విజయనగరం దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రం లో ఉన్న ఒక జిల్లా. ఈ జిల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే కొత్తది. విజయనగరం జిల్లా బంగాళాఖాత సముద్రం నుండి 18 కి. మీ. దూరంలో ఉన్నది అంతే కాక వైజాగ్ మహానగరం నుండి సరాసరి 70 కి. మీ. దూరంలో ఉంది.
విజయనగరం జిల్లా చాలా ప్రశస్తి గలది. ఇక్కడ చాలానే చూసే ప్రదేశాలు ఉన్నా వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి కొన్నే ఉన్నాయి. ఈ జిల్లాలోనే చరిత్ర ప్రసిద్ది గాంచిన బొబ్బిలి యుద్దం, చెందుర్తి యుద్దం జరిగాయి. ఈ విజయనగర ప్రదేశాన్ని కళింగ గంగరాజులు 100 సంవత్సరాల పాటు, గజపతిరాజులు ఏకంగా 140 సంవత్సరాలపాటు పరిపాలించారు. ఇంతటి ఘనమైన చరిత్ర గల ఈ జిల్లాలో కొన్ని పర్యాటక ప్రదేశాలను ఒకసారి చూసినట్లయితే ..
విజయనగరం కోట
విజయనగరం జిల్లాలో చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఆకర్షణ లలో విజయనగరం కోట ప్రధానమైనది. విజయనగర రాజులు 1713 వ సంవత్సరంలో ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభించారు. అంతకు ముందు వారు కుమిలి అనే ప్రదేశంలో ఒక మట్టి కోటలో జీవనం సాగించేవారు.
Photo Courtesy: Adityamadhav83
విజయనగరం కోట
విజయనగరం కోట ను రాళ్లతో అదికూడా పూర్తిగా కొండరాళ్లతో నిర్మించారు. ఈ కోట 26 ఎకరాల విస్తీర్ణంలో, చుట్టూ నాలుగు వైపులా నాలుగు పెద్ద పెద్ద బురుజులతో కట్టబడింది. కోట చుట్టూ విజయనగర రాజులు కందాకం తవ్వించారు. ఈ కందాకం రెండు ఏనుగులు లోనికి మునిగెంత లోతు ఉండేది. ఆనాడు శత్రువులు లోనికి ప్రవేశించకుండా ఉండటానికి కోట గోడలు 30 అడుగుల ఎత్తు నిర్మించారు.
Photo Courtesy: Minhajuddin Faruqi
గంట స్తంభం
విజయనగరం జిల్లాలో మరొక ప్రధాన ఆకర్షణ గంట స్తంభం. 68 అడుగుల ఎత్తుగల ఈ స్తంభం విజయనగరం మొత్తానికి గుర్తుండిపోయే చిహ్నం. హైదరాబాద్ కి చార్మినార్ ఎలాగో విజయనగారానికి ఈ చిహ్నం అలాగనమాట.
Photo Courtesy: Adityamadhav83
గంట స్తంభం
ఈ గంట స్థంభాన్ని రాజులు నిర్మించడానికి ఒక చరిత్ర ఉంది అదేమిటంటే అప్పట్లో రాజులు విజయనగరాన్ని సందర్శించాలని బ్రిటీష్ వారిని కోరతారు. రాజులు అంతగా చెబుతుండటంతో బ్రిటీష్ వారు వచ్చి వెళతారు. వారి వచ్చి వెళ్ళటాన్ని గుర్తుగా వారు లండన్ లోని అతి పెద్ద క్లాక్ టవర్ చూసి ఈ కట్టడాన్ని నిర్మించారు. ఇది విజయనగారానికి నాడిమధ్యలో ఉన్నందున పర్యాటకులను కనువిందు చేస్తుంది.
Photo Courtesy: GUMMA VIJAYAKUMAR
చింతపల్లి బీచ్
విజయనగరం జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో చింతపల్లి బీచ్ ఒకటి. ఇది పర్యాటకులను కనువిందు చేస్తూ, ఇక్కడున్న లైట్ హౌస్, సముద్రంలోని రాళ్ళ గుట్టలు, పెద్ద పెద్ద ఇసుక తిన్నెలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. పూసపాటిరేగ అనే గ్రామానికి ఇది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నది. జాతీయ రహదారి నెంబర్ 5 ఈ ఊరి గుండా వెళుతుంది కనుక మీరు ఇక్కడ దిగి ఆటో లో గాని, ప్రభుత్వ బస్సుల్లో గాని వెళ్ళవచ్చు.
Photo Courtesy: Naveen clicks
తాటిపూడి
విజయనగరం జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలలో తాటిపూడి, చుట్టూ కొండలతో .. నిండుగా ఉన్న జలాశయంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడున్న కొండపై నిర్మించిన గిరి వినాయకుడు, వెదురు కర్రలతో చేసిన పలు ఆకారాలు ఆకర్షణీయంగా కనపడతాయి.
Photo Courtesy: vizianagaram.nic.in
తాటిపూడి
తాటిపూడి రిజర్వాయర్ లో బోట్ షికారు ఉంది. మీరు బోట్ లో షికారు చేయాలంటే 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. విజయనగరం పట్టణానికి 12 కి. మీ .దూరంలో ఈ పర్యాటక కేంద్రం లో విశ్రాంతి తీసుకోవడానికి అటవీశాఖ వారి కాటేజీలు ఉన్నాయి.
