి, మనుబోతు, అడవిపంది, రేచుకుక్క, అడవిదున్న, బుర్ర జింక, కొండగొర్రె, దుమ్ముల గొండి వంటి అనేక రకాలైన వన్యమృగాలు సంచరిస్తుండగా 300 రకాల పక్షులు జాతీయ పక్షి నెమళ్లు, సరస్సులోని నీటి మడుగులలో ముసళ్ళు వందల సంఖ్యలో ఉన్నాయి.

అరణ్యంలో సంరక్షించబడుతున్న మొసళ్ళు
Photo Courtesy: raviankam_525
ఇక్కడ కనిపించే వృక్ష సంపద : ఇవి ఎండిన ఆకు రాల్చు అడవులు. ఉసిరి, మామిడి, జిట్రేగి, బండారి, సోమ, ఎగిస, వెదురు, మద్ది, చిరుమాను, టేకు మొదలైన వృక్ష జాతులు ఇక్కడ వున్నాయి. మెర్రెడు, జాలేరు రాళ్ళ వాగు లాంటి జీవ వాగులు సైతం ఉన్నాయి. కిన్నెరసాని సరస్సు అతి సుందరమైన ప్రకృతి రమణీయత గలది.
ప్రవేశించు మార్గం: భద్రాచలం రోడ్డు రైల్వేస్టేషన్ నుండి 25 కి.మీ
సందర్శించు కాలం: అక్టోబర్ నుండి జూన్ వరకు
కిన్నెరసాని ఎలా చేరాలి??
వాయు మార్గం
విజయవాడ కిన్నెరసానికి సమీపంలో గల దేశీయ విమానాశ్రయం. ఇక్కడి నుంచి 165 కి. మీ. దూరంలో కిన్నెరసాని ఉంది. ఈ ఏర్ పోర్ట్ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమానాలు నడుపుతారు. అంతే కాక హైదరాబాద్ లో ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కిన్నెరసానికి 288 కి .మీ. దూరంలో ఉన్నది.
రైలు మార్గం
కిన్నెరసానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ భద్రాచలం రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి హైదరాబాద్ , విజయవాడ తదితర ప్రధాన నగరాలకు రైళ్లు వెళుతుంటాయి.
రోడ్డు మార్గం
కిన్నెరసానికి రావాలంటే, హైదరాబాద్ నుంచైతే 288 కి. మీ. దూరంలో, ఖమ్మం నుంచి 95 కి. మీ. దూరంలో, విజయవాడ నుంచి 165 కి. మీ. దూరంలో, వరంగల్ నుంచి 160 కి. మీ. దూరంలో, నల్గొండ నుంచి 210 కి. మీ.
దూరంలో ఉంది.

కిన్నెరసానికి ప్రయాణం ఎప్పుడు ??
Photo Courtesy: joe998989



Click it and Unblock the Notifications













