Search
  • Follow NativePlanet
Share
» »ఆది శంకరాచార్య ప్రతిష్టించిన ఏకైక ఆంజనేయస్వామి దేవాలయం !!

ఆది శంకరాచార్య ప్రతిష్టించిన ఏకైక ఆంజనేయస్వామి దేవాలయం !!

కేరే ఆంజ నేయస్వామికి వైదిక మంత్రాలతో పూజ చేస్తారు. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో శనివారాలలో కన్నుల పండుగగా దీపోత్సవం నిర్వహించటం ఇక్కడి రివాజు. 7:00 AM - 12:00 PM, 6:00 -7:00 PM వరకు దర్శించుకోవచ్చు.

By Mohammad

ఆది శంకరాచార్య హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథముడు. ఈయన గురువు, సిద్ధాంతవేత్త, మహాకవి. ఈయన ప్రతిపాదించిన సిద్దాంతం అద్వైతం. శంకరాచార్యుల వారు కేరళ రాష్ట్రంలోని కాలడి ప్రాంతంలో పుట్టారు. దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుండి మొదలు ఉత్తరాన ఉన్న జమ్మూకాశ్మీర్ వరకు ఆయిన హిందూ మతాన్ని వ్యాప్తి చేయటంలో కృషి చేశారు. ఆయన జన్మ వివరాలకు సంబంధించి సరైన ఆధారాలు లేవుకానీ క్రీ.శ. 7- 8 వ శతాబ్దంలో మధ్యలో జన్మించి ఉంటారని నమ్మకం. శంకరులవారు సాక్షాత్తు ఆ 'శివుని' అవతారంగా భావిస్తారు భక్తులు. భారతదేశం అంతటా కాలినడకన తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ శంకరులు అనేక దేవాలయాలను దర్శించారు. శృంగేరి, ద్వారకా, పూరీ, జ్యోతిర్మఠం మఠాలను స్థాపించి, ఇవి హిందూమతానికి నాలుగు దీపస్తంభంలా పనిచేస్తాయని చెప్పారు.

ఆది శంకరాచార్యులు ప్రతిష్టించిన వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆలయం శ్రీ ఆంజనేయ దేవాలయం. ఇది కర్ణాటకలోని శృంగేరి లో కలదు. దక్షిణ భారతదేశంలో పడమటి కర్నాటక రాష్ట్రంలో పడమటి కనుమల్లో మల్నాడు ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు, లోయలు, అరణ్యాలతో ఆకర్షించే పవిత్ర శృంగేరిలో ఆది శంకరరాచార్యుల వారు ప్రతిష్టించిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. దీన్ని కేరే ఆంజనేయ దేవాలయం అంటారు. కేరే అంటే కన్నడలో సరస్సు అని అర్ధం.

కేరే ఆంజనేయ దేవాలయం

కేరే ఆంజనేయ దేవాలయం

చిత్రకృప : sringeri.net

సరస్సు ఒడ్డునే ఆంజనేయస్వామి దేవాలయం ఉంది కనుక కేరే ఆంజనేయ దేవాలయం అన్న పేరు వచ్చింది. శ్రీ శంకరాచార్యులు భారత దేశం మొత్తం మీదిక్కడ శృంగేరిలో ఒక్కచోటే శ్రీ ఆంజనేయస్వామిని ప్రతిష్టించారు. ఇంత ప్రత్యేకం కనుకనే దేవాలయానికి అంతటి పేరు, ప్రఖ్యాతలు వచ్చాయి.

ఎక్కడ ఉంది ?

శృంగేరిలో పశ్చిమాన కేరే ఆంజనేయ స్వామి దేవాలయం ఇప్పుడున్నకొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నది. కోనేరు స్థానంలో ఇప్పుడు బస్ స్టాండ్ కట్టారు. చిన్న దేవాలయం అయినా చాలా అందంగా ఉంది. ప్రకృతి దృశ్యాలకు మధ్య ఉంది. కేరే ఆంజనేయ స్వామిని దర్శించాలి అంటే 27 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. శృంగేరికి వచ్చిన భక్తులు ముందుగా శ్రీ కేరే ఆంజనేయ స్వామిని దర్శించి, ఆ తర్వాత మిగతా దైవ దర్శనం చేస్తారు. ఆంజనేయస్వామి ఈ క్షేత్ర పాలకుడు కావటమే దీనిలోని విశేషం.

ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి దక్షిణ దిశాగా దర్శన మివ్వటం ఒక ప్రత్యేకత. స్వామి ఎడమ చేతిలో తామర పుష్పాన్ని ధరించి ఉంటాడు. కుడి చేయి అందరిని దీవిస్తున్నట్లు ఉండటం విశేషం. స్వామి వాలం శిరస్సు పైకి వ్యాపించి ఉంటుంది. తోక చివర చిన్న గంట కట్టి ఉంటుంది. కాలికి నూపురం ఉంటుంది. చేతికి కేయూరం ధరించి ఉంటాడు. ఆయన నేత్రాలు కృపా సింధువులై భక్త జనాల పై కరుణా కటాక్షాలు వర్షిస్తున్నట్లు విశాలంగా, తేజో పుంజాలను వేద జల్లేవిగా కనిపిస్తాయి.

విద్యాశంకర దేవాలయం

విద్యాశంకర దేవాలయం

చిత్రకృప : Vikas149r

కేరే ఆంజ నేయస్వామికి వైదిక మంత్రాలతో పూజ చేస్తారు. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో శనివారాలలో కన్నుల పండుగగా దీపోత్సవం నిర్వహించటం ఇక్కడి రివాజు. ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు వరకు, సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు.

శృంగేరిలో జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్య ప్రతిష్టించిన చదువుల తల్లి శారదాదేవి ఆలయం భారతదేశమంతా ప్రసిద్ధి చెందింది. కాల భైరవ, వన దుర్గ, కాళికాంబ దేవాలయాలు దర్శించతగినవి. ఋష్య శ్రుంగ మహర్షి తపస్సు చేసిన క్షేత్రం కనుక ఇది శృంగేరి అని ప్రసిద్ధి చెందింది.

శృంగేరి లో చూడవలసిన ఇతర దేవాలయాలు/మఠాలు

శృంగేరి లో ఆదిశంకర దేవాలయం, శారదా దేవి ఆలయం, శృంగేరి మఠం, కిగ్గా, మళయాళ బ్రహ్మ దేవాలయం, సిరిమనే జలపాతాలు, మల్లికార్జున దేవాలయం, తోరణ గణపతి దేవాలయం, శ్రీ విద్యాశంకర దేవాలయం, పార్శ్వనాథ తీర్థంకర దేవాలయం మరియు చప్పర ఆంజనేయ దేవాలయం మొదలగునవి చూడవచ్చు.

శారదాంబ ఆలయం

శారదాంబ ఆలయం

చిత్రకృప : Naveenbm

శృంగేరి సమీప పర్యాటక స్థలాలు

అగుంబే - 28 కిలోమీటర్లు, కుద్రేముఖ్ - 52 కిలోమీటర్లు, కర్కల - 60 కిలోమీటర్లు, భద్ర - 75 కిలోమీటర్లు, హొరనాడు - 78 కిలోమీటర్లు, చిక్కమగళూరు - 86 కిలోమీటర్లు.

వసతి సదుపాయాలు : శృంగేరి లో ధార్మిక సత్రాలు అధికం. వీటితో పాటు లాడ్జీలు, హోటళ్ళు కూడా యాత్రికులకు అందుబాటులో ఉంటాయి.

శృంగేరి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : శృంగేరికి దగరలో మంగళూరు విమానాశ్రయం 100 కిలోమీటర్ల దూరంలో కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ ద్వారా శృంగేరి చేరుకోవచ్చు.

రైలు మార్గం : శృంగేరి కి దగ్గరలో ఉడుపి, చిక్కమగళూరు రైల్వే స్టేషన్లు కలవు. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సులలో ప్రయాణించి శృంగేరి చేరుకోవచ్చు.

బస్సు మార్గం : బెంగళూరు, ఉడుపి, చిక్కమగళూరు, మంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల నుండి శృంగేరి క్షేత్రానికి ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు లభిస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X