కార్తీక మాసం సందర్భంగా చాలామంది దేశంలో ప్రసిద్ధిచెందిన శివాలయాలను సందర్శించాలనుకుంటారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రసిద్ధిచెందిన శివాలయాలు చాలానే ఉన్నాయి. వాటిని ఈ కార్తీక మాసంలోనే సందర్శించొచ్చు. ఈ మాసంలో శివాలయాలను సందర్శించి ఎంతో భక్తితో పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్మకం. కర్ణాటకలోని ఈ ప్రసిద్ధ శివాలయాల గురించి తెలుసుకుందాం పదండి..

కోటిలింగేశ్వరాలయం
ప్రపంచంలోనే అత్యధిక లింగాలను కలిగి ఉన్న ఆలయం కోటిలింగేశ్వరాలయం. ఇది కోలార్ జిల్లాలోని కమ్మసంద్రలో నెలకొని ఉంది. ఇక్కడి శివలింగం ప్రపంచంలోనే పెద్దది. 108 అడుగుల ఎత్తులో శివలింగం, 35 అడుగుల ఎత్తులో నందివిగ్రహం ఇక్కడ లెక్కించలేని శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. ఈ శివలింగాలు రకరకాల సైజుల్లో ఉంటాయి. ఈ ఆలయం కర్ణాటకలోని బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన కోలార్ నగరంలో ఉంది
. ఈ ఆలయాన్ని ప్రశాంతమైన వాతావరణంలో అద్భుత వాస్తు కళా నైపుణ్యంతో నిర్మించారు. ఇక్కడకు వచ్చే భక్తులకు శివసన్నిధానంలో ఉన్న భావనను కలిగిస్తుంది. ఆలయం లోపలికి వెళ్లేకొద్దీ ఒక అడుగు మొదలుకొని, నాలుగైదు అడుగుల ఎత్తు వరకూ శివలింగాలు భక్తులకు దర్శనమిస్తూనే ఉంటాయి. వీటన్నింటి మధ్యలో అతి భారీ శివలింగం ఒకటి ఉంటుంది. దానికి అభిముఖంగా నందీశ్వరుడి విగ్రహం ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా కనిపిస్తాయి.

మహాబలేశ్వర్ ఆలయం గోకర్ణ
కర్ణాటకలోని ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిచెందింది గోకర్ణ మహబలేశ్వర్ ఆలయం. ఇది కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఈ ఆలయం ఉత్తర కన్నడలో అంటే కార్వార్ బీచ్లో ప్రవహించే అరేబియా సముద్రం ఎదురుగా ఉంటుంది. దీనిని ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ ఆలయంలో ఆత్మలింగం ఉంటుంది ఇది ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. కర్నాటకలోని ఏడు పవిత్రమైన మోక్షస్థలాలలో ఈ ఆలయం ఒకటనే చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం అందమైన బీచ్లకే కాకుండా నిశ్చలంగా ఉండే సముద్రానికి కూడా ప్రసిద్ధి చెందింది.

మంజునాథ దేవాలయం ధర్మస్థల
ధర్మస్థలలోని మంజునాథ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇది బెంగళూరు నుంచి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భక్తులు ఈ ఆలయంలోని మంజునాథుని ఒక్కసారైనా దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. కర్ణాటకలోని పురాతన శివాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలోని మంజునాథున్ని దర్శించుకునేందుకు కర్ణాటక నుంచి మాత్రమే కాకుండా దేశం నలుమూలల నుండి కూడా భక్తులు వస్తుంటారు.
శ్రీకంఠేశ్వర దేవాలయం నంజనగూడు
నంజుండేశ్వర ఆలయాన్ని శ్రీకంఠేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని కర్ణాటకలోని నంజనగూడులో ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం. నంజన్గూడ్ను దక్షిణ వారణాసి అని కూడా పిలుస్తుంటారు. శ్రీకంఠేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నందున ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని ఇక్కడి వారు చెబుతున్నారు. ఈ భారీ నంజుండేశ్వర లేదా శ్రీకంఠేశ్వర ఆలయాన్ని 19వ శతాబ్దంలో గంగులు నిర్మించారు. ఇక్కడ చండికేశ్వరుడు, పార్వతి, నాట్య గణపతి, ఇతరులతో కూడిన నారాయణ వంటి అనేక చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయం నంజనగూడు పట్టణంలో కపిలా నది ఒడ్డున ఉంటుంది.



Click it and Unblock the Notifications














