భారతదేశ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం ఈ ప్రదేశాలు..!
భారతదేశం, వైవిధ్యాల దేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులలో చాలా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ప్రదేశాలను దాదాపు ప్రతి ఒక్కరూ సందర్శించేందుకు ఇష్టపడతారు. వారి బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని వెచ్చిస్తూ, పని నుండి కాస్త విశ్రాంతి తీసుకోవడానికి, కొన్ని క్షణాలను సరదాగా గడిపేందుకు తరచుగా ఇక్కడికి వస్తుంటారు. కొందరు సహజ ప్రదేశాలకు వెళితే, మరికొందరు పర్వతాలను సందర్శిస్తుంటారు. చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించాలనుకునేవారు మాత్రం తప్పకుండా ఇండియాలోని ఈ ప్రదేశాలను సందర్శించాల్సిందే. రండి ఆ ప్రదేశాలేంటో చూద్దాం.

అజంతా గుహలు, ఔరంగాబాద్
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్న అజంతా గుహలు చరిత్ర ప్రియులు సందర్శించేందుకు సరైన ప్రదేశమని చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్న పెయింటింగ్స్, శిల్పాలు బౌద్ధ మత కళను వర్ణిస్తాయి. ఉత్తర మహారాష్ట్రలో ఉన్న అజంతా ఎల్లోరా గుహలు అసాధారణమైన ఆకర్షణను కలిగి ఉన్నాయి. ఈ కారణంగానే ఏడాది పొడవునా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని అత్యధికంగా సందర్శిస్తుంటారు. ఔరంగాబాద్లోని ఈ ప్రసిద్ధ అజంతా ఎల్లోరా గుహలు భారతీయ శిల్ప కళాకారుల నైపుణ్యాన్ని, కళను ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతున్నాయి. ఈ గుహ నిర్మాణాల్లో అడుగడుగునా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఎన్నో పెయింటింగ్స్, ఆకర్షణీయమైన శిల్పాలను కూడా ఇక్కడ చూడొచ్చు.

హంపి, కర్ణాటక
హంపి చివరి హిందూ రాజ్యమైన విజయనగరానికి చివరి రాజధాని. దాని సంపన్న యువరాజులు 14వ మరియు 16వ శతాబ్దాల మధ్య ద్రావిడ దేవాలయాలు, రాజభవనాలను నిర్మించారు. హంపి విజయనగర సామ్రాజ్యానికి చెందిన శిథిలాలకు ప్రసిద్ధి చెందింది. ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం దాని స్మారక కట్టడాల సమూహానికి కూడా ప్రసిద్ధి చెందింది. 500 పురాతన స్మారక చిహ్నాలు, దేవాలయాలు, భవనాలు మరియు ఆకర్షణీయమైన శిధిలాలతో చుట్టుముట్టబడిన హంపి చరిత్ర ప్రియులకు చారిత్రాత్మకమైన ఆనందాన్ని కలిగిస్తుంది.

చోళ దేవాలయం, తమిళనాడు
చోళ సామ్రాజ్య రాజులు నిర్మించిన ఈ దేవాలయాలు దక్షిణ భారతదేశం అంతటా విస్తరించి ఉన్నాయి. తంజావూరులోని ప్రసిద్ధ బృహదీశ్వర దేవాలయం, గంగైకొండచోళీశ్వరంలోని బృహదీశ్వర దేవాలయం, దారాసురంలోని ఐరావతేశ్వరాలయం నేటికీ ఇక్కడికి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. మిస్టరీలకు నిలయం తంజావూరు బృహదీశ్వర ఆలయం. ఎక్కడా సిమెంట్, ఉక్కు అన్నమాటకు తావులేకుండా ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇంతటి అద్భుతమైన నిర్మాణాన్ని చూస్తే ఎంతటివారైనా సలాం చేయాల్సిందే..

సూర్య దేవాలయం, ఒడిశా
కోణార్క్లోని ఈ ఆలయం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. కోణార్క్ సూర్య దేవాలయం ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. శిల్పకళా అద్భుతం అయిన ఈ ఆలయం, ఏడు గుర్రాలు లాగిన సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు. కోణార్క్ అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది. కోన అంటే మూల అని, ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం. ఇది చంద్రభాగ నది ఒడ్డున నిర్మితమైంది. ప్రధాన ఆలయ సముదాయంలోని భారీ సూర్య విగ్రహంపై సూర్యుని కిరణాలు పడే విధంగా నిర్మించారు.
రాజస్థాన్ కొండ కోటలు
భారతీయ సంస్కృతిలో రాజస్థాన్కు తనదైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి సంస్కృతికి ఆకర్షితులై ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన కొండ కోటలలో చిత్తోర్ఘర్, కుంభాల్ఘర్, సవాయి మాధోపూర్, ఝలావర్, జైపూర్, జైసల్మేర్లోని ఆరు గంభీరమైన కోటలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications















