మనదేశంలో ఎక్కువమంది ప్రజలు ఎంచుకునే ఏకైక మార్గం రైలు ప్రయాణం.. ఎందుకంటే ఇది చాలా చవకైనది, అత్యంత సౌకర్యవంతమైనది. దేశంలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా అతి తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని రైలు కల్పిస్తోంది. అందుకే ఎక్కువశాత మంది ఈ మార్గాన్నిఎంపిక చేసుకుంటారు. అయితే, మనదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలు కూడా ఉన్నాయి. జలపాతాలు, సముద్రాలు, నదుల, పర్వతాలు, సరస్సుల గుండా అనేక రైలు మార్గాలు మనదేశంలో ఉన్నాయి.రైలు ప్రయాణాలంటేనే చాలామందికి ఎంతో ఇష్టం. ఎందుకంటే కిటికి పక్కన కూర్చొని ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. తాజాగా దేశంలోని అత్యంత అందమైన రైలు ప్రయాణాల్లో కొన్నింటి జాబితాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ చేశారు. అవేంటో ఇప్పడు చూసేద్దాం..
ఇందులో ఆరు అత్యంత అందమైన రైలు ప్రయాణాలను లిస్ట్ ఆయన పేర్కొన్నారు. ఈ జాబితాలో భాగంగా గుజరాత్లోని కచ్లో సాగే ట్రైన్ జర్నీకి మొదటి స్థానం కల్పించారు. రెండోస్థానంలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వే నిలవగా, మూడోస్థానంలో జమ్ము కశ్మీర్లోని బనిహాల్ నుంచి బద్గాం వరకు జరిగే రైలు ప్రయాణం ఉంది. అలాగే, నాలుగో స్థానంలో గోవా దూద్సాగర్ జలపాతం మీదుగా వెళ్లే రైలు, ఐదోస్థానంలో కేరళలోని కప్పిల్లో కొబ్బరి తోటల నుంచి సాగే ట్రైన్ జర్నీ, ఇక, ఆరోస్థానంలో హిమాచల్ప్రదేశ్లో కల్క నుంచి సిమ్లా వరకు ఉన్న టాయ్ ట్రెయిన్ జర్నీ గురించి ఆయన పోస్ట్ చేశారు.
కచ్, గుజరాత్
దేశంలోని అందమైన రైలు ప్రయాణాల జాబితాలో మొదటిస్థానంలో గుజరాత్లోని కచ్లో తెల్లటి ఇసుక ఎడారి మీదుగా సాగే రైలు ప్రయాణం ఉందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఈ ట్రైన్ జర్నీ నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది. గుజరాత్ నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ ప్రయాణికులకు రాన్ తెల్లని ఉప్పు ఎడారిలో ప్రయాణించే అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తుందని రైల్వే శాఖ మంత్రి వివరించారు.

నీలగిరి మౌంటెయిన్ రైల్వే, తమిళనాడు
దేశంలోని అందమైన రైలు ప్రయాణాల్లో తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వే జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఈ రైలు ప్రయాణం తమిళనాడులోని మెట్టుపాళయం నుండి ఊటీ వరకు విస్తరించి ఉంటుంది. నీలగిరి మౌంటైన్ రైల్వే సుమారు 46 కిలోమీటర్ల పొడవైన సింగిల్ రైల్వే ట్రాక్. ఈ రైలు మార్గంలో జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాలని చాలామంది అనుకుంటుంటారు. ఈ రైలు దట్టమైన అడవులు, సొరంగాల గుండా ప్రయాణిస్తోంది. ఈ ప్రయాణంలో పర్యాటకులకు ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసి ఎంజాయ్ చేయొచ్చు.

బనిహాల్- బద్గాం, జమ్మూకశ్మీర్
మరొక అందమైన రైలు ప్రయాణం.. జమ్ము కశ్మీర్ లోని బనిహాల్ నుంచి బద్గాం వరకు వెళ్లే ట్రైన్ జర్నీ. ఈ ప్రయాణంలో ప్రయాణికులు మంచుతో కప్పబడి ఉండే నేలలను, మంచు కురవడాన్ని రైలు నుంచే ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. ఓవైపు ట్రైన్పై మంచు కురుస్తూ ఉంటే ఆ ట్రైన్లో ప్రయాణం చేయడం మాటల్లో వర్ణించడం కష్టమనే చెప్పాలి.
దూద్సాగర్ జలపాతం, గోవా
గోవా దూద్సాగర్ జలపాతం మీదుగా వెళ్లే రైలు ప్రయాణం దేశంలోని అత్యంత అందమైన రైలు ప్రయాణాల జాబితాలో ఒకటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ రైలు ప్రయాణం దూద్సాగర్ జలపాతం పక్క నుంచే వెళ్తుంది. ప్రయాణికుల కోసం అక్కడ రైలు కాసేపు ఆగుతుంది కూడా. ఆ సమయంలో దూద్సాగర్ జలపాతపు అందాలతో పాటు ఇక్కడి ప్రకృతి అందాలను కూడా నేరుగా చూడొచ్చు.

కప్పిల్, తిరువనంతపురం
కేరళలోని కప్పిల్లో కొబ్బరి తోటల నుంచి సాగే రైలు ప్రయాణం కూడా దేశంలోని అత్యంత అందమైన రైలు ప్రయాణాలలో ఒకటి రైల్వే శాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రయాణం ఎర్నాకులం - కొల్లం - త్రివేండ్రం వరకు సాగుతుంది. ఈ రైలు ప్రయాణం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందినదిగా చెప్పొచ్చు. ఈ ట్రైన్ జర్నీ ప్రసిద్ధ బ్యాక్ వాటర్స్ గుండా వెళుతుంది. ఇక్కడి అందాలు పర్యాటకులను మైమరింపజేస్తాయి.

కల్కా-సిమ్లా,హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ప్రదేశ్లోని కల్క నుంచి సిమ్లా వరకు ఉన్న టాయ్ ట్రెయిన్ లో ప్రయాణం కూడా భారత్లోని అత్యంత అందమైన రైలు ప్రయాణమని కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ ప్రమాణం ఎంతో మధురానుభూతిగా ఉంటుంది. సుమారు 96 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం 1903లో ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతుంది. ఈ రైలు ప్రయాణం సుమారు 102 సొరంగాలు, 82 వంతెనల గుండా సాగుతుంది.



Click it and Unblock the Notifications














