రాజస్థాన్ రాష్ట్రం అంటే అందరికీ గుర్తువచ్చేది ఎడారి, ఇసుక దిబ్బలు. వెళ్ళి చూస్తే, ఒక్కోసారి పురాతన కాలంలోకి తీసుకొని వెళ్లే రాజకోటలు, చారిత్రక కట్టడాలు దర్శనమిస్తాయి. వీటిని చూస్తే రాజుల కాలం నాటి విలాసవంతమైన జీవితం మన మదిలో అలా .. అలా .. కదలాడుతుంది. ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలకు మరియు వారసత్వ సంపదకు పుట్టినిల్లు గా భావించే ఈ రాష్ట్రంలో మీకు తెలియని ఒక అద్భుతాల రాజకోట దాగి ఉంది. ఈ కోటను చూడాలంటే మరి రాజస్థాన్ వెళ్లాల్సిందే ..
రాజస్థాన్ రాష్ట్రం లోని రాజసమండ్ జిల్లా లో ఉన్న కుంభాల్ ఘర్ ఒక ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. రాజస్థాన్ రాష్ట్రం లో ఇతర ప్రదేశాల వలె కుంభాల్ ఘర్ ప్రదేశం కూడా అందమైన ప్యాలెస్ లకు ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతానికి దేవాలయాలు, అభయారణ్యం అదనపు ఆకర్షణలు. మరి ఆలస్యం ఎందుకు ?? ఇక్కడున్న ప్రదేశాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం రండి ..!
కుంభాల్ ఘర్ కోట
మీరు కుంభాల్ ఘర్ కి వస్తే తప్పక చూడవలసిన ప్రదేశం కుంభాల్ ఘర్ కోట. ఎందుకంత ప్రత్యేకత ? అంటే ... ఈ కోటలో ఏకంగా 360 ఆలయాలు, 252 భవంతులు, మరెన్నో అద్భుతాలు ఉన్నాయి. ఏంటి తమాషా చేస్తున్నాను అనుకుంటున్నారా ?? కాదండి బాబోయ్ నిజంగా కావాలంటే మీరే చూడండి.
Photo Courtesy: Amit Tiwari
కుంభాల్ ఘర్ కోట
ఆరావళి ప్రాంతంలో ఇంచుమించు 36 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది కుంభాల్ ఘర్ కోట. ఈ కోటను 15 శతాబ్దంలో రాణా కుంభా మహారాజు నిర్మించారు. కోట మేవార్ నది ఒడ్డున ఉంది. ఈ భారీ కోట 13 శిఖరాలను, వాచ్ టవర్లను మరియు బురుజులను కలిగి ఉంది. దీనిలోనే మహారాణా ఫతేసింగ్ నిర్మించిన గోపుర ప్యాలెస్ ఉంది. అత్యంత పొడవుగా ఉండే కుంభాల్ ఘర్ కోట గోడను శత్రువుల దాడుల నుండి రక్షణ కోసం నిర్మించారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత రెండో పొడవైన గోడగా ఇది ప్రసిద్ధి పొందింది.
Photo Courtesy: Arpit Tyagi
కుంభాల్ ఘర్ కోట
ఈ కుంభాల్ ఘర్ కోటను చూడాలంటే ఒక్కరోజు మొత్తం సరిపోదు. కోట సుమారు 3500 అడుగుల ఎత్తులో, ఆరావళి పర్వత పంక్తులలో ఉన్న 13 పర్వతాల మధ్యలో ఉంటుంది కనుకనే శత్రువులు సైతం ఏమీ చేయలేకపోయారు.
Photo Courtesy: Amit Rawat
నీలకంఠ మహదేవ్ దేవాలయం
కోట యొక్క ప్రాంగణం లో 360 హిందూ, జైన ఆలయాలు ఉన్నాయి. వీటిలో నీలకంఠ మహాదేవుని ఆలయం ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయంలో మహాశివుడు కొలువై ఉంటాడు. ఇక్కడ ఉన్న ఆరు అడుగుల ఎత్తులోని శివలింగం దేశంలో ఉన్న అతి పెద్ద శివలింగాలలో ఒకటిది.
Photo Courtesy: Sreenivasan Ramakrishnan
వేది దేవాలయం
వేది దేవాలయం కుంభాల్ ఘర్ కోటలోని హనుమాన్ పోల్ కు సమీపంలో కలదు. ఈ జైన దేవాలయాన్ని రాణా కుంభ నిర్మించాడు. ఈ ఆలయంలో జైనుల జీవన చిత్రాలను ప్రతిబింభించే విధంగా కలాకృతులు చెక్కించబడ్డాయి.
Photo Courtesy: Sreenivasan Ramakrishnan
పరశురాం దేవాలయం
పరశురాం దేవాలయం కోట లోని పురాతన గుహలో కలదు. ఈ ఆలయంలో పరశురామ రుషి విగ్రహం ఉంటుంది. పురాణం మేరకు పరశురాముడు ఇక్కడ ధ్యానం చేశాడని, పిమ్మట శ్రీరాముడి ఆశీర్వాదం పొందాడని చెపుతారు. ఈ గుహను చేరాలంటే పర్యాటకులు సుమారు 500 మెట్లు ఎక్కిదిగవలసి ఉంటుంది.
Photo Courtesy: Adrian Whelan
మమ్మాదేవ్ ఆలయం
మమ్మాదేవ్ ఆలయం, కోట యొక్క కింది భాగం లో ఉన్నది. ఈ గుడిలో మేవార్ చరిత్రను శిలా శాశనం రూపంలో వ్రాసి ఉండటం గమనిస్తారు. కుబేరుడి కూడ్య చిత్రం మరియు రెండు స్థూపాలను కూడా దేవాలయంలో చూడవచ్చు. ఈ దేవాలయం కి సమీపంలో ప్రకృతిలో మమేకమైన అందమైన రిజర్వాయర్ చూపరులను కనువిందు చేస్తుంది.
