అంతర్జాతీయంగా ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం మలయట్టూర్ చర్చ్. ఈ చర్చ్ మలయట్టూర్ హిల్స్ పై ఉంది. కాలంతో సంబంధం లేకుండా ఏంతో మంది భక్తులు ఈ చర్చ్ ని సందర్శించేందుకు వస్తారు. క్రైస్తవ భక్తుడైన సెయింట్ థామస్ ఏసుక్రీస్తు బోధనలని వ్యాప్తిచేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కొండపై అడుగు పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి.
శతాబ్దాల క్రితం సెయింట్ థామస్ కన్నె మేరీ కోసం ఒక పుణ్యక్షేత్రాన్ని కట్టాడని అదే ప్రదేశంలో ఈ మలయట్టూర్ చర్చ్ ని కట్టారని నమ్మకం. గ్రేకో రోమన్ నిర్మాణ శైలిలో ఈ చర్చ్ ని కట్టారు. అనేకమైన శిల్పాలలో మరియు చిత్రలేఖనాలలో ఏసుక్రీస్తు కి సంబందించిన అయిదు గొప్ప రహస్యాలు ఈ చర్చ్ గోడలపై చిత్రీకరించిన వాటిలో ముఖ్యమైనవి.
మలయట్టూర్ పెరున్నాల్ అనే పండగని ఈ చర్చ్ లో మార్చ్ నుండి ఏప్రిల్ వరకు ఆనందంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మలయట్టూర్ చర్చ్ లో ఉండే ప్రధాన ఆకర్షణలలో మార్తోమా మండపం, సన్నిధి, గోల్డెన్ క్రాస్, మిరాక్యులస్ వాటర్ స్ప్రింగ్, సెయింట్ థామస్ ఫుట్ ప్రింట్, మరియు సెయింట్ థామస్ భారీ విగ్రహం వంటివి ఖచ్చితంగా చూడవలసినవి. ఈ చర్చ్ కొచ్చి నుండి 45 కి మీ ల దూరంలో ఉంది.