Photo Courtesy: Adityamadhav83
తోటపల్లి
తోటపల్లి లో ఉన్న ప్రధాన ఆకర్షణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్ర మొత్తం ప్రసిద్ధిగాంచినది. పార్వతీపురం నుండి పాలకొండ వెళ్లే రోడ్డు మార్గం లో 10 కి. మీ. దూరంలో ఈ ఆలయం ఉంది. గుడి పక్కనే నాగావళి నది ప్రవహిస్తుండటంతో భక్తులు అందులో దిగి స్నానాలు చేస్తుంటారు. అలా చేస్తే వారి కోరికలు నెరవేరతాయని నమ్మకం.
Photo Courtesy: vizianagaram.nic.in
పైడి తల్లి అమ్మవారి దేవాలయం
పైడిమాంబ లేదా పైడి తల్లి, ఉత్తరాంధ్ర ప్రజల దైవం మరియు ఇలవేల్పు. ఇక్కడ జరిగే అమ్మవారి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. ఇందులో సిరిమానోత్సావం ప్రముఖ ఘట్టం. ఆ ఉత్సవ సమయంలో ఒక పొడవాటి గడ తీసుకొని, చివరన ఒక పీఠాన్ని (కుర్చీ) తగిలించి, అందులో పూజారిని కూర్చోబెట్టుకొని గుడి ప్రాంగణం మొత్తం ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ.
Photo Courtesy: vizianagaram.nic.in / temples
బొబ్బిలి
బొబ్బిలి యుద్దం భారత చరిత్రలో ఒక మారుపురాని ఘట్టం. బొబ్బిలికి, పక్కనున్న విజయనగారానికి మధ్యన జరిగిన వీరోచిత పోరాటానికి బొబ్బిలి ఒక కేంద్రం. పూర్వం ఫ్రెంచ్ వారితో చేతులు కలిపి బొబ్బిలి పై దాడి చేసిన విజయరామరాజు యుద్దం ముగిసాక తన గుడారంలో నిద్రిస్తుండగా, తాండ్ర పాపారాయుడు అతనిని హతమార్చాడు. ఈయన వీరోచిత ధైర్యానికి జ్ఞాపకార్థం ఆయన శిలావిగ్రహాన్ని ప్రతిష్టించారు.
Photo Courtesy: Adityamadhav83
సాలూరు
సాలూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే సుందరమైన ప్రదేశం. ఈ పర్యాటక కేంద్రం వంశధార ఉపనది అయిన వేగావతి నది ఒడ్డున ఉన్నది. ఈ ఊరిలో పర్యాటకులను ప్రముఖంగా ఆకర్షించేది పురాతన పంచముఖేశ్వర శివాలయం. ఇక్కడ ఈ ఆలయంతో పాటుగా సాయిబాబా ఆలయం, అయ్యప్పస్వామి కోవెల, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, సంతోషిమాత ఆలయాలు నదీ తీరంలో ఉండి ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులను ఆకర్షిస్తున్నాయి.
Photo Courtesy: Adityamadhav83
సరిపల్లి
సరిపల్లి విజయనగరం జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఈ ఊరు చంపావతి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ దిబ్బి లింగేశ్వర స్వామి ఆలయం ప్రముఖమైనది. దీనిని క్రీ.శ. 7 నుండి 10 వ శతాబ్ధం మధ్యలో కళింగ రాజులు నిర్మించారు. ఆలయ గోడమీద చెక్కించిన శిల్ప కళా ఖండాలు భక్తులను అబ్బుర పరుస్తాయి.
Photo Courtesy: Adityamadhav83
భోజనం
ఆంధ్ర దేశం అంతా ఏమీ తింటారో అదే ఇక్కడ కూడా తింటారు. కాసింత నెయ్యితో అన్నం, పప్పు, సాంబారు, రసం, అప్పడం, నాన్చుకోవడానికి ఏదేని కర్రీ, పిక్కల్(చట్నీ) మరియు పెరుగుతో సంపూర్ణంగా భుజిస్తారు. వేడుకల సమయాలలో బిర్యానీలు కూడా చేసుకుంటారు.
Photo Courtesy: Kalyan Kanuri
షాపింగ్
విజయనగరం జిల్లా చేతితో తయారు చేసే బొమ్మలకు ప్రసిద్ధి మరియు కొయ్య బొమ్మలకు పేరుగాంచినది. గోడలకు వ్రేలాడదీసే వస్తు సామాగ్రి ఎక్కువగా కనిపిస్తుంది. కలమరి పేంటింగ్స్ కూడా ఈ పట్టణంలో దొరుకుతాయి. బట్టలు, ఇతర వస్తువులు కూడా ఇక్కడ లభ్యమవుతాయి.
Photo Courtesy: Adityamadhav83
విమాన మార్గం
విజయనగరంలో ఎటువంటి విమానాశ్రయం లేదు. దీనికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం వైజాగ్ లో ఉన్న విమానాశ్రయం. విశాఖ నుండి విజయనగారానికి మధ్య దూరం 67 కి. మీ. ఇక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి.
Photo Courtesy: Praveen Alavilli
రైలు మార్గం
విజయనగరం పట్టణంలో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. ఈ జిల్లాలో విజయనగరం, కొత్తవలస అనేవి ముఖ్యమైన రైల్వే జంక్షన్ లు. ఈ జిల్లా మొత్తం మీదుగా 28 రైల్వే స్టేషన్ లు ఉన్నాయి.
Photo Courtesy: Rajasekhar1961
రోడ్డు మార్గం
విజయనగరం జిల్లా గుండా 2 జాతీయ రహదారులు పోతున్నాయి. ఇవి ఉండటం వల్ల రోడ్డు రవాణాకి ఒకింత మేలుచేకూరుతుంది. విజయనగరం జిల్లాకి ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. శ్రీకాకుళం నుండి 69 కి. మీ. దూరంలో, వైజాగ్ నుండి 67 కి. మీ. దూరంలో ఉన్న విజయనగారానికి ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి.
Photo Courtesy: Adityamadhav83