Photo Courtesy: Hussain Raza
బాదల్ మహల్
కుంభాల్ ఘర్ లో ఉన్న అందమైన ప్యాలెస్ లలో ప్రముఖంగా అందరూ ఇష్టపడేది బాదల్ ప్యాలెస్. దీనినే మేఘాల ప్యాలెస్ అంటారు. ఈ ప్యాలెస్ లో రెండు అందమైన మహల్ లు ఉన్నాయి. వీటిలోని గదులు మన ఇండ్లలో ఏసీ వేస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. చల్లటి గాలి లోనికి రావడం, వేడి గాలి బయటికి పోవడం వంటి విధానాలు ఇక్కడ గమనించవచ్చు. అప్పట్లో రాజు సభ చేసేటప్పుడు రాణి పై నుంచి రాతి జాలీల నుంచి చూస్తుంది మీకు గుర్తుందా ... సినిమాలలో చూసింటారు కదా ! ఆ... ఆది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.
Photo Courtesy: HaBaDisDonc (HBDD)
కుంభాల్ ఘర్ కోట
రాజదర్పం ఉట్టిపడే 252 ప్యాలెసు లు ఈ కోట కలిగి ఉంది. నీటి కోసం అప్పట్లో ఉపయోగించిన పెద్ద పెద్ద బావులు, ట్యాంక్ లు ఇక్కడ బోలెడన్ని కనిపిస్తాయి. వేలాది వృక్షాలతో పాటుగా అందమైన తోటలు ఇక్కడ మిమ్మల్ని ఆకర్షిస్తాయి.
Photo Courtesy: Sajaldhiman
కుంభాల్ ఘర్ కోట
కోట సమీపంలో రాత్రుళ్ళు వ్యవసాయం చేసే రైతుల కోసం రాజు మహారాణా కుంభా ప్రతిరోజూ 50 కేజీల నెయ్యి ని ఉపయోగించి ప్రహారి గోడ చుట్టూ కాగాడాలతో భారీ దీపాలను వెలిగించేవాడని ఇక్కడి స్థానికులు చెబుతారు. వీటిలో వత్తులు ఉంటాయి కదా ..! ఆ వత్తులను 100 కిలోల పత్తి తో చేసేవారట ..!
Photo Courtesy: Sudhir Shukla
కుంభాల్ ఘర్ కోట
ఈ కోట మేఘాలను తాకుతున్న ఫీలింగ్ ని ఇస్తాయి. ఈ కోట మీద నుండి చుట్టూ ఒక్కసారి గమనిస్తే, అరావళి పర్వతాల అందాలు, ధార్ ఎడారి ఇసుక దిబ్బలు కనువిందు చేస్తాయి.
Photo Courtesy: Oleg Gudkov
కుంభాల్ ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం
కుంభాల్ ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం లో నాలుగు కొమ్ముల జింక లేదా చిరుతపులులు, అడవి, తోడేళ్ళు, ఎలుగు బంట్లు, నక్కలు, సాంబార్ లు, చింకారాలు, చిరుతపులులు, హైనాలు, అడవి పిల్లులు, మరియు కుందేళ్ళు వంటివి చూడడానికి చక్కటి ప్రదేశం. రాజస్థాన్ రాష్ట్రం లో మరెక్కడా లేని విధంగా ఈ అభయారణ్యంలో పర్యాటకులు తోడేళ్ళు గమనిస్తారు.
Photo Courtesy: sharadagrawal931978
మహావీర దేవాలయం
కుంభాల్ ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం లో మహా వీర భగవానునుకి చెందిన ముచ్చల్ మహావీర దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో శివునికి మీసాలు కలిగి ఉన్న విగ్రహం గమనించవచ్చు. దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు విగ్రహాలు కాపలా కాస్తున్నట్లు కనిపిస్తాయి. ఇక్కడ సంప్రదాయ దుస్తులను కొనుక్కోవచ్చు.
Photo Courtesy: Ashish Jain
కుంభాల్ ఘర్ ఎలా చేరుకోవాలి ??
విమాన ప్రయాణం
కుంభాల్ ఘర్ ప్రదేశానికి మహారాణా ప్రతాప్ విమానాశ్రయం లేదా డబోక్ విమానాశ్రయం ద్వారా చేరవచ్చు. ఇది ఉదయపూర్ లో ఈ ప్రదేశం నుంచి సుమారు 116 కి.మీ. ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయం నుండి ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మరియు జైపూర్ మరియు జోధ్ పూర్ లకు విమానాలు తరచుగా నడుస్తాయి. మహారాణా ప్రతాప్ విమానాశ్రయంనుండి కుంభాల్ ఘర్ కు ప్రి పెయిడ్ టాక్సీలు దొరుకుతాయి.
రైలు ప్రయాణం
కుంభాల్ ఘర్ కు సమీప రైలు స్టేషన్ ఫల్నాలో కలదు. ఇది ముంబై, అజ్మీర్, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్ మరియు జోధ్ పూర్ లకు తరచు ట్రైన్ సర్వీసులు కలిగి ఉంది. ఇక్కడినుండి కుంభాల్ ఘర్ కు క్యాబ్ లలో చేరవచ్చు.
రోడ్డు ప్రయాణం
ఉదయపూర్, అజ్మీర్, జోధ్ పూర్, పుష్కర్ ల నుండి తరచుగా నడిచే ప్రయివేట్ లేదా ప్రభుత్వ బస్సులలో పర్యాటకులు సౌకర్యవంతంగా కుంభాల్ ఘర్ చేరుకోవచ్చు.
Photo Courtesy:Hussain Raza