కర్ణాటకలోని ప్రముఖ దుర్గామాత ఆలయాలు ఇవే.
దేశంలో దేవి నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. ఈ సకల చారాచర జగత్తుకు దుర్గామాతను ప్రతి రూపంగా భావిస్తారు. దుర్గామాతను ఈ సువిశాల భారత దేశంలో వివిధ పేర్లతో పిలవడమే కాకుండా, వివిధ రూపాల్లో కూడా కొలుస్తారు. అదే విధంగా ఆ దుర్గామాత కొలువై ఉన్న దేవాలయాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. ఈ సారి అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 24వ తేది వరకూ దేశవ్యాప్తంగా నవరాత్రులు ఘనంగా నిర్వహించనున్నారు. వీటిని శారద నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వర్షాకాలం అనంతరం జరుపుకునే నవరాత్రులు కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది.
దేశంలోని ప్రతి ప్రాంతంలో నవరాత్రులను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ నవరాత్రులకు పిల్లలకు స్కూలు సెలవులతో పాటు, పెద్దవారికి కూడా చాలా సెలవులు దొరుకుతాయి. కాబట్టి భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించేందుకు చాలామంది ప్రణాళికలు సిద్ధం చేస్తుంటారు. అయితే, కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన దుర్గామాత ఆలయాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారంతా ఈ నవరాత్రుల వేళ కర్ణాటకలోని ఈ ప్రముఖ దుర్గామాత ఆలయాలను సందర్శించేయండి. దుర్గా మాతకు అంకితం చేయబడిన ఈ ప్రముఖ దేవాలయాల గురించి ఇప్పడు తెలుసుకుందాం.

చాముండేశ్వరి దేవి ఆలయం..
కర్ణాటక రాజధాని అయిన బెంగళూరుకు సుమారు 140 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం మైసూరుకు అత్యంత సమీపంలో ఉంటుంది. దసర నవరాత్రులకు ఈ ఆలయంలో ఇసుకేస్తే రాలనంతా జనం ఉంటారు. అంతగా ఇక్కడ జనసందోహం ఉంటుంది. ఈ చాముండేశ్వరి దేవి ఆలయాన్ని శక్తి పీఠాల్లో ఒకటిగా కొలుస్తారు. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని దసరా సమయంలో నిర్వహించే జంబుసవారి కార్యక్రమంలో ఏనుగుపై ఉంచి ఊరేగించడం ఆనవాయితీ. ఈ సర్వాలంకార భూషితమైన చాముండమ్మను చూడటం ఎంతో అదృష్టంగా భావిస్తారు ఇక్కడికొచ్చే భక్తులు. తల మీదున్న చామరాజ ముడి, కంఠాభరణాలతో, కర్ణ పత్రాలతో, 3 పతకాలు, హారం, 28 మణులను పొదిగిన కంఠి, జడ పిన్నులు తదితర ఆభరణాలతో సర్వశోభితంగా చాముండీదేవి అలంకరణ ఉంటుంది.

దుర్గా పరమేశ్వరీ దేవాలయం, కటీల్
కర్ణాటకలోని ప్రముఖ రేవు పట్టణమైన మంగళూరుకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటీల్లో దుర్గా పరమేశ్వరి ఆలయం ఉంది. పార్వతీ దేవి కటీల్ దుర్గా పరమేశ్వరి రూపంలో ఈ ఆలయంలో వెలిశారని ఇక్కడివారి నమ్మకం. ఇక్కడ అమ్మవారికి ఒక్క కొబ్బరి కాయను కానుకగా ఇస్తే కోరిన కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ ఆలయాన్ని శక్తి పీఠాలలో ఒకటిగా భావించడం జరుగుతుంది. నందిని నది ఒడ్డున ఈ పవిత్ర దుర్గ పరమేశ్వరి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఆలయం చుట్టూ పచ్చని మొక్కలు ఉంటాయి. ఈ ఆలయం సౌందర్యం ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కర్ణాటకలో బాగా ప్రాచుర్యం పొందిన అతి కొద్ది క్షేత్రాలలో కటీల్ పుణ్యక్షేత్రం ఒకటి.

బనశంకరి దేవాలయం, కర్ణాటక
కర్ణాటకలోని బాదామి పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ బనశంకరి దేవాలయం ఉంది. ఈ ఆలయంలోని దుర్గామాతాను శాకంబరీ మాతగా కూడా పిలుస్తారు. బన అంటే అటవీ ప్రాంతం అని అర్థం. ఈ దేవాలయం తిలకరాయ అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ వెలిసిన అమ్మవారిని బనశంకరి అని పిలవడం ఆనవాయితీ వస్తోంది.



Click it and Unblock the Notifications














